బాలీవుడ్లో సక్సెస్ రేటు నానాటికి తగ్గుతున్నా వచ్చే సినిమాల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. పెద్ద హీరోల సినిమాలు, క్రేజ్ ఉన్న దర్శకుల సినిమాలు, పెద్ద బ్యానర్లో రూపొందిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద కంటిన్యూగా సందడి చేసేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. యాక్షన్ ఎంటర్టైనర్మెంట్ సినిమాలకు హిందీ ప్రేక్షకులు అలవాటు పడ్డ నేపథ్యంలో చాలా మంది యంగ్ హీరోలు అలాంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అలాంటి కాన్సెప్ట్, జోనర్లో రూపొందిన సినిమా ధురంధర్. బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ నటించిన ధురంధర్ సినిమా డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. రణ్వీర్ సింగ్ గత చిత్రాల ఫలితాలతో సంబంధం లేకుండా ఈ సినిమాపై ప్రేక్షకులు, ఆయన అభిమానులు, ఇండస్ట్రీ వర్గాల వారు నమ్మకం పెట్టుకుని ఎదురు చూస్తున్నారు.
రణ్వీర్ సింగ్ ధురంధర్ సినిమాకు ఆదిత్య ధార్ దర్శకత్వం వహించాడు. రచయితగా, నిర్మాతగా పలు హిట్ సినిమాలను అందించిన ఆదిత్య ధార్ కి దర్శకుడిగా ఇది రెండో సినిమా. మొదటి సినిమా ఉరి : ది సర్జికల్ స్క్రైక్ కమర్షియల్గా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు, విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. ఆ సనిమా వచ్చి ఆరు ఏళ్లు దాటిన తర్వాత ఎట్టకేలకు ఆదిత్య ధార్ నుంచి కొత్త సినిమా రాబోతుంది. ఈ సినిమా ప్రారంభించినప్పటి నుంచి అంచనాలు భారీగా పెరుగుతూ వచ్చాయి. అందుకు తగ్గట్టుగా సినిమాను భారీగా ఖర్చు చేసి రూపొందించినట్లు సమాచారం అందుతోంది. తాజాగా ధురంధర్ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ యామి గౌతమ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ సినిమా దర్శకుడు ఆదిత్య ధార్ భార్య అయిన యామి గౌతమ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మరో నెల రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ధురంధర్ సినిమా గురించి యామి గౌతమ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… తాను ఆర్టికల్ 370 సినిమా చేస్తున్న సమయంలో ధురంధర్ కథ విన్నాను. ఆర్టికల్ 370 సినిమాకు రచయితగా చేసిన ఆదిత్య ధార్ ఆ సమయంలోనే నాకు ధురంధర్ కథను చెప్పారు. నా భర్త ఆదిత్య ధర్ ఆ కథ చెప్పినప్పుడు ఏమోషనల్ అయ్యాను. దా స్క్రిప్ట్ చదివిన సమయంలో భావోద్వేగానికి గురి అయ్యాను. నేను ఇప్పటి వరకు చదివిన కథల్లో అత్యంత పవర్ ఫుల్ కథ ధురంధర్ అనిపించింది. ఒక అద్భుతమైన మల్టీస్టారర్ సినిమాను ప్రేక్షకులు ఎక్స్పీరియన్స్ చేయబోతున్నారు అంటూ ధురంధర్ గురించి యామి గౌతమ్ చెప్పుకొచ్చింది. ఆదిత్య ధార్ సినిమా ప్రారంభించినప్పటి నుంచి కూడా నేను ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నాను అని యామి గౌతమ్ చెప్పుకొచ్చింది.
ఈ సినిమాలో రణ్వీర్ సింగ్తో పాటు సంజయ్ దత్, ఆర్ మాధవన్, అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్, సారా అర్జున్, రాకేష్ బేడీ, కీత్ సెక్వేరా తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. 2024 జులైలో మొదటి షెడ్యూల్ ప్రారంభం అయింది. మొదటి షెడ్యూల్ను బ్యాంకాక్ లో నిర్వహించారు. పలు దేశాల్లో చిత్రీకరించిన ఈ సినిమాలోని యాక్షన్ సీన్స్ ప్రధాన ఆకర్షణగా ఉంటాయి అంటూ చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. రణ్వీర్ సింగ్ సినిమా అంటే ప్రేక్షకుల్లో ఒక అంచనా ఉంటుంది, ఆ అంచనాలకు తగ్గట్లుగా ఈ సినిమా ఉంటుంది అంటూ యూనిట్ సభ్యులు చాలా నమ్మకంగా చెబుతున్నారు. డిసెంబర్ 5న విడుదల కాబోతున్న ఈ సినిమాకు బాలీవుడ్ నుంచి పెద్ద సినిమాలతో పోటీ లేదు. కనుక బాక్సాఫీస్ వద్ద సోలోగా సందడి చేసే అవకాశం దక్కింది. మరి హీరోయిన్ యామి గౌతమ్ అన్నట్లుగా ఈ సినిమా మంచి కంటెంట్తో, ఎమోషనల్గా ఉంటే తప్పకుండా ఈ ఏడాది మేటి చిత్రంగా నిలవడం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
 
			



















