ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో మరోసారి చర్చకు తెరలేపే అంశం తెరపైకి వచ్చింది. ఇప్పటికే అనేక పార్టీలు ఉన్న ఏపీలో, తాజాగా మూడు కొత్త రాజకీయ పార్టీలు పురుడు పోసుకోబోతున్నాయన్న టాక్ జోరుగా వినిపిస్తోంది. ఈ పార్టీలు 2029 అసెంబ్లీ ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని తమ లక్ని పరీక్షించేందుకు సిద్ధమవుతున్నాయని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలు ప్రధానంగా రెండు ధృవాలుగా విభజించబడ్డాయి. అధికార కూటమిలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసి పాలన కొనసాగిస్తుండగా, విపక్షంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇక వీటితో పాటు కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులు, లోక్సత్తా, ఆమ్ ఆద్మీ, జైభీం, జై భారత్ వంటి పార్టీలు ఇప్పటికే రాజకీయంగా తమ ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొత్తగా మూడు పార్టీలు రాబోతున్నాయన్న ప్రచారం రాజకీయంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఏబీవీ నాయకత్వంలో కొత్త పార్టీ?
మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు నాయకత్వంలో కొత్త పార్టీ ఏర్పాటు దిశగా చురుకైన ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం. వివిధ సామాజిక వర్గాల ప్రతినిధులతో ఆయన ఇప్పటికే చర్చలు జరుపుతున్నారని, భావసారూప్యం ఉన్న వ్యక్తులతో డిస్కషన్లు పెడుతున్నారని తెలుస్తోంది. 2029 ఎన్నికల నాటికి పార్టీని పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకువచ్చి, వీలైనంత ప్రభావం చూపాలన్నదే ఆయన లక్ష్యమని అంటున్నారు.
విజయసాయిరెడ్డి సైతం పార్టీ దిశగా?
మరోవైపు, మాజీ వైసీపీ నేత, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా కొత్త పార్టీపై ఆలోచనలు చేస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఒకనాటి వైసీపీ మిత్రులను ఆయన సంప్రదిస్తున్నారని, అలాగే సీఎం స్థాయిలో బలమైన సామాజిక వర్గాలకు చెందిన పెద్దలను ఆకట్టుకుని పార్టీ పెట్టాలన్న యోచనలో ఉన్నారని టాక్. వైసీపీలో నంబర్ టూ స్థానంలో కీలకంగా వ్యవహరించిన అనుభవం ఆయనకు ఉంది. అందువల్ల ఏపీ రాజకీయాలపై పూర్తి అవగాహనతో తన పార్టీని ప్రజల్లో నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.
రాయలసీమ కేంద్రంగా మరో పార్టీ?
ఇంకో వైపు రాయలసీమ కేంద్రంగా కొత్త పార్టీ ఏర్పాటవుతుందన్న ప్రచారం కూడా ఊపందుకుంది. ఉమ్మడి ఆరు జిల్లాలైన గ్రేటర్ రాయలసీమనే లక్ష్యంగా చేసుకుని ఈ పార్టీ ఏర్పాటవుతుందని అంటున్నారు. ప్రధానంగా రెండు పెద్ద పార్టీలపై ఉన్న అసంతృప్తిని సొమ్ము చేసుకోవడమే ఈ పార్టీ వ్యూహమని సమాచారం. ఈ పార్టీ కనుక బలంగా నిలబడితే, అది వైసీపీకి రాజకీయంగా ఇబ్బందిగా మారుతుందా? అన్న చర్చ కూడా సాగుతోంది.
డజన్ పార్టీల సీన్…
మొత్తానికి చూస్తే 2029 నాటికి దాదాపు డజన్కు పైగా పార్టీలు రంగంలోకి దిగే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ కొత్త పార్టీల నాయకత్వాలు తమ వ్యక్తిగత ఇమేజ్ని ఫణంగా పెట్టి రాజకీయ ప్రయోగానికి సిద్ధమవుతున్నాయి. తమకు సొంత సామాజిక వర్గాల్లో ఉన్న అసంతృప్తి తమకు ప్లస్ అవుతుందన్న నమ్మకంతో ముందుకు వెళ్తున్నారని చెబుతున్నారు. కొంత ప్రభావం చూపగలిగితే, రేపటి రాష్ట్ర రాజకీయాల్లో తమకూ ఓ గుర్తింపు దక్కుతుందన్న ఆశతో ఈ సాహసానికి దిగుతున్నారని సమాచారం.
డివైడ్ అయిన ఏపీ పాలిటిక్స్
అయితే, ప్రస్తుతం ఏపీ రాజకీయం పూర్తిగా కూటమి వర్సెస్ వైసీపీగా విభజించబడిపోయిందన్న అభిప్రాయం కూడా ఉంది. గెలిచే పార్టీలకే ఓట్లు వేయాలన్న ధోరణి కొత్త పార్టీలకు పెద్ద సవాలుగా మారుతోంది. ఒకప్పుడు ఇండిపెండెంట్లు కూడా అసెంబ్లీలో అడుగుపెట్టిన పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు అలాంటి వాతావరణం కనిపించడం లేదు. ఎంతో చరిత్ర ఉన్న కమ్యూనిస్టులు, కాంగ్రెస్ కూడా డిపాజిట్లు కోల్పోయే పరిస్థితి ఎదుర్కొంటున్న రాజకీయ వాస్తవం ఇది.
అయినా సరే, కొత్త పార్టీల పుట్టుకను ఏపీ రాజకీయ చైతన్యానికి ప్రతీకగా చూడాలన్న వాదన కూడా వినిపిస్తోంది. ప్రజాస్వామ్యంలో కొత్త ఆలోచనలు, కొత్త శక్తులు రావడం సహజమేనని, చివరికి ఎవరు నిలుస్తారో, ఎవరు కనుమరుగవుతారో 2029 ఎన్నికలే తేల్చనున్నాయన్నది రాజకీయ వర్గాల మాట.







