ఏపీలో టీడీపీ కూటమి పాలనకు ఏడాది పూర్తి అయింది. ఈ సందర్భంగా జరిగిన మంత్రివర్గ సమావేశం సైతం ఉత్సాహంగా ఉల్లాసంగా సాగింది. కూటమి సారధి చంద్రబాబుకు అభినందనలు తెలియచేస్తూ మంత్రులు అందరూ చప్పట్లతో సమావేశంలో ఒక సందడిని సృష్టించారు.
చంద్రబాబు సైతం ఎంతో ఆనందంగా మంత్రులతో ముచ్చటించారు. మన ఏడాది పాలన బాగుందని బాబు చెప్పేసరికి మంత్రులతో పాటు అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఎందుకంటే ప్రతీ రోజూ సర్వేలు చేయిస్తూ జనాభిప్రాయాన్ని కూడగట్టడంతో చంద్రబాబుని మించిన వారు లేరు. అందువల్ల ఆయన తన నివేదికలు అన్నీ క్రోడీకరించి ఈ మాట చెప్పారని అంతా భావిస్తున్నారు.
తొలి ఏడాదిలోనే ఎంతో చేశామని ఇంతకు ఇంతా మిగిలిన కాలంలో చేయాలని బాబు దిశా నిర్దేశం చేశారు. మరో వైపు చూస్తే మంత్రి వర్గ సమావేశం తరువాత ముఖ్యమంత్రి మంత్రులు అంతా కలసి సరదాగా భోజనాలు చేయడం ఈసారి విశేషంగా చెబుతున్నారు. ఒక పండుగ వాతావరణంలో ఇదంతా జరిగింది అని అంటున్నారు. మూడు పార్టీలతో చంద్రబాబు కూటమి ప్రభుత్వం నడుపుతూ అందరినీ కలుపుకుని పోతూ తొలి ఏడాది ఏపీ లాంటి ఆర్ధిక ఇబ్బందులు ఉన్న రాష్ట్రంలో నిర్వహించడం అంటే టఫ్ టాస్క్ గానే భావించాలి.
కానీ దానిని చంద్రబాబు సాధించారు అని అంటున్నారు. పైగా కూటమి ఏడాది పాలన మీద ఓవరాల్ గా సంతృప్తి జనంలో ఉందని ఒక ఫీడ్ బ్యాక్ కూడా కూటమి పెద్దలకు అందడంతో మరింత ఖుషీ అవుతున్నారు. రానున్న కాలంలో ఈ ఇబ్బందులు మెల్లగా తొలగిపోతే మంచి రోజులు వస్తాయని అపుడు ప్రజలకు ఇంకా మేలు చేయవచ్చు అన్నది కూటమి ప్రభుత్వ పెద్దల భావనగా ఉంది. ఇక మంత్రి వర్గ సమావేశంలో మరో విశేషం ఏమిటి అంటే చంద్రబాబు పవన్ ఏకాంతంగా ముచ్చటించుకోవడం. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్తో సీఎం చంద్రబాబు కాసేపు ఏకాంతంగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఇద్దరూ పలు విషయాలు చర్చించుకున్నారు అని అంటున్నారు. ఇటీవల కాలంలో జరిగిన కడప మహానాడు నిర్వహణపై కూడా పవన్ తో చర్చించారు అని అంటున్నారు. ఈసారి మహానాడు ఆహ్లాదకర వాతావరణంలో బాగా జరిగిందని కూటమి ప్రభుత్వం పట్ల ప్రజల సానుకూలతను మహానాడు చాటి చెప్పిందని బాబు చెప్పారని అంటున్నారు. ఇక ఈ మధ్య కాలంలో పవన్ చంద్రబాబు కలుసుకోవడం అన్నది పెద్దగా కుదరలేదు. దాంతోనే ఇద్దరూ కలసి కొంత సేపు ఏకాంతగా మాట్లాడుకున్నారని అంటున్నారు. అమరావతి రాజధాని పనులతో పాటు ఏపీలో రాజకీయ పరిస్థితుల గురించి కూడా ఇద్దరు నేతలూ చర్చించారని అంటున్నారు. పూర్తిగా సానుకూల వాతావరణంలో ఈ ఇద్దరి భేటీ సాగింది అని అంటున్నారు.
టీడీపీ కూటమిలో విభేదాలు వస్తాయని రావాలని విపక్షం ఆశ. అయితే అది ఎప్పటికీ జరిగేది కాదని కూటమి మిత్రులు చాటి చెబుతున్నారు. నిజానికి భారతీయ రాజకీయాల్లో ఏ రెండు పార్టీల మధ్య లేని సఖ్యత ఏపీలో టీడీపీ జనసేనల మధ్యన కొనసాగుతోంది. పవన్ తన కంటే వయసులో ఎంతో పెద్ద వారు అయిన చంద్రబాబుతో ఎంతో బాగా ఉంటారు.
