వైసీపీ అధినేత జగన్ బుధవారం పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని రెంటపాళ్లకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో జగన్ ప్రసంగం, హాజరైన జనం, పోలీసుల తీరు వీటికి సంబంధించిన చర్చంతా ఒకెత్తు అయితే.. ఈ సందర్భంగా వైసీపీ శ్రేణులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు మరొకెత్తు. ఆ ఫ్లెక్సీల్లో రాసిన డైలాగులు ఇంకొకెత్తు. దీనిపై సర్వత్రా విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి.
అవును… రెడ్ బుక్ మహిమో.. లేక, 11 సీట్ల ఫ్రస్ట్రేషన్ పీక్స్ కి చేరిందో ఏమో కానీ… ఇటీవల కాలంలో రాష్ట్రంలో జగన్ ఏ పర్యటనకు వెళ్లినా అక్కడ వైసీపీ శ్రేణులు రెచ్చిపోయిన్ ప్రవరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా… సినిమా డైలాగులతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. వాటిలో రాజకీయ ప్రత్యర్థులకు తీవ్ర పదజాలాలతో ఘాటు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
దీంతో… పరామర్శల ముసుగులో జగన్ చేస్తున్న ఈ తరహా రాజకీయ పర్యటనలు తీవ్రస్థాయిలో ఉద్రిక్తతలు రెచ్చగొట్టేలా సాగుతున్నాయని అంటున్నారు. చట్టాలు, నిబంధనలు, పోలీసు వ్యవస్థపై ఏమాత్రం గౌరవం లేకుండా వైసీపి శ్రేణులు వీధుల్లో చేస్తున్న హల్ చల్ అంతా ఇంతా కాదని అంటున్నారు. ఈ అరాచకాలను కట్టడి చేయాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని గుర్తు చేస్తున్నారు.
వాస్తవానికి ఏపీలోని ఏ పార్టీ రాజకీయ సభ పెట్టినా అక్కడ సినిమా డైలాగులు, వాటితో కూడిన ఫ్లెక్సీలు, వారి వారి అభిమాన నటుల ఫోటోల ప్రదర్శన సహజంగా ఉండేదే. ఇప్పుడు నీతులు చెబుతున్న నేతలు.. ఎన్నికల సమయంలో పచ్చి బూతులు మాట్లాడిన వాళ్లే! అయితే… ప్రత్యేకంగా ప్రత్యర్థులను హెచ్చరించడానికే అన్నట్లుగా జగన్ పర్యటనలు సాగుతున్నాయనే చర్చ ఇటీవల కాలంలో బలంగా వినిపిస్తుంది.
దీంతో.. లోకేష్ రెడ్ బుక్ ట్రాప్ లో వైసీపీ పడుతోందా అనే చర్చా మొదలైంది. ప్రజా సమస్యలపైనా, ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలపైనా, అధికారంలో ఉన్న పార్టీలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంపైనా స్పందించాల్సిన ప్రతిపక్షం, పోరాడాల్సిన ప్రతిపక్షం… ఇలాంటి సినిమా డైలాగులు చెప్పడం వల్ల ప్రజలకు ఒరిగేదేమిటో కూడా గ్రహించాలని పలువురు సూచిస్తున్నారు.
వాస్తవానికి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా.. వెంటనే పోలీసులు రంగంలోకి దిగేవారు. ముందస్తు అరెస్టులు, గృహ నిర్బంధాలతో పార్టీ నేతల్ని కాలు బయట పెట్టనిచ్చేవారు కాదు. అప్పటి విపక్ష నేత చంద్రబాబు ఇంటి గేటుకే తాళ్లు కట్టేసి బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. అయితే… ఇప్పుడు పరిస్థితి అంతలా లేదు!
జగన్ చేస్తున్న పర్యటనలకు కూటమి ప్రభుత్వం ఎలాంటి అడ్డంకులూ పెట్టడం లేదు. అన్ని అనుమతులు ఇస్తుంది. కాకపోతే శాంతిభద్రతల దృష్ట్యా పోలీసులు వారి పనులు వారు చేస్తున్నారు. ఇలాంటి అవకాశాన్ని జగన్.. ప్రజాపోరాటాలకు వాడుకుంటే పార్టీకి, ప్రజలకు ఎంతో మేలు జరిగే అవకాశం ఉందని అంటున్నారు.
అలా కాకుండా.. ఈ తరహా “రప్పా రప్పా” డైలాగుల వల్ల ఉన్నది కాస్తా ఊడుతుందని హెచ్చరిస్తున్నారు! ప్రజలకు కావాల్సింది ఇచ్చిన మాటలు నిలబెట్టుకుని పాలించే ప్రభుత్వం.. ప్రభుత్వం ఆ మాట తప్పితే, తమ తరుపున పోరాడాల్సిన ప్రతిపక్షం. ఇలాంటి డైలాగులు కావాలంటే.. సినిమాలు ఉన్నాయి కదా.. వైసీపీ ఎందుకు?
ఇక.. జగన్ తాజా పర్యటనలో వైసీపీ శ్రేణులు ప్రదర్శించిన ఫ్లెక్సీల్లోని డైలాగులు ఈ విధంగా ఉన్నాయి!
2029లో వైసీపీ అధికారంలోకి రాగానే గంగమ్మ జాతరలో వేట తలలు నరికినట్టు రప్పా రప్పా నరుకుతాం ఒక్కొక్కడినీ..!
రాజారెడ్డి రాజ్యాంగం పల్నాడు నుంచే మొదలు..!
పొట్టేళ్లను నరికినట్టు నరుకుతాం.. నా కొడకల్లారా..!
అన్న వస్తాడు… అంతు చూస్తాడు..!
ఐయామ్ డిక్లేరింగ్ ద వార్.. జగన్ 2.0..!
ఎవడైనా రానీ.. తొక్కిపడేస్తాం..!