“ఇదీ.. మా అభివృద్ధి“ అంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన సోషల్ మీడియాలో వెల్లడించారు. గత రెండు మాసాల కిందట ఆయన `అడవి తల్లి బాట` పేరుతో కీలక కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లాలోని పలు గ్రామాల్లో రెండు రోజుల పాటు పర్యటించిన ఆయన..అక్కడి గిరిజనులు పడుతున్న వేదనకు పరిష్కారం చూపించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే పలు అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.రహదారుల నిర్మాణానికి ప్రధాన ప్రాధాన్యం కల్పించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల నిధులతో పాటు.. రాష్ట్ర ప్రభు త్వం కూడా కొంత మొత్తం కేటాయించి.. గిరిజన ప్రాంతాల్లో రహదారులు నిర్మించడం ద్వారా కొన్ని దశాబ్దాలుగా వారు ఎదుర్కొం టున్న సమస్యలకు చెక్ పెట్టారు. ప్రధానంగా డోలీ మోతలకు పరిష్కారం చూపించారు. కేవలం నెల రోజుల వ్యవధిలోనే ఒక కిలో మీటరు పొడవున్న రహదారిని నిర్మించి.. గిరిజనులకు చేరువ చేశారు. తతద్వారా వారికి నగరాలతో కనెక్టివిటీ పెరుగుతుంది.
ప్రధాన మంత్రి జన్ మన్(ఇది గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కేటాయించిన పథకం) ద్వారా ఈ పనులు చేపట్టినట్టు పవన్ కల్యాణ్ తన ఎక్స్లో వివరించారు. గిరిజనులు ఎక్కువగా ఉన్న.. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని గూడెం కొత్త వీధి మండలం, లక్కవరం నుండి చీదిగోంది వరకు ఒక కిలో మీటరు తార్రోడ్డు నిర్మించారు. ఇది 183 మంది గిరిజనులకు మేలు చేకూరుస్తుందని పవన్ వెల్లడించారు. అంతేకాకుండా.. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి రహదారి అన్నది తెలియని అడవి బిడ్డలకు ఇప్పుడు మేలైన సౌకర్యం అందించామన్నారు. కాగా.. తన పోస్టులో రహదారిని ఎలా నిర్మించిందీ సచిత్ర సహితంగా పవన్ కల్యాణ్ వివరించారు.
దాదాపు 88 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ రహదారి.. పలు గ్రామాల్లో నివసించే 183 కుటుంబాలకు మేలు చేస్తుంది. ముఖ్యంగా అర్ధరాత్రి, అపరాత్రి వచ్చే కష్టాలకుచెక్ పెడుతుంది. దీనిపై గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కల్యాణ్ మేలు మరువనిదని పలువురు వ్యాఖ్యానించారు. “నా వయసు 60 ఏళ్లు ఇప్పటి వరకు మాకు రోడ్డు లేదు. ఇదే తొలి రోడ్డు. చాలా బాగా వేశారు. నెల రోజుల్లోనే నిర్మించారు“ అని ఓ గిరిజనుడు మీడియాకు చెప్పడం గమనార్హం.