యూనివర్శిల్ స్టార్ కమల్ హాసన్ హీరోగా రూపొందిన థగ్ లైఫ్ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మణిరత్నం దర్శకత్వంలో కమల్ హాసన్ నటించిన సినిమా కావడంతో అంచనాలు భారీగా పెరిగాయి. వీరి కాంబోలో చాలా ఏళ్ల క్రితం ‘నాయగన్’ సినిమా వచ్చింది. ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. క్లాసిక్ మూవీగా నిలిచిన ఆ సినిమా రేంజ్లో థగ్ లైఫ్ ఉంటుందని మేకర్స్ మొదటి నుంచి చెబుతూ వచ్చారు. కానీ థగ్ సినిమా ఆకట్టుకోలేక పోయింది. సినిమా విడుదల తర్వాత సంగతి పక్కన పెడితే విడుదలకు ముందు చాలా పెద్ద వివాదం నడిచింది. కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యల కారణంగా ఈ సినిమాను కర్ణాటకలో విడుదల కానివ్వలేదు. దాంతో కన్నడం లో ప్రచారం చేసినా కూడా రిలీజ్ కాలేదు.
తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో విడుదలైన ఈ సినిమా కన్నడ భాషలో విడుదల చేయడంకు కమల్ చేసిన ప్రయత్నం విఫలం అయింది. కర్ణాటక హై కోర్ట్ సైతం కమల్కి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసింది. కన్నడ భాష గురించి కమల్ చేసిన వ్యాఖ్యలు సరైనవి కావు కనుక క్షమాపణలు చెప్పి ఆ తర్వాత సినిమా విడుదల చేసుకోవాలని హైకోర్ట్ వ్యాఖ్యానించింది. కన్నడంలో సినిమా విడుదల కాకున్నా పర్వాలేదు అని, తాను మాత్రం క్షమాపణ చెప్పేది లేదని కమల్ తేల్చి చెప్పాడు. దాంతో అక్కడ విడుదల కాకుండానే ఇతర భాషల్లో విడుదల అయింది. థగ్ లైఫ్ సినిమాను కర్ణాటక ప్రభుత్వం మొదలుకుని పలు సంఘల వారు అడ్డుకోవడంపై సుప్రీం కోర్ట్ను చిత్ర యూనిట్ సభ్యులు ఆశ్రయించారు.
కమల్ తరపున థగ్ లైఫ్ సినిమా కన్నడ వివాదం గురించి సుప్రీం కోర్ట్ను ఆశ్రయించారు. థగ్ లైఫ్ మేకర్స్ పిటీషన్ను స్వీకరించిన సుప్రీం కోర్ట్ విచారణకు సిద్దం అయింది. కర్ణాటక ప్రభుత్వ వివరణ కోరిన సుప్రీం కోర్ట్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేసింది. థగ్ లైఫ్ సినిమా విడుదల విషయమై సుప్రీం కోర్ట్ ప్రభుత్వంకు వార్నింగ్ ఇస్తూ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. కమల్ వ్యాఖ్యల నేపథ్యంలో సినిమా విడుదలను అడ్డుకున్న వారిపై సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలా చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదని… ఈ సమయంలో ప్రభుత్వం ఏం చేస్తుందని సుప్రీం కోర్ట్ ప్రశ్నించినట్లు సమాచారం అందుతోంది.
ఎట్టి పరిస్థితుల్లోనూ కర్ణాటకలో థగ్ లైఫ్ సినిమా విడుదల కావాల్సిందే అని సుప్రీం కోర్ట్ పేర్కొంది. సినిమా విడుదలను అడ్డుకోవడం అనేది ప్రాధమిక హక్కులకు భంగం కలిగించడం అవుతుందని సుప్రీం పేర్కొంది. దాంతో త్వరలోనే కర్ణాటకలో థగ్ లైఫ్ సినిమా విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. కమల్ హాసన్తో పాటు శింబు ముఖ్య పాత్రలో నటించిన ఈ సినిమాలో త్రిష, అభిరామి హీరోయిన్స్గా నటించారు. ఈ సినిమాకు ఏఆర్ రహమాన్ సంగీతాన్ని అందించాడు. సినిమాకు ఆశించిన స్థాయిలో పాజిటివ్ టాక్ రాకపోవడంతో వసూళ్లు నిరుత్సాహం కలిగించాయి. కమల్ ఈ కథను ఒప్పుకుని తప్పు చేశాడు అంటూ అభిమానులు స్వయంగా కామెంట్ చేస్తున్నారు.