ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనుల పునఃప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. శుక్రవారం (మే 2) సాయంత్రం అమరావతిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ‘అమరావతి పున:నిర్మాణ’ పనులకు శ్రీకారం చుట్టారు. సుమారు 60 వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి మీద తనకు పూర్తి విశ్వాసం ఉందని, ఆయన చెప్పినట్లుగానే మూడేళ్లలో అమరావతిలో నిర్మాణ పనులు పూర్తవుతాయని నరేంద్ర మోదీ అన్నారు. జూన్ 21న విశాఖపట్నంలో నిర్వహించే యోగా దినోత్సవ వేడుకలకు హాజరవుతానని ప్రధాని మోదీ చెప్పారు
ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మరో అపూర్వ ఘట్టం ఆవిష్కృతమైంది. ఆంధ్రుల కల సాకారం కాబోతోంది. ఐదు కోట్ల మంది ఆంధ్రులు ఆశ, ఆకాంక్ష అయిన అమరావతి పున:ర్నిర్మాణ పనులకు ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. ‘అమరావతి పునఃప్రారంభం’ పేరుతో ఈ వేడుకను నిర్వహించారు. రూ. 58 వేల కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన చేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద విశ్వాసం ఉందని, అమరావతి నగర నిర్మాణం మూడేళ్లలో పూర్తవుతుందని ప్రధాని మోదీ చెప్పారు. అమరావతిలో తలపెట్టిన అభివృద్ధి ప్రాజెక్టులన్నీ పూర్తైతే, ఆంధ్రప్రదేశ్ జీడీపీ గణనీయంగా పెరుగుతుందని అన్నారు.
పోలవరం ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి పూర్తి చేస్తాం. ఒకప్పుడు ఏపీ, తెలంగాణకు రైల్వే బడ్జెట్ రూ.900 కోట్ల లోపే ఉండేది. ఇప్పుడు ఒక్క ఏపీకే రూ. 9000 కోట్ల రైల్వే నిధులు కేటాయించాం. ఏపీలో కనెక్టివిటీకి కొత్త అధ్యాయం మొదలవుతుంది. రైల్వే ప్రాజెక్టులతో రాష్ట్రాల మధ్య అనుసంధానం పెరుగుతుంది. ఇది ఆర్థిక, పర్యాటక అభివృద్ధికి దోహదం చేస్తుంది’ అని ప్రధాని మోదీ అన్నారు.
దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్.. భారత అంతరిక్ష ప్రయోగాలకు కేంద్రంగా ఉంది. శ్రీహరికోట కోట నుంచి జరిగే ప్రతి రాకెట్ ప్రయోగం.. యావత్ దేశవాసులను ఉత్తేజం కలిగిస్తోంది. నాగాయలంకలో డీఆర్డీవో మిస్సైల్ టెస్టింగ్ కేంద్రం ఏర్పాటు చేసుకోబోతున్నాం. ఇది భారత రక్షణ, పరిశోధన రంగానికి మరింత ఊతమిస్తుంది.
ఇవి కేవలం శంకుస్థాపనలు కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రగతికి, వికసిత్ భారత్కు నిదర్శనాలు. ఒక స్వప్నం సాకారం అవుతుందనే విషయం కళ్లముందు కనిపిస్తోంది. ఒక ఉత్తమమైన పనిని ప్రారంభించాలన్నా, దాన్ని మెరుగ్గా, వేగంగా పూర్తిచేయాలన్నా.. దేశంలో ఒక చంద్రబాబు నాయుడు వల్లే సాధ్యం’ అని నరేంద్ర మోదీ అన్నారు. దుర్గా భవానీ కొలువైన పుణ్యభూమిలో మిమ్మల్ని కలవడం ఆనందంగా ఉంది అంటూ తెలుగులో ప్రసంగం ప్రారంభించారు మోదీ.
రాజధాని పనులతో పాటు రూ.58,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. అమరావతి సభావేదిక నుంచే శంకుస్థాపన చేశారు. వీటిలో రూ.49,040 కోట్ల విలువైన అభివృద్ధి పనులను రాజధాని అమరావతిలో చేపడతారు. రూ. 8 వేల కోట్ల విలువైన కేంద్ర ప్రాజెక్టులకు కూడా ఈ సందర్భంగా ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. మొత్తం 18 ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు.