అదే సమయంలో తన కంటే బాగా చిన్న వారు అయిన లోకేష్ విషయంలోనూ అంతే బాగా ఉంటున్నారు. బాబుని పవన్ ఒక రకమైన అభిమానంతో కూడిన గౌరవంతో చూస్తారు. ఇంకా చెప్పాలంటే సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ గా ఆరాధనా భావంతో చూస్తారు.
అదే లోకేష్ విషయానికి వచ్చేసరికి సోదర ప్రేమను కనబరుస్తున్నారు. పవన్ అన్నా అని లోకేష్ అంటూంటే అంతే ఆప్యాయతను పవన్ చూపిస్తున్నారు. ఈ ఇద్దరి మధ్యన ఏదో ఉందని అంతా అనుకుంటారు. అలాగే గాసిప్స్ ని పుట్టిస్తారు. టీడీపీలో లోకేష్ ఎదిగితే అది జనసేనకు నచ్చదని పుకార్లుగా షికారు చేయిస్తూ వార్తలు వండుతున్నారు. అలాగే జనసేనకు ప్రయారిటీ ఇస్తున్న విషయంలో లోకేష్ టీం అసహనంగా ఉందని వార్తలు బాగానే అల్లుతున్నారు కానీ తీరా చూస్తే అవన్నీ తుస్సుమంటున్నాయి. ఏ బహిరంగ సభలో కనిపించినా ఇద్దరూ ఆప్యాయంగా హత్తుకుంటారు. ఒకరిని మరొకరు ఎంతో ప్రేమగా పలకరించుకుంటారు.
తాజాగా అమరావతిలో జరిగిన మంత్రివర్గ సమావేశానికి ముందు లోకేష్ పవన్ ల మధ్య ఉన్న ఒక అవ్యాజమైన అనుబంధం మీడియా సాక్షిగా బయటపడింది. లోకేష్ తన యువగళం పాదయాత్రని మొత్తం ఒక అందమైన పుస్తక రూపంలో తీసుకుని వచ్చారు. దానిని ఢిల్లీలో ప్రధాని మోడీకి ఆయన అందించారు. అలాగే కడపలో జరిగినా మహానాడు వేదిక మీద తన తండ్రి ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఈ పుస్తకం అందించి ఆయన కాళ్ళకు నమస్కరించి లోకేష్ ఆశీస్సులు తీసుకున్నారు ఇక ఇపుడు ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ కి ఆ పుస్తకాన్ని ఇచ్చి మరీ ఆయన నుంచి సైతం అభిననందనలు అందుకున్నారు.
ఈ పుస్తకాన్ని ఫోటో ఆల్బం ని చూసిన పవన్ కళ్యాణ్ లోకేష్ ని ఎంతగానో మెచ్చుకున్నారు. ఆయనను అభినందించారు. నాటి వైసీపీ ప్రభుత్వం అరాచక పాలన మీద పోరాడి పాదయాత్ర ద్వారా జనంలో చైతన్యం తీసుకుని వచ్చారని పవన్ లోకేష్ కి కితాబు ఇచ్చారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు లోకేష్ పాదయాత్ర ఎంతగానో ఉపయోగపడింది అని పవన్ అన్నారు. మొత్తానికి పవన్ లోకేష్ ని మెచ్చుకున్న తీరు చూసిన వారు దానిని లోకేష్ ప్రతిస్పందించిన వైనాన్ని గమనించిన వారు అంతా ఈ ఇద్దరూ అన్నదమ్ములుగా ఉన్నారని అంటున్నారు.
కూటమి మంత్రులు అంతా ఈ ఇద్దరి ఐక్యతను చూసి ముచ్చట పడ్డారు. ఏపీలో జనసేన టీడీపీ ఇంతలా కలసి మెలసి ఉండడమే ప్రభుత్వానికీ కూటమికీ శ్రీరామరక్ష అని అంటున్నారు. అధికార ఆధిపత్యాలు ఇగోలు ఏవీ పెట్టుకోకుండా అంతా ఒక్కటిగా ముందుకు సాగుతూ ఫస్ట్ ఏపీ స్టేట్ అన్న నినాదంతో కూటమి పార్టీలు పనిచేస్తున్నాయని ఆ స్పూర్తి వారిని కలిపి ఉంచుతోందని అంటున్నారు. ఏది ఏమైనా కూటమి పార్టీల పొత్తులు నాయకుల మధ్య ఉన్న అనుబంధాలు ప్రేమలు ఇవన్నీ భారత దేశ రాజకీయాలకు ఒక ప్రోత్సాహవంతమైన భావనగా ఉన్నాయని అంటున్నారు.