ఏపీ ప్రభుత్వం మహిళా సంక్షేమం కోసం, మహిళలకు ఆర్థిక భరోసా కల్పించడం కోసం అనేక పథకాలను అమలు చేస్తుంది. అంతేకాదు మహిళలకు కుటుంబ ఆర్థిక వ్యవహారాలలో కీలక భూమిక పోషించేలా మద్దతునిస్తుంది. ముఖ్యంగా డ్వాక్రా గ్రూపులలో ఉన్న మహిళల ఆర్థిక స్వావలంబనకు సహకారం అందిస్తున్న ఏపీ ప్రభుత్వం, డ్వాక్రా మహిళల ఆర్థిక లావాదేవీలలో పారదర్శకతను పెంపొందించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఒక యాప్ ను అందుబాటులోకి తెచ్చింది.
మన డబ్బులు మన లెక్కలు అనే నూతన ఏఐ ఆధారిత యాప్ ను ఆవిష్కరించిన ఏపీ సర్కార్ ఈ యాప్ ద్వారా నిధుల నిర్వహణను మరింత సులభతరం చేయడానికి, ఆర్థిక అక్రమాలను అరికట్టడానికి రూపొందించింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 260 ప్రాంతాలలో పైలెట్ ప్రాజెక్టుగా ఈ యాప్ ను వాడుతున్నారు. డిసెంబర్ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 83 లక్షల మంది డ్వాక్రా మహిళలకు నూతన యాప్ ను అందుబాటులోకి తీసుకొస్తారు.
ఈ కొత్త యాప్ ద్వారా డ్వాక్రా మహిళలు తమ బ్యాంకుఖాతా వివరాలను నేరుగా ఫోన్లో చెక్ చేసుకోవచ్చు. ఒక క్లిక్ తోనే ఖాతా స్టేట్మెంట్ వివరాలు కూడా వీరికి అందుబాటులోకి వస్తాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో పనిచేసే ఈ యాప్ మనకు ఏం వివరాలు కావాలో మౌఖిక ఆదేశాలు ఇస్తే అది సమాచారాన్ని అందిస్తుంది. బ్యాంకు పనుల గురించి అవగాహన లేని మహిళలు, నిరక్షరాస్యులు కూడా ఈ యాప్ వాడొచ్చు.
ప్రతినెల ఎంత డబ్బులు చెల్లిస్తున్నాం? పొదుపులో ఏమైనా తేడాలు ఉన్నాయా? వంటి వివరాలను ఇంట్లో కూర్చునే చూసుకోవచ్చు. వీటి పైన అనుమానం ఉంటే ఫిర్యాదు కూడా చేయవచ్చు. ఈ ఫిర్యాదులను రాష్ట్రస్థాయిలో పర్యవేక్షిస్తూ వారం రోజుల్లోనే వాటిని పరిష్కరించే లాగా చర్యలు తీసుకుంటారు. ఇక ఈ యాప్ ని వినియోగించడానికి మహిళలకు ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తారు.
రాష్ట్రంలో డ్వాక్రా మహిళలు ప్రతి సంవత్సరం బ్యాంకు లింకేజీ ద్వారా 40 వేల కోట్ల రూపాయలు పొదుపు ద్వారా మరో 20 వేల కోట్ల రూపాయలను ట్రాన్సాక్షన్ చేస్తున్నారు. అలాగే 40వేల కోట్ల వరకు తిరిగి రుణాలను కూడా చెల్లిస్తున్నారు. ఇంత భారీమొత్తంలో లావాదేవీలు జరుగుతున్నా అప్పుడప్పుడు నిధులు గోల్మాల్ వంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అందుకే ఈ సమస్యలను అధిగమించడం కోసం ప్రభుత్వం ఈ యాప్ ను తీసుకువచ్చింది.
ఈ యాప్ ద్వారా డ్వాక్రా గ్రూపు సంఘం పేరు, సభ్యుల ఐడి, సభ్యుల సంఖ్య ఇటువంటి ప్రాథమిక వివరాలతో పాటు వ్యక్తిగత వివరాలు కూడా నమోదుచేసి, వారికి సంబంధించిన పొదుపు, రుణాలు, కట్టిన మొత్తం ఇలా ప్రతీది తేదీలతో సహా అందుబాటులో ఉంటుంది. ప్రతిదీ పారదర్శకంగా ఈ యాప్ లో కనిపించడం వల్ల డ్వాక్రా గ్రూపుల నిర్వహణ సులభతరం అవుతుందని ప్రభుత్వం భావిస్తుంది.
యాప్ ద్వారా అన్ని విషయాలు పారదర్శకంగా తెలియడం వల్ల సంఘ సభ్యులలో కూడా జవాబుదారీతనం పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తుంది. ప్రస్తుతం కొన్ని జిల్లాలలో మాత్రమే పైలెట్ ప్రాజెక్టుగా కొనసాగుతున్న ఈ యాప్ ద్వారా అన్ని జిల్లాలలో డ్వాక్రా గ్రూప్ మహిళలకు అందుబాటులోకి రానుంది.