మారిన కాలానికి తగ్గట్లు కొందరు పేరున్న జర్నలిస్టులు వ్యవహరిస్తున్న వైఖరి ఇబ్బందికరంగా మారుతోంది. టీవీ చానళ్లలో చర్చల పేరుతో కూర్చొని.. నోటికి వచ్చినట్లుగా మాట్లాడటం.. తమకు తోచిన విశ్లేషణలు చేయటం.. తప్పుడు వ్యాఖ్యల్ని వ్యాప్తి అయ్యేలా చేస్తున్న తీరు ఈ మధ్యన ఎక్కువ అవుతోంది. సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలవటమే కాదు.. శాంతిభద్రతల సమస్యకు కారణంగా మారుతున్నారు. తాజాగా అలాంటి ఉదంతమే ఇప్పుడు చోటు చేసుకుంది. వైసీపీ అధినేత.. ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అంతం చేసేందుకు అమెరికా నుంచి 200 మంది షార్ప్ షూటర్లు వచ్చారని.. ఆయన పర్యటించే ప్రాంతాల్లో రెక్కీ నిర్వహిస్తున్నట్లుగా 99టీవీ చానల్ లో జరిగిన చర్చల సందర్భంగా పత్రి వాసుదేవన్ అనే జర్నలిస్టు వ్యాఖ్యానించారు.
జులై 20న టీవీ చానల్ చర్చలో చెప్పిన ఆయన వ్యాఖ్యలు సంచలనంగా మారటమే కాదు.. కొత్త కలకలానికి కారణమయ్యాయి. అనంతరం తన ఫోన్ స్విచాఫ్ చేసుకొని అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయారు. వాసుదేవన్ వ్యాఖ్యలపై గుంటూరుకు చెందిన జనసేన నేత యర్రంశెట్టి సాయినాథ్ పోలీసులకు కంప్లైంట్ చేశారు. దీంతో జులై 22న నల్లపాడులో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన్ను విచారణకు రావాలని ఆదేశిస్తూ పోలీసులు 41ఏ నోటీసులు ఇచ్చేందుకు జులై 26న హైదరాబాద్ కు వెళ్లిన పోలీసులకు.. ఆయన అండర్ గ్రౌండ్ లోకి వెళ్లినట్లుగా గుర్తించారు. దీంతో. ఈ అంశాన్ని పోలీసులు ఛానల్ యాజమాన్యానికి తెలియజేశారు. ఈ సందర్భంగా చానల్ సీఈవో.. ముగ్గురు సీనియర్ జర్నలిస్టుల స్టేట్ మెంట్ తీసుకున్నారు. జులై 29న పోలీసు విచారణకు వాసుదేవన్ ను పంపుతామని చానల్ నుంచి వచ్చిన హామీతో గుంటూరు పోలీసులు హైదరాబాద్ నుంచి వెళ్లిపోయారు.
అయితే.. పోలీసులు పేర్కొన్న వేళకు వాసుదేవన్ విచారణకు రాకపోవటంతో ఆ అంశాన్ని చానల్ యాజమాన్యానికి పోలీసులు తెలియజేశారు. దీంతో.. చానల్ చీఫ్ ఎడిటర్ భావనారాయణ నల్లపాడు పోలీసు స్టేషన్ కు వచ్చి స్టేట్ మెంట్ ఇచ్చారు. వాసుదేవన్ కథనంపై తమకు ఎలాంటి సమాచారం లేదని.. ఎలాంటి ఆధారాలు లేవని చెప్పినట్లుగా తెలుస్తోంది. వాసుదేవన్ వ్యాఖ్యల్ని పరిశీలించిన పోలీసులు.. గతంలో ఆయన చేసిన వ్యాఖ్యల్ని సేకరిస్తున్నారు. అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిన వాసుదేవన్ పై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని నల్లపాడు పోలీసులు చెబుతున్నారు. ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు. సంచలనం కోసం ఇష్టారాజ్యంగా వ్యాఖ్యలు చేయటం.. బాధ్యత మరిచి.. ఆపై జంప్ అయ్యే తీరును పలువురు తప్పు పడుతున్నారు.