దిగ్గజ ఆన్లైన్ వీడియో షేరింగ్ ప్లాట్ ఫామ్ యూట్యూబ్ గురించి తెలియని వారు ఉండరు. ఇటీవలి కాలంలో యూట్యూబ్ ద్వారా ఉపాధి పొందుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. వీడియోలు తీస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు. అయితే, యూట్యూబ్ ఇప్పుడు మానిటైజేషన్ పాలసీకి కీలక మార్పులు చేసింది. యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ (YPP) నియమాలు మార్చింది. సవరించిన ఈ కొత్త రూల్స్ జులై 15, 2025 నుంచే అమల్లోకి రానున్నాయి. కంటెంట్ క్రియేటర్లు చాలా జాగ్రత్తగా వీడియోలు చేస్తేనే డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. లేదంటే శ్రమంతా వృథా అవుతుందని చెప్పవచ్చు
ఇకపై ఇష్టారీతిలో వీడియోలు తీస్తే రెవెన్యూ రాదని యూట్యూబ్ కంపెనీ తెలిపింది. కంటెంట్ ఇతరులతో పోలిస్తే విభిన్నంగా, ఒరిజినల్గా, వినోదం, జ్ఞానం కలిగించే విధంగా ఉండాలని తెలిపింది. ఇతరల కంటెంట్కు కొద్దిగా మార్పులు చేస్తూ తక్కువ కష్టంతో వీడియోలు చేస్తే అలాంటి ఛానెల్స్ డీమానిటైజ్ అవుతాయని హెచ్చరించింది. అలాగే పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో రూపొందించిన వీడియోలను కూడా ప్రోత్సహించమని, మానిటైజేషన్కు ఆ వీడియోలు పనికిరావని తెలిపింది. కాబట్టి కంటెంట్ క్రియేటర్లు తమ వీడియోల్లో కొత్తదనం, సొంత కంటెంట్ ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం. అలా చేస్తేనే ఛానెల్ మానిటైజ్ అవుతుంది. డబ్బులు వస్తాయి.
యూట్యూబ్ కొత్త నియమాలు
ఇతర వీడియోల నుంచి కంటెంట్ తీసుకోకుండా తమ సొంతంగా సిద్ధం చేసిన కంటెంట్ ఉండాలి. ఇతర వీడియోల్లోని కంటెంట్ తీసుకుంటే దానిని గణనీయంగా, గుర్తించని విధంగా మార్చేయాల్సి ఉంటుంది. కంటెంట్ అనేది కేవలం వీక్షణల కోసమే కాకుండా, అది వినోదాత్మకంగా, విద్యాపరంగా ఉండాలి.
యూట్యూబ్ పార్టనర్ ప్రోగ్రామ్లో చేరేందుకు యూట్యూబ్ ఛానెల్ కనీసం 1,000 సబ్స్క్రైబర్లను కలిగి ఉండాలి. అలాగే గత ఏడాది కాలంలో 4,000 గంటల పబ్లిక్ వాచ్ టైమ్ ఉండాలి. లేదా గత 90 రోజుల్లో 10 మిలియన్ పబ్లిక్ షార్ట్స్ వ్యూస్ రావాలి. అప్పుడే ఆ ఛానెల్ మానిటైజేషన్ అర్హత పొందుతుంది.