ఒక్క అమరావతిని మాత్రమే కాక అన్ని జిల్లాలను అభివృద్ధి చేస్తాం. మోదీ సూచనల మేరకు ఏపీ అభివృద్ధికి చర్యలు తీసుకుంటాము. విశాఖకు రైల్వే జోన్ వచ్చింది. దానికి కూడా కేంద్రానికి ప్రత్యేక ధన్యవాదాలు. సీమలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తాం. కడపలో స్టీల్ ప్లాంట్ వస్తుంది. భోగాపురం విమానాశ్రయాన్ని త్వరలోనే ప్రారంభిస్తాం. బిట్స్ పిలానీ వంటి సంస్థలు మన రాష్ట్రానికి రావడానికి ఆసక్తి చూపుతున్నాయి అని చంద్రబాబు చెప్పుకొచ్చారు.
చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. “ఏపీ చరిత్రలో నేడు శాశ్వతంగా లిఖించదగ్గ రోజు. ఏ రోజైతే అమరావవతి పనులు నిలిచిపోయాయో.. ఆనాటి నుంచి ఐదేళ్ల పాటు విధ్వంసం జరిగింది. అలాంటిది నేడు ప్రధాని నరేంద్ర మోదీ.. తిరిగి అమరావతి పనులను ప్రారంభించేందుకు తిరిగి విచ్చేశారు. ఇంతకన్నా గొప్ప రోజు మరొకటి లేదు. ఈసారి మేం మోదీని కలిసినప్పుడు మా సమావేశం చాలా గంభీరంగా కనిపించింది. అందుకు కారణం ఈ సారి ఉగ్రదాడిలో మన ప్రజలు చనిపోయారు అనే బాధలో ఆయన ఉండిపోయారు. ఈ సందర్భంగా వారికి మాట ఇస్తున్నాం.. ఉగ్రవాదంపై మోదీ ఎలాంటి చర్యలు తీసుకున్నా.. మేం ఆయనకు అండగా ఉంటాం” అని చెప్పుకొచ్చారు.
ఒక కుటుంబం, ఒక ఇండస్ట్రీ, సంస్థ ఏదైనా సరే దానికి మంచి నాయకుడు ఉంటే.. చాలా బాగుపడుతుంది. నేడు మోదీ నాయకత్వాన్ని ప్రతి ఒక్కరు అంగీకరిస్తున్నారు. మోదీ అధికారంలోకి వచ్చాక ఆర్థికాభివద్ధిలో 10వ స్థానంలో ఉన్న ఇండియా ఇప్పుడు 5వ స్థానంలోకి వచ్చింది. త్వరలోనే 4వ స్థానంలోకి వెళ్తుందని ఐఎంఏఫ్ వెల్లడించింది అన్నారు చంద్రబాబు.
నిన్నటి క్యాబినేట్ సమావేశంలో కుల గణన మీద మోదీ నిర్ణయం తీసుకున్నారు. ఇది చాలా మంచి నిర్ణయం.. ఇలాంటివి కేవలం మోదీ వల్లనే సాధ్యమవుతాయి. మోదీ నాయకత్వలో ఇండియా సురక్షితంగా, వేగంగా అభివృద్ధి చెందుతుందని చంద్రబాబు వెల్లడించారు.
2024లో మేం అధికారంలోకి వచ్చిన సమయంలో ఆర్థిక వ్యవస్థ వెంటిలేటర్ మీద ఉంది. మోదీ సాయంతో ఇప్పుడీప్పుడే కోలుకుంటుంది. మరి కొన్ని రోజుల పాటు ఇదే సహకారం కొనసాగితే.. మా భవిష్యత్తు బాగుటుంది అన్నారు. 5 కోట్ల మంది ప్రజల ఆశలు, కలల్ని నేరవేర్చనుంది. రైతులు, మహిళలు, విద్యార్థుల వల్ల ఈ కల సాకారం అయ్యిందని చంద్రబాబు చెప్పుకొచ్చారు.
పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. “అమరావతి పున:ప్రారంభం సందర్భంగా వేల ఎకరాల భూములిచ్చిన రైతులు గత 5 సంవత్సరాలుగా నలిగిపోయి.. రోడ్ల మీదకు వచ్చి.. పోలీసు లాఠీ దెబ్బలు తిన్నారు. ఈ ఐదేళ్లలో సుమారు 2 వేల పైచిలుకు రైతులు చనిపోయారు. ఇది మన మోదీకి తెలుస్తుందా అని ఐదేళ్ల క్రితం మహిళా రైతులు మమ్మల్ని ప్రశ్నించారు. ఆయనకు తెలియకుండా ఏది ఉండదని మేం అన్నాం. అన్నట్లుగానే ఈరోజు అమరావతి పున: ప్రాంరభం కాబోతుంది” అన్నారు.
