ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం.. పథకాల అమలు తీరుతెన్నులపై దృష్టి సారించింది. చిట్టచివరి లబ్దిదారుడి వరకూ వాటిని చేర్చడంపై కసరత్తు మొదలు పెట్టింది.
ఈ క్రమంలో నేడు పార్టీ విస్తృతస్థాయి సమావేశాన్ని చంద్రబాబు నిర్వహించనున్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశం ఏర్పాటైంది. దీనికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు హాజరు కానున్నారు. పార్టీ నియోజకవర్గ ఇన్ ఛార్జీలు, పొలిట్బ్యూరో సభ్యులు ఇందులో పాల్గొననున్నారు.
క్షేత్రస్థాయిలో వారి పనితీరును చంద్రబాబు సమీక్షించనున్నారు. దీనికి సంబంధించిన నివేదికలను ఇప్పటికే తెప్పించుకున్నారాయన. ఈ నివేదికలను ఆధారంగా చేసుకుని నేడు పార్టీ విస్తృతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఏడాది పాలన పూర్తిచేసుకున్న నేపథ్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజా ప్రతినిధులతో సమావేశాన్ని ఏర్పాటు చేయడం, తీవ్ర ఆరోపణలను ఎదుర్కొంటోన్న ఎమ్మెల్యేలతో ముఖాముఖి భేటీ కాబోతోండటం చర్చనీయాంశమైంది. క్షేత్రస్థాయిలో నెగెటివ్ రిపోర్టులు వచ్చిన ఎమ్మెల్యేలపై చంద్రబాబు కొరడా ఝళిపించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
వారికి తనదైన పద్ధతిలో హెచ్చరిస్తారని అంటున్నారు. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేల విషయంలో కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవచ్చని చెబుతున్నారు. దీనితో పాటు- జూలై 2వ తేదీ నుంచి చేపట్టనున్న ఇంటింటికీ మంచి ప్రభుత్వం కార్యక్రమంపైనా చంద్రబాబు సమీక్షించనున్నారు.
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంపై పార్టీ క్యాడర్ కు దిశానిర్దేశం చేయనున్నారు. దీనిపై ఓ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చే అవకాశం ఉంది. ఈ ఏడాది పాలనలో పాలన ఎలా ఉంది? ప్రజల నుంచి అందిన ఫీడ్ బ్యాక్ ఏమిటీ? మరిన్ని సంక్షేమ పథకాలను వారికి అందుబాటులోకి తీసుకుని రావడం వంటి అంశాలపై చర్చిస్తారు.