ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకలి, దాహార్తి తీర్చడానికి ఆనాడు అన్న ఎన్టీఆర్ నుంచి నేటి మన అధినేత చంద్రబాబు నాయుడు వరకు ఇరిగేషన్ రంగానికి అధిక ప్రాధాన్యం ఇచ్చారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. మహానాడులో నీటి పారుదల కు సంబంధించి ప్రతిపాదించిన తీర్మానం సందర్భంగా ఆయన మాట్లాడారు. పంచభూతాలలో ఒకటైన నీటి ఆవశ్యకతను, ప్రాధాన్యతను ఆనాడే మన పార్టీ అగ్రనేతలు గమనించారన్నారు. జల వనరులు ఉన్నచోటే నాగరికతలు వెల్లి విరుస్తాయనే చారిత్రక సత్యాన్ని మన పార్టీ ఆవిర్భావ దశలోనే గుర్తించి నీటి వనరుల సద్వినియోగానికి అనేక ప్రణాళికలు రచించిందని, ప్రాజెక్టులకు రూపకల్పన చేసింది అన్నారు. రాష్ట్రానికి ఆయువుపట్టు, జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుపై మన ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టి పని చేసింది అన్నారు. 2014-19 లో నాటి మన ప్రభుత్వం 72 శాతం పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి చేయగా తదనంతరం వచ్చిన వైకాపా ప్రభుత్వం ఆ ప్రాజెక్టుని విధ్వంసం చేసిందన్నారు. 20 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్లి పోయిందన్నారు . 2027 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి రాష్ట్రాన్ని కరువు రహితంగా చేయాలని చంద్రబాబు లక్ష్యంగా నిర్ణయించి పనులు పరుగులు పెట్టిస్తున్నారని చెప్పారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే గోదావరిలో ఏటా వృధాగా పోతున్న 3000 టిఎంసి ల నీటిని, రాయలసీమకు తరలించి రతనాల సీమ చేయాలనేది ముఖ్యమంత్రి లక్ష్యంగా మంత్రి రామానాయుడు వివరించారు. ఇందుకు 80 వేల కోట్లు అంచనా వ్యయంతో పోలవరం బనకచర్ల లింక్ ప్రాజెక్టుకు రూపకల్పన చేసి వడివడిగా అడుగులు వేస్తున్నట్లు చెప్పారు. ఇది పూర్తయితే రాయలసీమ పచ్చని పైర్లతో అలరారుతుందన్నారు. అలాగే పోలవరం ఎడమ కాలువ పూర్తి చేయడం ద్వారా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తవుతుందన్నారు. విశాఖ నగరానికి తాగునీరు, విశాఖ ఉక్కు వంటి తదితర అనేక పారిశ్రామిక అవసరాలకు పూర్తిస్థాయి నీటిని అందించగలుగుతామన్నారు.
ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికి అన్న ఎన్టీఆర్ నుంచి నేటి మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు వరకు అనేక నీటిపారుదల ప్రాజెక్టులకు రూపకల్పన చేసి అమలు చేసిన, చేస్తున్న ఘనత మన తెలుగుదేశం పార్టీకే దక్కుతుందని అనడంలో సందేహము లేదన్నారు. తెలుగు గంగ,హంద్రీనీవా, గాలేరు నగరి, కేసీ కెనాల్ తదితర అన్ని నీటిపారుదల ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాల గురించి మంత్రి రామానాయుడు పేరుపేరునా వివరించారు. వాటి ప్రస్తుత పరిస్థితిని చెప్పారు. అలాగే అవి ఎప్పటికీ పూర్తి చేస్తామో కూడా ఆయన మహానాడులో ప్రకటించారు.
రాయలసీమ ప్రజలకు ఏదైనా మంచి చేశారు అంటే.. ఆ ఘనత చంద్రబాబునాయుడు కే దక్కుతుందని మంత్రి అన్నారు. రాయలసీమ ద్రోహి అంటూ ఎవరన్నా ఉన్నారంటే.. రాయలసీమకు ఎవరూ చేయని అన్యాయం చేసింది ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని రామానాయుడు విమర్శించారు. 2014 -19 మధ్యకాలంలో నాటి టీడీపీ ప్రభుత్వం మొత్తం బడ్జెట్ 7 లక్షల కోట్లు అయితే, ప్రభుత్వం ఇరిగేషన్ కు 72,000 కోట్లు కేటాయించినట్లు మంత్రి రామానాయుడు స్పష్టం చేశారు. అదే దుర్మార్గ వైకాపా ప్రభుత్వం బడ్జెట్ రెట్టింపు అయి 12 లక్షల కోట్లకు పెరిగినా ఐదేళ్లలో ఇరిగేషన్ కేటాయించింది కేవలం 32 వేల కోట్లు మాత్రమేనని రామానాయుడు ఎండగట్టారు. ఈ 32 వేల కోట్లు కూడా ఎక్కడ ఖర్చు పెట్టారో..ఏం చేశారో ఎవరికి తెలియదు అని విమర్శించారు. ఎందుకంటే రాష్ట్రవ్యాప్తంగా మన తెలుగుదేశం ప్రభుత్వం ఆనాడు చేపట్టి ప్రారంభించిన ఏ ఒక్క ప్రాజెక్టు కూడా వైకాపా ప్రభుత్వం పూర్తి చేయలేదు.. తట్టెడు మట్టి కూడా ఎక్కడ వేయలేదు. ఎక్కడి పనులు అక్కడే వదిలేసింది. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరాన్ని రెండు శాతం పనులు చేసి చేతులు దులుపుకుంది. అది కూడా విధ్వంసకరపనులు చేసి ప్రాజెక్టుకి మరో వెయ్యి కోట్లు అదనపు ఖర్చుకు కారణభూతమైందని మంత్రి అన్నారు. మరి విడ్డూరం ఏంటంటే.. కరవుతాండవిస్తున్న ప్రకాశం జిల్లాను ఆ రక్త కోరల నుండి కాపాడడానికి తెలుగుదేశం ప్రభుత్వం వెలిగొండ ప్రాజెక్టుకు శ్రీకారం చుడితే.. ప్రాజెక్టు పూర్తికాకుండానే జగన్మోహన్ రెడ్డి దాన్ని పూర్తయిపోయింది అని చెప్పటం, ప్రారంభించటం, జాతికి అంకితం చేసేయటం దారుణమన్నారు. ఈ దగా, మోసం చూసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాదు.. మీడియా సైతం విస్తు పోయిందన్నారు.