రాజా రఘువంశీ హత్య కేసులో దిగ్భ్రాంతికరమైన వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఇది కేవలం కాంట్రాక్ట్ కిల్లింగ్ కాదని, హత్య వెనుక రాజా భార్య సోనమ్, రాజ్ కుశ్వాహా అనే వ్యక్తి కుట్ర ఉందని ఈస్ట్ ఖాసీ హిల్స్ జిల్లా ఎస్పీ వివేక్ సియామ్ గురువారం మీడియాకు వెల్లడించారు. ఈ కేసులో ఇప్పటికే ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు.
ఎస్పీ సియామ్ తెలిపిన వివరాల ప్రకారం, రాజ్ కుశ్వాహా ఈ హత్యకు ప్రధాన సూత్రధారి. అయితే, రాజా భార్య సోనమ్ ఈ కుట్రకు పూర్తి సహకారం అందించిందని పోలీసులు స్పష్టం చేశారు. రాజ్ గతంలో రెండుసార్లు రఘువంశీని చంపడానికి ప్రయత్నించినట్లు విచారణలో వెల్లడైంది. ఒకసారి నదిలో ముంచి చంపాలని, మరోసారి ఒక మహిళ మృతదేహాన్ని సేకరించి సోనమ్ స్కూటీతో పాటు దహనం చేయాలని ప్రయత్నించాడు. అయితే, ఈ రెండు ప్రయత్నాలు విఫలమయ్యాయి.
మే 11న రాజా రఘువంశీ, సోనమ్ పెళ్లి చేసుకున్నారు. కొద్ది రోజుల తర్వాత వారు గువహాటీలోని కామాఖ్యా ఆలయాన్ని సందర్శించారు. ఈ సమయంలోనే రాజ్ మిత్రులు విశాల్, ఆనంద్, ఆకాష్ మే 19న గువహాటీకి చేరుకున్నారు. మొదట గువహాటీలోనే హత్య చేయాలని ప్రణాళిక వేసినా, అది కార్యరూపం దాల్చలేదు. చివరకు, సోనమ్ సూచన మేరకు హత్య ప్రణాళికను సోహ్రా ప్రాంతమైన చిర్రాపుంజికి మార్చారు. మే 19న, సోహ్రాలోని పార్కింగ్లో ముగ్గురు నిందితులు రాజాను హత్య చేసి, మృతదేహాన్ని లోయలో పడవేశారు. ఈ హత్య జరిగే సమయంలో సోనమ్ కూడా అక్కడే ఉంది.
మధ్యాహ్నం 2:18 గంటల ప్రాంతంలో నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. సోనమ్ తన రెయిన్కోట్ను ఆకాష్కు ఇచ్చి అతని షర్ట్పై ఉన్న రక్తపు మచ్చలు దాచింది. ఆపై స్కూటీపై వెళ్లి ఆ రెయిన్కోట్ను AV పాయింట్ దగ్గర పడేసింది. ఆ తర్వాత ఆకాష్ స్కూటీ నడిపి, సోనమ్ తో కలిసి ప్రయాణించారు. హత్యకు ఉపయోగించిన అద్దె స్కూటీలలో ఒకటి సోహ్రా సరిహద్దులో ఆనంద్ వదిలేశాడు.
సోనమ్ గువహాటీ నుంచి బస్సులో సిలిగురి, అక్కడి నుంచి పాట్నా, ఆరా, లక్నో, చివరకు ఇండోర్ వరకు ప్రయాణించింది. ఈ ప్రయాణంలో వేషం మారుస్తూ, బురఖా ధరించి తిరిగింది. విశాల్ ద్వారా రాజ్ ఈ ఏర్పాట్లన్నీ చేసినట్లు పోలీసులు తెలిపారు.
పోలీసులు ఐదుగురు నిందితులను అరెస్టు చేసి విచారణ కొనసాగిస్తున్నారు. హత్య స్థలాన్ని మళ్లీ పునఃసృష్టించనున్నారు. సోనమ్ తన పాత్రను ఒప్పుకుంటూ రాజ్ను హత్య చేయడంలో తానే మాస్టర్ మైండ్నని పేర్కొంది. అయితే, రాజ్ మాత్రం సోనమ్ను దోషిగా చూపించడానికి ప్రయత్నిస్తూ, రూ. 20 లక్షలతో కాంట్రాక్ట్ కిల్లర్లతో హత్య చేయించినట్టు చెబుతున్నాడు. ఈ వాదనపై విచారణ జరుగుతోంది. షిల్లాంగ్ నుండి అద్దెకు తీసుకున్న మూడు స్కూటీలు కేసులో కీలక ఆధారాలుగా మారాయి. వాటిలో ఒకటి సోహ్రా రిమ్ దగ్గర పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన రెండింటి కోసం గాలింపు కొనసాగుతోంది. ఈ కేసులో రాజ్, సోనమ్తో పాటు మిగతా ముగ్గురు నిందితులు కీలక పాత్ర పోషించారని పోలీసులు తేల్చారు. అయితే, అసలైన హత్య ప్రణాళికదారు ఎవరన్న దానిపై ఇంకా విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో మరిన్ని సంచలన నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.