ప్రధాని నరేంద్ర మోడీని మరోసారి ఆకాశానికి ఎత్తేశారు ఏపీ సీఎం చంద్రబాబు. ఆయన మూడు రోజుల పాటు అరబ్ దేశాల పర్యటనను ముగించుకుని వచ్చిన నేపధ్యంలో ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జాతీయ స్థాయి రాజకీయాలతో పాటు ఏపీ రాజకీయాల గురించి ఎన్నో విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన నరేంద్ర మోడీ గురించి కూడా చాలా విషయాలు ప్రస్తావించారు. దేశానికి నరేంద్ర మోడీ నాయకత్వం చాలా అవసరం అన్నారు.
ఈ దేశానికి సరైన సమయంలో సరైన నాయకుడు మోడీ అన్నారు. నరేంద్ర మోడీది అత్యంత శక్తివంతమైన నాయకత్వం అన్నారు. నరేంద్ర మోడీదే ఈ దశాబ్దం అని కొనియాడారు. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ప్రగతి శీల ప్రభుత్వమని కొనియాడారు. ప్రపంచంలో భారత్ ని నిలబెట్టడానికి మోడీ చేస్తున్న కృషి ప్రశంసనీయమని అన్నారు. దేశంలో సంస్కరణలు అన్నీ మోడీ హయాంలో పెద్ద ఎత్తున సాగుతున్నాయని అన్నారు. ప్రజల సాధికారత అభివృద్ధి కోసం పనిచేసే ప్రభుత్వం ఎన్డీయేది అన్నారు.
దేశ ప్రధానిగా మోడీ గత 11 ఏళ్ళుగా ఈ దేశాన్ని పాలిస్తున్నారు. రానున్న దశాబ్దం కూడా కచ్చితంగా మోడీదే అవుతుందని చంద్రబాబు చెబుతున్నారు. మోడీ నాయకత్వంలో దేశం ముందుకు సాగడమే కాదు భారతీయులు కూడా ప్రగతిపధంలో సాగుతున్నారని అన్నారు దాంతో ఇండియా కూటమి మోడీ సర్కార్ మధ్యలో దిగిపోతుంది అని ఏమైనా ఆశలు కానీ భ్రమలు కానీ పెట్టుకుంటే కనుక అవి ఒట్టివే అన్నట్లుగానే బాబు వ్యాఖ్యలు ఉన్నాయని అంటున్నారు.
ఏపీలో డబుల్ ఇంజన్ సర్కార్ తో విశేషమైన అభివృద్ధి గడచిన పదహారు నెలల కాలంలో జరుగుతోంది అని చంద్రబాబు చెప్పారు. రాష్ట్రానికి కేంద్ర సహకారం ఉంటే కచ్చితంగా ప్రగతి దారులు కనిపిస్తాయని బాబు అన్నారు. ఇపుడు అదే జరుగుతోంది అని ఆయన చెప్పారు. అమరావతి రాజధాని నిర్మాణం కానీ అలాగే వ్యవసాయంలో ప్రగతి కానీ టెక్నాలజీని అందిపుచ్చుకోవడం కానీ కొత్త పరిశ్రమలు పెట్టుబడులు ఏపీకి రావడం కానీ ఇవన్నీ తమ ప్రభుత్వం హయాంలో పెద్ద ఎత్తున సాగుతున్నాయని చంద్రబాబు చెప్పారు.
