5 కోట్ల మందికి అమరావతి జీవనాడి. అమరావతి పున:ప్రారంభానికి విచ్చేసిన మోదీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గత ప్రభుత్వంలో అమరావవతి అంటే పరాదాలు, సెక్షన్లు గుర్తుకు వచ్చేలా చేశారు. అయితే రైతులు ఈ ధర్మ యుద్ధంలో విజయం సాధించారు అని తెలిపారు పవన్ కళ్యాణ్.
“5 కోట్ల మంది ప్రజల తరఫున రైతులు, మహిళలు, విద్యార్థులు తిన్న గాయాలు మా మదిలో ఏన్నాయి. మీ త్యాగాలను మేం మర్చిపోం. మీ ఆశలకు అనుగుణంగా అమరావతి నిర్మాణం ఉంటుంది. అమరావతి మహిళా రైతుల పాత్ర అమోఘం. వారికి ప్రత్యేక అభినందనలు. అందరి ఆశలకు అనుగుణంగా అమరావతి నిర్మాణ, అభివద్ధి ఉంటుంది” అన్నారు పవన్ కళ్యాణ్.
ఇంత ఇబ్బందికర పరిస్థితుల్లో కూడా మోదీ అమరావతికి వచ్చారు. పహల్గాం దాడిలో 27 మంది చనిపోయారు. అయినా మోదీ ఇ్కడకు వచ్చారు. వారికి మన భవానీ అమ్మ వారు ధైర్యం ఇవ్వాలని కోరుకుంటున్నాము అన్నారు పవన్ కళ్యాణ్.
అమరావతి నమో నమ: అంటూ ఐటీ మినిస్టర్ నారా లోకేష్ ప్రసంగం ప్రారంభించారు. పహల్గాం ఉగ్ర దాడిలో చనిపోయిన వారికి నివాళులర్పించారు. ఒక్క పాక్ కాదు.. వంద పాక్లు వచ్చినా భారత దేశం గడ్డ మీద మొలిచిన గడ్డిని కూడా పీకలేదు. వంద పాకిస్థాన్లను ఎదుర్కొనే భారత్ ఏకైక మిస్సైల్ మన నమో(నరేంద్ర మోదీ) అంటూ ప్రశంసలు కురిపించారు. పాక్పై చర్యలు ఎలాంటివి అయినా దేశం ఆయనకు మద్దతుగా ఉంటుందన్నారు లోకేష్.
మోదీకి అమరావతి అంటే చాలా ఇష్టం. అందుకే ఇంత బిజీ షెడ్యూల్లో కూడా ఆయన రాష్ట్రానికి వచ్చారు. కావాల్సినన్ని నిధులు కేటాయిస్తున్నారు. నేడు అనేక పనులు ప్రారంభించబోతున్నారు. నమో ప్రారంభించిన అమరావతిని ఆపే దమ్ము ఎవరికి లేదు. ఇక అమరావతి అన్స్టాపబుల్. ఇకపై అన్ని కార్యక్రమాలు జెట్ స్పీడ్తో సాగుతాయి అన్నారు.
రాజధాని పునర్మిర్మాణ సభా వేదిక మీదకు చేరుకున్న ప్రధాన నరేంద్ర మోదీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా సన్మానించారు. ధర్మవరం శాలువా కప్పి, అనంతరం ప్రత్యేక జ్ఞాపికను సీఎం, డిప్యూటీ సీఎం ఆయనకు బహుకరించారు.
అమరావవతి పునర్నిర్మాణ సభలో పాల్గొనడం కోసం శుక్రవారం మధ్యాహ్నం అమరావతి చేరుకున్న మోదీకి ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు ఘన స్వాగతం పలికారు. అనంతరం చంద్రబాబు కాన్వాయ్లోనే ప్రధాని నరేంద్ర మోదీ సభా ప్రాంగణానికి ప్రారంభం అయ్యారు. మరికాసేట్లో అమరావతిలో రాజధాని పునర్మిర్మాణ పనులు ప్రారంభించనున్నారు.