ప్రజా సేవను మరింత సమర్థవంతంగా అందించేందుకు, అభివృద్ధి ప్రణాళికల అమలులో వేగం తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త కార్యక్రమాన్ని రూపొందిస్తోంది. ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ పేరుతో 99 రోజుల కార్యాచరణను అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ కార్యచరణపై దిశానిర్దేశం చేసేందుకు శనివారం సచివాలయంలో శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించబడింది.
99 రోజుల కార్యాచరణ – స్పష్టమైన లక్ష్యాలు
మార్చి 6 నుండి జూన్ 12 వరకు అమలు చేయనున్న ఈ ప్రణాళికలో ప్రతి శాఖకు స్పష్టమైన టార్గెట్లు నిర్ధారించనున్నారు. యావత్ తెలంగాణ అభివృద్ధి ప్రణాళిక ‘కేర్, ప్యూర్, రేర్’ సూత్రాలకు అనుగుణంగా ఉండాలని సూచించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తేనే తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలపగలమని స్పష్టం చేశారు.
అద్దె భవనాలకు గుడ్బై
ప్రభుత్వ కార్యాలయాలు ఇకపై అద్దె భవనాల్లో కొనసాగకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రభుత్వ ఆస్తులను సమర్థంగా వినియోగిస్తూ, అవసరమైతే కొత్త భవనాల నిర్మాణంపై దృష్టి సారించనున్నారు. ఇది ఖర్చులను తగ్గించడమే కాకుండా పరిపాలనలో స్థిరత్వాన్ని తీసుకురానుంది.
కేంద్ర పథకాలపై ఫోకస్
కేంద్ర ప్రయోజిత పథకాల అమలుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని నిర్ణయించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులను సమయానికి పొందేందుకు, వాటి వినియోగంలో పారదర్శకత పాటించేందుకు చర్యలు తీసుకోనున్నారు. ఫైళ్ల క్లియరెన్స్ నిర్దిష్ట కాలపరిమితిలో పూర్తయ్యేలా మానిటరింగ్ వ్యవస్థను బలోపేతం చేయాలని సూచించారు.
పెట్టుబడులు గ్రౌండ్ కావాలి
వివిధ కంపెనీలతో కుదుర్చుకున్న ఒప్పందాలు కేవలం పేపర్పైనే కాకుండా భూమిపై అమలులోకి రావాలని స్పష్టం చేశారు. పెట్టుబడులు గ్రౌండింగ్ అయితేనే ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. పరిశ్రమల స్థాపనకు అవసరమైన అనుమతులు వేగవంతంగా ఇవ్వాలని ఆదేశించారు.
సాంకేతికతతో సంక్షేమం
సంక్షేమ పథకాల అమలులో ఆధునిక సాంకేతికతను వినియోగించాలని నిర్ణయించారు. లబ్ధిదారుల డేటా సమగ్రత, పారదర్శకత కోసం డిజిటల్ ప్లాట్ఫారమ్లను వినియోగించనున్నారు. ప్రాంతాల వారీగా మెడికల్ డేటా సేకరణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవల నాణ్యతను మెరుగుపరచడంపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు.
ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులు – ప్రజలకు అవగాహన
ఫ్యూచర్ సిటీ, మూసీ పునరుజ్జీవం వంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు స్పష్టంగా వివరించాలని సూచించారు. నగరాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, మౌలిక సదుపాయాల విస్తరణలో ఈ ప్రాజెక్టులు కీలకంగా ఉంటాయని తెలిపారు.
విద్యా వ్యవస్థలో మార్పులు
విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాలనే లక్ష్యంతో వంద నియోజకవర్గాల్లో తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను ప్రారంభించనున్నారు. ఆధునిక సదుపాయాలు, నాణ్యమైన బోధన, డిజిటల్ లెర్నింగ్ వసతులతో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని నిర్ణయించారు.
తెలంగాణ పండుగకు సిద్ధం
జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ప్రతి ఎన్నికలో ప్రజలు ఇచ్చిన మద్దతుకు ప్రతిఫలంగా మరింత సేవ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు. అధికారులు సమన్వయంతో పనిచేస్తే 99 రోజుల ప్రణాళిక విజయవంతమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికతో తెలంగాణ అభివృద్ధికి కొత్త దిశా నిర్దేశం అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
Telangana
“ఈ ప్రభుత్వం మీది.. ఎటువంటి ఆందోళన చెందాల్సిన పని లేదు.. మీకు అండగా ఉంటాం” అని మదీనా బస్సు ప్రమాద బాధిత కుటుంబాలకు భరోసా ఇచ్చాను. సచివాలయంలో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి, ఆర్థిక సహాయం అందజేశారు. నాడు ప్రమాద ఘటన తెలుసుకున్న వెంటనే మంత్రి అజహరుద్దీన్ నేతృత్వంలోని ప్రతినిధి బృందాన్ని మదీనాకు పంపిన విషయాన్ని వారికి గుర్తు చేశాను. సహజంగా దేశం బయట జరిగే ప్రమాదాల్లో మృతిచెందిన వారికి ప్రభుత్వాలు పరిహారం చెల్లించవు కానీ, ప్రజా ప్రభుత్వం మానవతా దృక్పథంతో సహాయం చేయాలని నిర్ణయం తీసుకున్నది. ప్రమాదంలో మృతిచెందిన 44 కుటుంబాల వారికి రూ.5 లక్షల చొప్పున, తీవ్రంగా గాయపడిన వారి కుటుంబానికి రూ.3 లక్షల చొప్పున చెక్కు ద్వారా ఆర్థిక సహాయం అందజేశాను. కార్యక్రమంలో రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ అజారుద్దీన్, సలహాదారు శ్రీ వేం నరేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు శ్రీ షబ్బీర్ అలీ, నాంపల్లి ఎమ్మెల్యే శ్రీ మాజీద్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.





