తెలంగాణలో పల్లెపోరు ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా మూడు విడతల్లో నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియకు బుధవారంతో తెరపడింది. శాసనసభ ఎన్నికల ఊపును కొనసాగిస్తూ.. అధికార కాంగ్రెస్ పార్టీ పల్లెల్లోనూ ఘనవిజయాన్ని సాధించి జయకేతనం ఎగురవేసింది. మూడు విడతల ఫలితాలను పరిశీలిస్తే.. కాంగ్రెస్ పార్టీ సుమారు 56 శాతం స్థానాలను కైవసం చేసుకుని తన తిరుగులేని ఆధిక్యాన్ని చాటుకుంది. తొలి, రెండో దశ ఎన్నికల్లో సత్తా చాటిన హస్తం పార్టీ.. మూడో విడతలోనూ అదే జోరును ప్రదర్శించింది. మూడో విడతలో 4,159 స్థానాలకు గాను 2,286 చోట్ల కాంగ్రెస్ మద్దతుదారులు విజయం సాధించారు. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ 1,142 స్థానాలతో సరిపెట్టుకోగా.. బీజేపీ 242 స్థానాల్లో, సీపీఐ 24, సీపీఎం 7, ఇతరులు 479 స్థానాల్లో గెలుపొందారు.
రాష్ట్రంలోని మొత్తం 31 జిల్లాల్లో ఎన్నికలు జరగగా.. ఒక్క సిద్దిపేట జిల్లా మినహా మిగిలిన 30 జిల్లాల్లోనూ కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 12,733 పంచాయతీ సర్పంచి పదవులకు గాను.. తుది లెక్కల ప్రకారం కాంగ్రెస్ 7,010 స్థానాల్లో గెలిచి అగ్రస్థానంలో నిలిచింది. బీఆర్ఎస్ మద్దతుదారులు మొత్తం 3,502 స్థానాలను గెలుచుకోగా, బీజేపీ 688 స్థానాలను తన ఖాతాలో వేసుకుంది. నల్గొండ, ఖమ్మం, రంగారెడ్డి, నిజామాబాద్, మహబూబ్నగర్ వంటి కీలక జిల్లాల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ దిశగా దూసుకెళ్లింది. స్థానిక నాయకత్వం, ప్రభుత్వ పథకాల ప్రభావం ఈ ఫలితాల్లో స్పష్టంగా కనిపించింది.
ఎన్నికల ప్రక్రియలో ఓటర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. మూడో విడతలో అత్యధికంగా 85.77 శాతం పోలింగ్ నమోదైంది. మూడు విడతలు కలిపి రాష్ట్ర సగటు పోలింగ్ 85.30 శాతంగా నమోదైంది. జిల్లాల వారీగా చూస్తే.. యాదాద్రి భువనగిరి జిల్లా 92.56 శాతంతో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలవగా.. నిజామాబాద్ జిల్లా 76.45 శాతంతో అత్యల్ప పోలింగ్ను నమోదు చేసింది. మహిళా ఓటర్లు ఈ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించారు. మూడో విడతలో ఓటు వేసిన 43.37 లక్షల మందిలో మహిళల సంఖ్య 22.15 లక్షలుగా ఉంది.
ఎన్నికల ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని, సీఎస్ రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డిలు వెబ్ కాస్టింగ్ ద్వారా నిరంతరం పర్యవేక్షించారు. కొన్ని చెదురుమదురు సంఘటనలు మినహా రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. నూతనంగా ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యుల ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని ప్రభుత్వం తొలుత ఈ నెల 20న నిర్వహించాలని భావించినప్పటికీ.. ముహూర్తాల కారణంతో దానిని ఈ నెల 22వ తేదీకి వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గత నెల 25న ప్రారంభమైన ఈ సుదీర్ఘ ప్రజాస్వామ్య ప్రక్రియ విజయవంతంగా ముగియడంతో పల్లెల్లో కొత్త పాలన ఆరంభం కానుంది.
తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచులు, వార్డు సభ్యులు ఈ నెల 20వ తేదీన బాధ్యతలను స్వీకరించనున్నారు. ఆ రోజు రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి, ఎన్నికైన ప్రతినిధులతో ప్రమాణస్వీకారం చేయించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కార్యక్రమాన్ని పంచాయతీ కార్యదర్శులతో నిర్వహించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ సంచాలకురాలు సృజన అన్ని జిల్లాల కలెక్టర్లు, పంచాయతీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
రాష్ట్రంలో ఈ నెల 11న మొదటి దశ ఎన్నికలు పూర్తి కాగా.. నేడు (డిసెంబర్ 14న) రెండో దశ, డిసెంబర్ 17న మూడో దశ ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 20న జరిగే మొదటి సమావేశంలో.. కొత్త పాలకవర్గాలు ప్రమాణస్వీకారం చేయనున్నాయి. ‘గ్రామ పంచాయతీ సర్పంచినైన/సభ్యుడినైన —- (విజేత పేరు)—-అను నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత కలిగి ఉంటానని, నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహిస్తానని భగవంతుని పేర/సత్యనిష్ఠతో ప్రమాణం చేస్తున్నాను.’ అని ప్రతిజ్ఞ చేస్తారు. ఆపై ప్రమాణపత్రంపై సంతకం చేసి అధికారికంగా బాధ్యతలను చేపడతారు.











