వైసీపీ అధికారంలో ఉండగా, బూతులతో చెలరేగిపోయిన ఆ పార్టీ సానుభూతిపరుడు, రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ పరిస్థితి దయనీయంగా మారింది. ఆయనపై నమోదైన కేసులలో వరుసగా బెయిల్ వస్తున్నా, అతడు జైలు నుంచి బయటకు రాకుండా కొత్త కేసులతో మళ్లీ జైలుకు పంపుతున్నారు. దీంతో దాదాపు ఆరు నెలలుగా బోరుగడ్డ జైలులోనే ఉండాల్సివస్తోంది. ఈ నెల 19 సోమవారం నాటికి ఆయనపై నమోదైన సోషల్ మీడియా కేసులు అన్నింటికీ బెయిల్ లభించి జైలు నుంచి విడుదలకు లైన్ క్లియర్ అయినా, గుంటూరు జిల్లాలో ఓ కేసు వెలుగుచూడటంతో మళ్లీ అరెస్టు అయ్యాడు. దీంతో కోర్టు మరో 14 రోజులు రిమాండ్ విధించింది.
గత ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతలే టార్గెట్ గా బోరుగడ్డ అనిల్ చెలరేగిపోయాడు. సోషల్ మీడియా వేదికగా తీవ్ర దుర్భాషలు ఆడిన ఆయన వీడియోలు వైరల్ అయ్యాయి. వైసీపీతో బోరుగడ్డకు నేరుగా ఎలాంటి సంబంధం లేకపోయినా, తాను మాజీ సీఎం జగన్ కు వీరాభిమానిగా బోరుగడ్డ చెప్పుకుంటూ హల్చల్ సృష్టించేవాడు. అంతేకాకుండా వైసీపీ ముఖ్య నేతలతో అనుబంధం ఏర్పరుచుకోవడం, వారి డైరెక్షన్ లోనే అప్పటి ప్రతిపక్ష నేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్, వంగలపూడి అనితపై తీవ్ర పదజాలంతో దూషణలకు దిగాడని కేసులు నమోదయ్యాయి.
వైసీపీ అధికారంలో ఉండగా, బోరుగడ్డను ఎవరూ టచ్ చేయలేకపోయారు. వైసీపీ పెద్దల పరోక్ష సహకారంతో తనకు తిరుగులేదన్నట్లు ప్రవర్తించిన బోరుగడ్డకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పరిస్థితి ప్రతికూలంగా మారింది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుటుంబ సభ్యులపై దూషణలకు దిగడంతో తొలుత గుంటూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత బోరుగడ్డపై వరుస కేసులు నమోదవ్వడంతో సుమారు ఆరు నెలలుగా రాజమండ్రి సెంట్రల్ జైలులోనే గడుపాల్సివస్తోంది. మధ్యలో ఒకసారి మధ్యాంతర బెయిలు వచ్చినా, నకిలీ సర్టిఫికెట్లు సృష్టించాడనే ఆరోపణతో కొత్త కేసులు నమోదయ్యాయి. ఇక తాజాగా ఆ కేసులోనూ బెయిలు రావడంతో సోమవారం బోరుగడ్డ విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయని అనుకున్నారు.
సోమవారం జైలు నుంచి విడుదలకు నిబంధనల ప్రకారం ఏర్పాట్లు చేయడంలో ఆలస్యం జరగడంతో బోరుగడ్డ విడుదల మంగళవారిని వాయిదా పడింది. ఇక మంగళవారం బోరుగడ్డ బయటకు వచ్చేస్తాడనే సమయంలో గుంటూరు పక్కనే ఉన్న కాకాని పోలీసులు బోరుగడ్డపై నమోదైన పెండింగు కేసును బయటకు తీశారు. పెదకాకానిలో తన భూమి సర్వే చేయకుండానే సర్టిఫికెట్ ఇవ్వాలని సర్వేయర్ ను ఆయన బెదిరించినట్లు గతంలో కేసు నమోదైంది. వైసీపీ హయాంలోనే ఈ కేసు నమోదు అయినా, అప్పట్లో ఆయనకు ఉన్న పరపతితో పోలీసులు చర్యలు తీసుకోలేదు. ఇక ఇప్పుడు కూటమి ప్రభుత్వం బోరుగడ్డపై కఠినంగా వ్యవహరిస్తుండటంతో పాత కేసులో అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. దీంతో మరో 14 రోజులు ఆయన జైలులో గడపాల్సిన దుస్థితి ఎదురైంది.
ఇక భవిష్యత్తులోనూ ఆయన అంత సులువుగా బయటకు వచ్చే పరిస్థితులు ఉన్నాయా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ నేతల అండదండలతో గతంలో చెలరేగిపోయిన బోరుగడ్డ విషయంలో ఇప్పుడు ఏ నేత కూడా బహిరంగంగా సహకరించే సాహసం చేయడం లేదు. ఆయన వీడియోల్లో సభ్యత కనిపించకపోవడం, అతడికి సహకరిస్తే తమకు రాజకీయంగా నష్టం జరుగుతుందనే భయంతో ఎవరూ కూడా అతడికి సాయం చేయడం లేదంటున్నారు. ఈ పరిస్థితుల్లో బోరుగడ్డ విడుదల ఇప్పట్లో ఉంటుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.