అనంతపురం నగరంలో దారుణం చోటుచేసుకుంది. అనుమానాస్పద స్థితిలో ఇంటర్ సెకండియర్ విద్యార్థిని హత్యకు గురయింది. కాలిన గాయాలతో మృతి చెందిన విద్యార్థిని మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రూరల్ పరిధిలోని మణిపాల్ స్కూల్ సమీపంలో ఘటన చోటుచేసుకుంది. వారం రోజుల క్రితం కూతురు కనపడలేదని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఇవాళ విగతజీవిగా పడి ఉన్న కూతురు మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు.
ఇంటర్ విద్యార్థిని తన్మయి (20) మర్డర్ కేసులో పోలీసుల నిర్లక్ష్యం లేదని స్పష్టం చేసిన వన్ టౌన్ సిఐ రాజేంద్రనాథ్ యాదవ్.. విద్యార్థిని తన్మయి తల్లిదండ్రులు కంప్లైంట్ ఇచ్చిన రోజే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామన్నారు. అనుమానితులను కూడా అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నామన్నారు. సీసీకెమెరా ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని, అన్ని కోణాల్లో విచారణ చేస్తూన్నామని అన్నారు. బీర్ బాటిల్ తో తలపై కొట్టిన ఆనవాళ్లు ఉన్నాయని అనంతపురం వన్ టౌన్ సిఐ రాజేంద్రనాథ్ యాదవ్ తెలిపారు. ఇంటర్ విద్యార్థిని తన్మయి మృతదేహానికి తాజాగా పోస్టుమార్టం పూర్తి చేశారు. అనంతరం తన్మయి డెడ్ బాడీని కుటుంబ సభ్యులకు పోలీసులు అప్పగించారు. తన్మయి హత్య కేసులో నరేష్ అనే యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. తన్మయి పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేయడంతో నరేష్ అనే యువకుడు బీరు బాటిల్ తో తలపై కొట్టి హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే నరేష్ అనే యువకుడికి అంతకుముందే పెళ్లి అయ్యిందని పోలీసుల విచారణలో తేలింది.
జూన్ 3 రాత్రి తన్మయిని.. నరేష్ బైక్ పై వెళ్ళినట్లు గుర్తించాం. ఇంటి ఎదురుగా కూలీ పని చేస్తున్న నరేష్ అనే యువకుడుతో పాటు మరికొద్ది మంది కలిసి బీరు బాటిల్ కొట్టి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతపురం ఉరవకొండ ప్రధాన రహదారిలో కూడేరు వద్ద తన్మయి డెడ్ బాడీని గుర్తించిన ప్రాంతంలో క్లూస్ టీమ్ తనిఖీలు చేపట్టాయి. మెయిన్ రోడ్డు పక్కనే ఉన్న వెంచర్ లోకి 200 మీటర్ల దూరం తన్మయిని తీసుకెళ్లి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. తన్మయి డెడ్ బాడీ లభించిన చోట మద్యం బాటిళ్లు గుర్తించారు. మందు బాబులకు అడ్డగా మారిన ముళ్ళపొదల్లో తన్మయి డెడ్ బాడీ ఉండడంతో పలు అనుమానాలు లేవనెత్తుతున్నారు. బైక్ పై తీసుకొచ్చిన నరేష్ తో పాటు మరికొందరు కలిసి హతమార్చరా.. లేదంటే ఈ ప్రాంతంలో మద్యం సేవించే వారు అఘాయిత్యానికి పాల్పడ్డారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే పోలీసుల అదుపులో నరేష్ తో పాటు మరికొందరు యువకులు ఉన్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. దీనిపై అనంతపురం ఎస్పీతో హోం మంత్రి అనిత పోన్ లో మాట్లాడారు.