ఓజి మొదటి రోజు వసూళ్లు 154 కోట్లకు పైగా వచ్చాయి. పాజిటివ్ టాక్ ప్రీమియర్ షో నుంచే మొదలైపోయింది కాబట్టి ఈ నెంబర్లు పెద్ద ఆశ్చర్యం కలిగించేవి కాదు కానీ డబుల్ సెంచరీ గ్రాస్ ఆశించిన అభిమానులు కొంత నిరాశ చెందిన మాట వాస్తవం. ఎందుకంటే ఓవర్సీస్ కి కంటెంట్ పంపించడంలో జరిగిన ఆలస్యం, కెనడాలో ఏర్పడిన సందిగ్దత లాంటి కారణాలు ఓపెనింగ్స్ మీద ప్రభావం చూపించాయి. ఏపీ తెలంగాణలో ముందు రోజు రాత్రే ప్రీమియర్లు వేయడం వసూళ్ల పరంగా ప్రయోజనకారిగా మారింది. వెయ్యి రూపాయల టికెట్లైనా ఫ్యాన్స్ లెక్క చేయకుండా కొన్నారు. దానికి దర్శకుడు సుజిత్ న్యాయం చేశాడు.
ఇక్కడిదాకా బాగానే ఉంది కానీ అసలు సవాళ్లు ఇకపై ఉన్నాయి. ఓజికి ఏపీ తెలంగాణలో ప్రతి టికెట్ మీద వంద, నూటా యాభై రూపాయల పెంపు ఇచ్చేశారు. అది కూడా పది రోజుల పాటు. బిసి సెంటర్లలో ఈ అంశం కొంచెం ప్రతికూలంగా మారడం ఆక్యుపెన్సీల్లో కనిపిస్తోంది. గురువారం రిలీజ్ కొంచెం మైనస్ అయినా పవన్ రేంజ్ స్టార్ హీరోలకు అదేమీ మ్యాటర్ కాదు. కానీ సెన్సార్ ఏ సర్టిఫికెట్ ఇవ్వడం వల్ల పిల్లలు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. వాళ్ళను తీసుకెళ్లాల్సిన పెద్దలు ఆగిపోతున్నారు. సింగల్ స్క్రీన్లలో పెద్దగా పట్టించుకోవడం లేదు కానీ మల్టీప్లెక్సుల్లో వెనక్కు పంపిస్తున్న ఉదంతాలు జరుగుతున్నాయి.
మొదటి వీకెండ్ ఓజికి చాలా కీలకం. మెయిన్ సెంటర్స్ లో ఢోకా లేదు. శని ఆదివారాలు పూర్తిగా ఓజస్ గంభీర కంట్రోల్ లోనే ఉంటాయి. రెండు వందల యాభై కోట్లు దాటాలనేది అభిమానుల ఆకాంక్ష. అదేమీ అసాధ్యం కాదు కానీ నిజంగా చేరుకుంటుందా లేదానేది సోమవారం తేలనుంది. జ్వరం దృష్ట్యా పవన్ బయటికి రాలేని పరిస్థితి ఉండటంతో ప్రమోషన్లు కొనసాగించడానికి లేకుండా పోతోంది. దర్శకుడు సుజిత్ ఇంటర్వ్యూలు ఇస్తూ మంచి కంటెంట్ ఇస్తున్నాడు. ఫ్యాన్స్ కాకుండా రెగ్యులర్ ఆడియన్స్ మద్దతు కనక ఓజికి పెరిగితే తెలుగు రాష్ట్రాల్లో పుష్ప 2, ఆర్ఆర్ఆర్ లను టార్గెట్ చేసుకోవచ్చు. మండేకి క్లారిటీ వస్తుంది.