ఏపీలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో బుధవారం ఘోర ప్రమాదం సంభవించింది. దీపావళి సమీపిస్తున్న తరుణంలో ఎక్కడికక్కడ టపాసుల తయారీ ఊపందుకుంది. ఈ క్రమంలో ఈ మధ్యే జిల్లాలోని రాయవరంలో ఏర్పాటు అయిన గణపతి గ్రాండ్ బాణసంచా తయారీ కేంద్రంలో బుధవారం భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. వీరిలో నలుగురు మహిళలు ఉన్నారు. కంపెనీ యజమాని సత్తిబాబు మరణించిన వారిలో ఉన్నట్లు సమాచారం.
ఇదిలా ఉంటే…. బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు జరిగినప్పుడు 40 మంది కార్మికులు ఉన్నారు. ఈ పేలుడులో ఈ కేంద్రం గోడ కూలిపోయింది. ఈ శిథిలాల కింద మరికొంత మంది ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. పేలుడులో గాయపడ్డవారిని అనపర్తి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇదిలా ఉంటే..వారం క్రితమే పోలీసు, రెవెన్యూ సిబ్బంది ఈ కేంద్రాన్ని పరిశీలించి అన్ని రక్షణ చర్యలు సరిగ్గానే ఉన్నట్టు నివేదిక ఇచ్చారు. ఈ నివేదిక ఇచ్చిన వారానికే అందులో పేలుడు సంభవించడం గమనార్హం.
ఈ ఘటనపై అటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ లు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో చనిపోయిన వారికి సంతాపం తెలిపిన చంద్రబాబు ప్రమాదానికి గల కారణాలను నిగ్గు తేల్చాలని అదికారులను ఆదేశించారు. అదే సమయంలో బాధిత కుటుంబాలను ఆదుకుంటామని తెలిపారు. ఇక ఈ ఘటన తనను కలచివేసిందని పవన్ అన్నారు. బాధితులు భయపడాల్సిన అవసరం లేదని, కూటమి సర్కారు వారిని అన్నిరకాలుగా ఆదుకుంటుందని ఆయన భరోసా ఇచ్చారు.

















