టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమాల్లో ఒకటి ఓజీ. సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా షూటింగ్ రీసెంట్ గా రీస్టార్ట్ అయింది. అందుకు సంబంధించి మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. అదే సమయంలో ముంబైలో జరుగుతున్న చిత్రీకరణకు సంబంధించిన విజువల్స్ వైరల్ గా మారాయి.అయితే ఓజీలో టాలీవుడ్ హీరో నారా రోహిత్ కు కాబోయే భార్య శిరీష నటించనున్నట్లు కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. దీనిపై మేకర్స్ అధికారికంగా ప్రకటించకపోయినా.. నిజమేనని అంతా అంటున్నారు. ఈ నేపథ్యంలో తన అప్ కమింగ్ మూవీ భైరవం ప్రమోషన్స్ లో ఆ విషయం గురించి మాట్లాడారు నారా రోహిత్. క్లారిటీ కూడా ఇచ్చారు.
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్ తో కలిసి నారా రోహిత్.. భైరవం మూవీలో నటించారు. మరికొద్ది గంటల్లో ఆ సినిమా రిలీజ్ కానుండగా.. మేకర్స్ జోష్ గా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా టీమ్ అంతా కలిసి సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ తో సందడి చేశారు. సరదా సిట్టింగ్ పేరుతో ఇంటర్వ్యూ చేశారు. ఆ సమయంలో నారా రోహిత్ ను సాయి దుర్గ తేజ్ ఓజీ అప్డేట్ ఇవ్వమని అడిగారు. వెంటనే మనోజ్.. ఆయనను అడుగుతావేంటి.. నీవే చెప్పాలి కదా అన్నారు. అప్పుడు నారా రోహిత్.. సినిమాలో తనకు కాబోయే భార్య శిరీష నటించినట్లు తెలిపారు. ఓజీలో ఓ కీలక పాత్రలో నటించే అవకాశం తనకు దక్కిందని రివీల్ చేశారు రోహిత్.
అయితే ఇన్ని రోజులు ఆ విషయం ఎందుకు చెప్పలేదని రోహిత్ ను మంచు మనోజ్ ఆటపట్టించారు. దీంతో అప్పుడు తనను నీవు అడగలేదని రోహిత్ నవ్వుతూ అన్నారు. మొత్తానికి ఇప్పటికే వస్తున్న వార్తలు నిజమయ్యాయి. అలా పవన్ కళ్యాణ్ ఓజీ మూవీలో కీలక పాత్రలో కనిపించనున్నారు నారా వారి కాబోయే కోడలు. కాగా, యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ తో నారా రోహిత్ గత మూవీ ప్రతినిధి-2తో శిరీష సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. సిరి లెళ్లగా పరిచయమయ్యారు. ఇప్పుడు రోహిత్ తో మరికొద్ది రోజుల్లో ఏడడుగులు నడవనున్నారు. మరోవైపు, ఓజీ మూవీ సెప్టెంబర్ 25వ తేదీన రిలీజ్ చేయనున్నట్లు రీసెంట్ గా మేకర్స్ అనౌన్స్ చేశారు. దీంతో రోహిత్ కు కాబోయే భార్య.. ఇప్పుడు ఓజీలో ఎలా ఆకట్టుకుంటారో వేచి చూడాలి.