జాతీయ గేయం ‘వందేమాతరం’కి నేటితో 150 సంవత్సరాలు పూర్తయ్యాయి. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రజలను ఏకతాటిపైకి తీసుకురావడంలో, వారిలో దేశభక్తిని నింపడంలో ‘వందేమాతరం’ గేయానిది గొప్ప పాత్ర. ‘వందేమాతరం’ నినాదంతో బ్రిటిష్ పాలకులకు భారతీయులు చుక్కలు చూపించారు.
బ్రిటిష్ పాలనలో కోర్టులో చంద్రశేఖర్ అజాద్కు 16 కొరడాల దెబ్బల శిక్ష విధించగా.. తనపై పడుతున్న ఒక్కొక్క దెబ్బకు వందే మాతరం అంటూ ఆ పోరాటయోధుడు అరిచాడంటే ఆ నినాదం స్వాతంత్ర్య ఉద్యమంలో ఎంతగా ప్రభావం చూపిందో అర్థం చేసుకోవచ్చు.
బంకించంద్ర ఛటర్జీ రాసిన ‘వందేమాతరం’ గేయానికి 150 సంవత్సరాలు పూర్తైన నేపథ్యంలో.. ఇవాళ ఉదయం ‘వందేమాతరం’ పూర్తి రూపాన్ని సమూహంగా ఆలపించే కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఏడాది పొడవునా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి 2026 నవంబర్ 7 వరకు దేశవ్యాప్తంగా సంవత్సరం పొడవునా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. వందేమాతరం స్మారక స్టాంపును, నాణేన్ని మోదీ విడుదల చేశారు.


















