టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ కింగ్ డమ్. స్పై యాక్షన్ థ్రిల్లర్ గా రానున్న ఆ సినిమాకు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీలంక శరణార్థుల బ్యాక్ డ్రాప్ లో సీరియస్ డ్రామాగా రూపొందిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.
భాగ్యశ్రీ బొర్సే హీరోయిన్ గా నటిస్తుండగా.. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న కింగ్ డమ్ మూవీపై ఆడియన్స్ లో మంచి అంచనాలు ఉన్నాయి. మేకర్స్ కొద్ది రోజుల క్రితం రిలీజ్ చేసిన టీజర్ మ్యాసివ్ రెస్పాన్స్ అందుకుంది. ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ క్లిక్ అయిందనే చెప్పాలి.
సూపర్ విజువల్స్ తో ఫుల్ యాక్షన్ మోడ్ లో ఉన్న టీజర్.. అందరినీ ఆకట్టుకుంది. సినిమాలో విజయ్ పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నట్లు ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. అయితే సినిమా షూటింగ్ ను ఇప్పటికే పూర్తి చేయగా.. ప్రస్తుతం కింగ్ డమ్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు నిర్వహిస్తున్నారు మేకర్స్.
కానీ ఇప్పటి వరకు రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇవ్వడం లేదు. మే 30వ తేదీన రిలీజ్ చేస్తామని తొలుత ప్రకటించిన మేకర్స్.. ఆ తర్వాత జూలై 4కు వాయిదా వేశారు. ఇప్పుడు ఆ రోజు నితిన్ తమ్ముడు మూవీ రిలీజ్ అవుతుండడంతో మరోసారి కింగ్ డమ్ వాయిదా పడడం ఖాయం. జులై 25న రిలీజ్ చేయాలని ఆలోచిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.
అయితే అప్పటికి కూడా ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ అయ్యేలా లేదని తెలుస్తోంది. ఎందుకంటే అనిరుధ్ రవిచందర్ ఇప్పుడు కూలీ మూవీతో బిజీగా ఉన్నారట. అవి కంప్లీట్ అయ్యాక కింగ్ డమ్ పనిని పూర్తి చేస్తానని చెప్పారని టాక్. అదే నిజమైతే జులై 25న కూడా కింగ్ డమ్ రిలీజ్ కావడం కూడా డౌటే.
ఆగస్టు 1వ తేదీన రిలీజ్ చేద్దామనుకుంటే.. ఆ రోజు దుల్కర్ సల్మాన్ కాంత మూవీ విడుదల అవ్వనుందట. ఆ తర్వాత రెండు వారాలకు తారక్ బాలీవుడ్ డెబ్యూ వార్-2, రజినీకాంత్ కూలీ చిత్రాలు రానున్నాయి. దీంతో జూలై 25న మిస్ అయితే ఇంకా లేట్ అవుతూనే ఉంటుంది. ఇలా ఆలస్యమైతే మూవీపై బజ్ తగ్గుతుందనే చెప్పాలి. దీంతో మేకర్స్ కు ఇబ్బందిగా మారుతుంది. అందుకే ప్రమోట్ చేస్తూనే ఉండాలి. మరేం చేస్తారో చూడాలి.