Y.S.Jagan: వైయస్ జగన్మోహన్ రెడ్డి తిరిగి పార్టీ పరంగా ఎంతో యాక్టివ్ అవుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్న తరుణంలో రాష్ట్ర వ్యాప్తంగా కూటమికి వ్యతిరేకత ఏర్పడుతుందని తెలుసుకున్న జగన్ తన పార్టీని ప్రజలలో బలపరచుకోవడానికి ఇదే సరైన సమయం అని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే తిరిగి సర్వేలు చేయించడానికి ఐపాక్ టీం ను మరోసారి కలిసారని తెలుస్తోంది. గత ఎన్నికలకు ముందు కూడా వైయస్ జగన్మోహన్ రెడ్డి కోసం ఐ పాక్ టీం పని చేశారు.
వీరు వెల్లడించిన సర్వేలకు వ్యతిరేకంగా ఫలితాలు రావడంతో కాస్త నిరాశ చెందారు. ఇలా ఓటమి పాలు కావడంతో జగన్మోహన్ రెడ్డి ఐప్యాక్ కార్యాలయాన్ని కూడా తీసి వేశారు.అయితే తిరిగి ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. జనంలో మంచి ఊపు ఉందని, అయితే ఫీల్డ్ లెవెల్ లో తనకు ఖచ్చితమైన సమాచారం తెలియాలంటే ఐ ప్యాక్ టీం అవసరాన్ని గుర్తించిన జగన్ మరోసారి దానిని రంగంలోకి దించాలని నిర్ణయించారని తెలిసింది. త్వరలోనే ఐ ప్యాక్ టీం తిరిగి ఆంధ్రప్రదేశ్ లో కార్యక్రమాలను ప్రారంభిస్తుందని కూడా పార్టీ వర్గాలు తెలియజేస్తున్నారు.
క్షేత్రస్థాయిలో పరిస్థితులను తెలుసుకుని తనకు అప్పగించడమే కాకుండా ఎప్పటికప్పడు నివేదికలను అందించడానికి ఐ ప్యాక్ టీం ను తిరిగి యాక్టివ్ చేయాలని వైఎస్ జగన్ నిర్ణయించారు. రుషిరాజ్ నేతృత్వంలోనే ఐ ప్యాక్ సంస్థ పనిచేసేందుకు సిద్ధమవుతున్నారని తెలిసింది. జనాభా గణన మొదలు కానుండటంతో పాటు 2027లో ఎన్నికలు జరుగుతాయన్న ప్రచారంతో జమిలి ఎన్నికల నేపథ్యంలో ఐ ప్యాక్ ను త్వరగానే రంగంలోకి దించాలనే ఆలోచనలో వైయస్ జగన్ ఉన్నట్టు తెలుస్తుంది. ఇక ఈ ఐపాక్ టీం ప్రశాంత్ కిషోర్ ది అయినప్పటికీ ఆయన బీహార్ రాజకీయాలకు పరిమితం కావడంతో ఐప్యాక్ సంస్థలో పనిచేసిన వారు దానిని నిర్వహిస్తున్నారు.