మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్ జగన్ వ్యాఖ్యలు ఏపీలో కలకలం రేపుతున్నాయి. మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తున్నారంటూ వైసీపీ కోటి సంతకాలను గవర్నర్ కు సమర్పించారు. దానికి ముందు జగన్ మాట్లాడుతూ మెడికల్ కాలేజీల అంశంలో వారిని రెండు నెలల్లో జైలుకు పంపుతాను అంటూ బెదిరింపు వ్యాఖ్యలు చేశారు. దీనిపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ఫైర్ అయ్యారు.
దమ్ముంటే ముందు తనను జైలుకు పంపాలని జగన్ కు ఛాలెంజ్ విసిరారు. బెదిరించడం అనేది ఆటవిక మనస్తత్వానికి నిదర్శనం అనే ఆయన అన్నారు. పేద విద్యార్థులకు నాణ్యమైన వైద్యవిద్య, పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో తెచ్చిన పీపీపీ విధానంలో ఆసుపత్రులు, మెడికల్ కళాశాలల నిర్మాణానికి ముందుకు వచ్చిన సంస్థలను, వ్యక్తులను, అధికారంలోకి వచ్చిన తర్వాత జైలుకు పంపుతానని జగన్ బెదిరించడం అత్యంత హేయం. జైలుకు పంపడం కాదు కదా, వారి తలపైన వెంట్రుక కూడా పీకలేరు అని అన్నారు.
అత్యంత అవినీతిపూరిత 30 కేసులు ఉన్న జగన్, ముందు తను జైలుకు పోకుండా చూసుకోవాలని సూచించారు. ఇది కేంద్ర ప్రభుత్వ విధానపర నిర్ణయం. ఎన్డీయే ప్రభుత్వం నీతి అయోగ్ ప్రతిపాదనతో, న్యాయస్థానాలు, పార్లమెంటరీ స్థాయి సంఘం సమర్థించిన విధానం. దాదాపు 20 రాష్ట్రాలు అవలంభిస్తున్న విధానం అని మంత్రి వివరించారు. మీకు ధైర్యం ఉంటే ఈ శాఖను నిర్వహిస్తున్న తనను జైలుకు పంపాలని సవాల్ విసిరారు. ఈ విషయంలో ధైర్యం ఉంటే సీబీఐ విచారణ కోరండని సూచించారు. మీకు ధైర్యం ఉంటే తనను న్యాయస్థానాలు ద్వారా జైలుకు పంపాలని మాజీ సీఎం జగన్కు స్పష్టం చేశారు.
ఏపీలో మెడికల్ కాలేజీల అంశంపై పెద్ద దుమారమే రేగుతోంది. కోటి సంతకాల పేరుతో రెండు నెలల పాటు వైసీపీ ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళేందుకు ప్రయత్నం చేసింది. పీపీపీ విధానంలో పేదలకు కార్పొరేట్ వైద్యం అందిస్తే తప్పేంటని సీఎం చంద్రబాబు ప్రశ్నిస్తుండగా, ఇది ఒక స్కామ్ అంటూ వైయస్ జగన్ ఆరోపిస్తున్నారు. పిపిపి విధానంలో మెడికల్ కాలేజీలను దక్కించుకున్న వారిని తాము అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే జైల్లో వేస్తామంటూ ఈరోజు జగన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
గవర్నర్ ను కలిసే ముందుగా ఆయన పార్టీ ముఖ్యనేతలతో సమావేశం నిర్వహించారు. ఇందులో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ స్కూళ్లు, హాస్పిటల్స్ ఎందుకు నడపాలి అని ప్రపంచం మొత్తంలో అనుకునేది చంద్రబాబు ఒక్కరే. పోలీస్ శాఖను కూడా ప్రైవేటైజ్ చేస్తానంటున్నారని ఆయన ఆరోపించారు. మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని జైల్లో వేస్తానని హెచ్చరికలు జారీ చేయడం ఏపీ అభివృద్ధిని అడ్డుకోవడమే అని తెలుగుదేశం పార్టీ అంటోంది.
చంద్రబాబు ఈ అంశంపై మాట్లాడుతూ పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల పేర్లు కూడా ‘ప్రభుత్వ కళాశాల’ అనే ఉంటాయన్నారు. పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తే మీకు వచ్చే నష్టం ఏమిటని ఆయన ప్రశ్నించారు? రుషికొండకు పెట్టిన 500 కోట్లతో ఇంకో రెండు కాలేజీలు కట్టొచ్చు అన్నారు.
దీనికి జగన్ కౌంటర్ ఇచ్చారు. మేము రిషికొండలో రూ.240 కోట్లతో బ్రహ్మాండమైన బిల్డింగ్ నిర్మించాం. అది విశాఖకు తలమానికంగా ఉంది. చంద్రబాబు ఒక్క రోజు యోగాకు రూ.330 కోట్లు ఆవిరి చేసారని ఆరోపణలు గుప్పించారు.
పీపీపీ పద్ధతిలో మెడికల్ కాలేజీల నిర్మాణంపై మొదటి నుంచి సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టంగా ఉన్నారు. పీపీపీ పద్ధతిలో మెడికల్ కాలేజీలు నిర్మాణం చేపడుతున్నా… అవి ప్రభుత్వ కళాశాలల పేరుతోనే నడుస్తాయని చెబుతున్నారు. మెడికల్ కాలేజీల నిబంధనలు కూడా రాష్ట్ర ప్రభుత్వమే నిర్దేశిస్తుందన్నారు. ఇందులో 100 శాతం అవుట్ పేషెంట్ సేవలు ఉచితం. 70 శాతం మందికి ఎన్టీఆర్ వైద్య సేవలు ఆయా కళాశాలల్లో అందుతాయి, సీట్లు కూడా పెరుగుతాయనేది సీఎం చంద్రబాబు నాయుడు భావన.
ఏపీ(AP) రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పీపీపీ (Public–Private Partnership) విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణానికి కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా, దీనిపై వైసీపీ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. మెడికల్ కాలేజీలను ప్రైవేటు చేతుల్లోకి అప్పగిస్తున్నారంటూ ఆరోపణలు చేస్తూ ఉద్యమానికి దిగింది. ఈ అంశంపై కోటి సంతకాలు సేకరించిన వైసీపీ, మాజీ సీఎం జగన్(Y. S. Jagan Mohan Reddy) రేపు (గురువారం) గవర్నర్ను కలిసి వినతి పత్రం అందించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ వివాదంపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందిస్తూ కీలక ప్రకటన చేశారు.
రెండు రోజుల కలెక్టర్ల సదస్సులో భాగంగా మాట్లాడిన సీఎం చంద్రబాబు(Chandrababu), పీపీపీ విధానంలో చేపడుతున్న మెడికల్ కాలేజీలపై స్పష్టత ఇచ్చారు. పీపీపీ మోడల్ ద్వారా నాణ్యమైన సేవలు మరింత సమర్థవంతంగా అందుతాయని తెలిపారు. కొందరు కావాలని మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తున్నట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. పీపీపీ పద్ధతిలో నిర్మిస్తున్నప్పటికీ, అవి పూర్తిగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలుగానే కొనసాగుతాయని స్పష్టం చేశారు. కాలేజీల నిర్వహణ నిబంధనలు, నియంత్రణ అన్నీ రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటాయని వెల్లడించారు.









