ఏపీ రాజకీయాలు క్రమంగా హీటెక్కుతున్నాయి. గత ఏడాది జూన్ లో అధికారంలోకి వచ్చిన టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి కొన్ని నెలల పాటు కూల్ గానే వ్యవహరించిన.. ఆ తరువాతే అసలు గేమ్ స్టార్ట్ చేసింది. అప్రతిహతంగా ఐదేళ్లపాటు పాలన సాగించిన వైసీపీకి చుక్కలు చూపిస్తోంది. తాజాగా కూటమి కొట్టిన ఒక్క దెబ్బకు వైసీపీలో ఏకంగా మూడు వికెట్లు ఒకేసారి డౌన్ అయ్యాయి. చీరాల, మాచర్ల, కడపలో అవినీతి, అవిశ్వాసం, అధికార దుర్వినియోగం ఆరోపణలతో ముగ్గురు వైసీపీ నేతల పదవులును పీకిపారేసింది.
వైఎస్ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడు, కడప మేయర్ సురేశ్ బాబుపై కూటమి ప్రభుత్వం వేటు వేసింది. కడప అభివృద్ధి పనుల్లో భాగంగా మున్సిపల్ చట్టాన్ని ఉల్లంఘించినందుకు గానూ సురేశ్ బాబును మేయర్ పదవి నుంచి తప్పిస్తూ కూటమి సర్కార్ ఉత్తర్వులు జారీ చేసి బిగ్ షాక్ ఇచ్చింది.అటు బాపట్ల జిల్లా చీరాల మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావుపై పెట్టిన అవిశ్వాసం తీర్మానంలో టీడీపీ నెగ్గింది. ఎంపీ కృష్ణప్రసాద్, ఎమ్మెల్యే కొండయ్య ఓట్లతో పాటు ఆమంచి వర్గం ఐదుగురు కౌన్సిలర్లతో కలుపుకొని 26 ఓట్లతో టీడీపీ చీరాల మున్సిపాలిటీ తన ఖాతాలో వేసుకోగా.. శ్రీనివాసరావు తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.
ఇంకోవైపు పల్నాడు జిల్లా మాచర్లలోనూ వైసీపీకి దెబ్బ పడింది. మాచర్ల మున్సిపల్ ఛైర్మన్ తురకా కిశోర్ పదవి నుంచి తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎటువంటి అనుమతి లేకుండా వరుసగా 15 కౌన్సిల్ సమావేశాలకు అతడు గైర్హాజరు కావడం, బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించకపోవడం వంటి అంశాలను తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం..ఏపీ మున్సిపల్ చట్టంలోని సెక్షన్ 16(1)(కె) ప్రకారం తురకా కిశోర్ కు ఉద్వాసన పలికింది.