పాలమూరు ఎత్తిపోతలపై ఆరోపణలకు ముగింపు; నాగం పిటిషన్ను కొట్టివేసిన సుప్రీంకోర్టు
పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో అక్రమాలున్నాయంటూ, సీబీఐ దర్యాప్తు చేయాలని మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. హైకోర్టు ఆదేశాల్లో జోక్యం చేసుకునే అవసరం లేదని స్పష్టంగా పేర్కొంటూ పిటిషన్ను కొట్టివేసింది.
ఈ కేసును జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర శర్మల ధర్మాసనం విచారించింది. దాదాపు ఐదేళ్లుగా విచారణ కొనసాగుతున్న ఈ పిటిషన్కు నేడు తెర పడింది.మేఘా ఇంజినీరింగ్ (Meil)తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్గీ వాదనలు వినిపించారు. ఇప్పటికే తెలంగాణ హైకోర్టులో దీనికి సంబంధించి ఐదు పిటిషన్లు కొట్టివేయబడ్డాయి. ఇందులో ఎలాంటి మోసం లేదని, అవకతవకలు లేవని సివిసీ నివేదికలో కూడా తేల్చిందని తెలిపారు.
ఎస్టిమేట్లు పెరిగిన విషయాన్ని తప్పుగా చూపే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. అంతేకాకుండా బీహెచ్ఈఎల్ (BHEL) వంటి కీలక భాగస్వామి సంస్థ కూడా ఎలాంటి ఫిర్యాదు చేయలేదని స్పష్టం చేశారు. ఒకటి రెండు డాక్యుమెంట్లను ఆధారంగా చేసుకొని ఈ కేసులు వేయడం దురుద్దేశపూరితమని పేర్కొన్నారు.పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ సజావుగా కొనసాగుతోందని, అభివృద్ధికి ఇది కీలకమైందని అన్నారు.నాగం తరఫున సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపించినా, కోర్టు వాటిని సమర్థించకపోవడంతో పిటిషన్ను తిరస్కరించింది.
కృష్ణా జలాలను ఎత్తిపోసి, నీటి కొరతతో ఇబ్బందిపడుతున్న పాలమూరు, రంగారెడ్డి జిల్లాలకు నీటి అవసరాలను తీర్చే ఉద్దేశంతో రూపొందించిన ఈ ప్రాజెక్టు, ప్రపంచంలోనే అత్యంత భారీ పంపులతో నిర్మితమైన అత్యాధునిక ఎత్తిపోతల వ్యవస్థగా నిలవనుంది.