అమెరికాలో అక్రమ వలసదారులను బహిష్కరించడానికి అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ తీసుకుంటున్న చర్యలను నిరసిస్తూ లాస్ ఏంజలెస్లో పెద్దఎత్తున ఆందోళనలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో భారీ సంఖ్యలో అరెస్టులు జరిగాయి. నగరంలో 2,100 మంది నేషనల్ గార్డ్ దళ సభ్యులతోపాటు 700 మంది మెరైన్ దళ సభ్యులను ట్రంప్ మోహరించారు.ఇది రాజకీయ వివాదానికి దారితీసింది. అయితే, ఆందోళనలకు దిగిన వారిని ‘హింసాత్మకమైన, తిరుగుబాటు ముఠా’ అని ట్రంప్ అభివర్ణించారు.అమెరికాలోని రెండో అతిపెద్ద నగరమైన లాస్ ఏంజలెస్లోని ఆందోళనలు జరిగిన ప్రాంతాల్లో కొన్ని వాహనాలు అగ్నికి ఆహూతయ్యాయని, మరికొన్ని ప్రాంతాల్లో దొంగతనాలు జరిగినట్లు రిపోర్టులు చెబుతున్నాయి.అధికారుల రెయిడ్స్కు వ్యతిరేకంగా శాన్ ఫ్రాన్సిస్కోలో ఆదివారం జరిగిన హింసాత్మక ఘటనల్లో పాల్గొన్న వందమందికి పైగా ఆందోళనకారులను అదుపులోకి తీసుకొని, తర్వాత విడుదల చేశారు.వైట్హౌస్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం….లాస్ ఏంజలెస్లో 2,100 నేషనల్ గార్డ్ బలగాలను మోహరించారు. అక్కడ 700 మంది మెరైన్స్ దళ సభ్యులు విధుల్లో ఉన్నారని అమెరికా ఆర్మీ ధ్రువీకరించింది.
“టాస్క్ ఫోర్స్ 51కి మద్దతు ఇవ్వడానికి మెరైన్లను కార్యాచరణలోకి తీసుకొచ్చాం. ఈ ప్రాంతంలో తగినంత బలగాలు మోహరించడానికి, ప్రధాన ఫెడరల్ ఏజెన్సీకి సాయంగా ఉండటానికి ఇది జరుగుతుంది” ఆర్మీ తెలిపింది.అంతకుముందు, రక్షణ మంత్రి పెటే హేగ్సేత్ శనివారం మాట్లాడుతూ..లాస్ ఏంజలెస్లో హింస కొనసాగితే బలగాలు మోహరించడానికి పెంటగాన్ సిద్ధంగా ఉందని చెప్పారు. హై అలర్ట్గా మెరైన్స్ను క్యాంప్ పెండ్లెటన్కు సమీపంలో మోహరించామని వెల్లడించారు.1992 మే నెలలో లాస్ ఏంజలెస్లో జరిగిన అల్లర్ల సమయంలో సుమారు 1,500 మెరైన్స్ను మోహరించారు. ఇందుకోసం అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జ్ హెచ్డబ్ల్యూ బుష్ ఇన్సర్రెక్షన్ (తిరుగుబాటు) యాక్ట్ను ఉపయోగించారు.ఈ చట్టం అమెరికా సైనికులను దేశీయంగా అధికారులకు సహాయపడేలా చూసేందుకు అధ్యక్షుడికి అధికారం ఇస్తుంది.ఈ చట్టం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 355కు దగ్గరగా ఉంటుంది. అంతర్గత అలజడులను అరికట్టేందుకు భారత సైన్యం లేదా పారామిలటరీ బలగాలను మోహరించడానికి ఈ ఆర్టికల్ను ఉపయోగిస్తారు.
”ఇది తీవ్రమైన విషయమే” అని కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ నుస్సామ్ అన్నారు.ట్రంప్ బహిష్కరణ విధానం ప్రకారం, అక్రమ వలసదారులను గుర్తించేందుకు శుక్రవారం (జూన్ 6న) దాడులు చేపట్టారు. దీన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలు మొదలయ్యాయి. ఇవి 8వ తేదీ నాటికి హింసాత్మకంగా మారాయి.లాస్ ఏంజలెస్లో శుక్రవారం నుంచి నెలకొన్న అశాంతియుత పరిస్థితుల్లో హింస చోటుచేసుకోవచ్చని ది లాస్ ఏంజలెస్ కౌంటీ షెరీఫ్స్ డిపార్ట్మెంట్ (ఎల్ఏఎస్డీ) చెప్పింది.ఇదే సమయంలో, కొంతమంది అక్రమ వలసదారులను ఇమ్మిగ్రేషన్ డిపార్ట్మెంట్ అదుపులోకి తీసుకుంది. ఈ ఘటనతో లాస్ ఏంజలెస్లో పరిస్థితి చాలా ఉద్రిక్తంగా మారింది.హింసాత్మక ఘర్షణలు రోజులపాటు కొనసాగడంతో, ప్రజలు గుంపులు గుంపులుగా తిరగడంపై పోలీసులు నిషేధం విధించారు.లాటిన్ జనాభా అధికంగా ఉన్న లాస్ ఏంజలెస్ నగర ప్రాంతాల్లో రైడ్స్ నిర్వహిస్తామని ఇమ్మిగ్రేషన్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ఐసీఈ) అధికారులు ప్రకటించిన తర్వాత ఈ ఆందోళనలు మొదలయ్యాయి.
వెస్ట్లేక్, అలాగే లాస్ ఏంజలెస్ దక్షిణ భాగంలోని పారామౌంట్ ప్రదేశాల్లో అధికారులు చర్యలు చేపట్టినట్లు అమెరికా భాగస్వామి సీబీఎస్ వెల్లడించింది. సెంట్రల్, సౌత్ అమెరికా దేశాల నుంచి వలస వచ్చినవారే ఇక్కడ 82 శాతానికి మించి ఉన్నారు.రోజుకు 3 వేల మందిని అరెస్టు చేయాలని ట్రంప్ గత నెలలో ఫెడరల్ ఏజెంట్లను ఆదేశించిన తర్వాత ఇమ్మిగ్రేషన్ రెయిడ్స్ పెరిగాయి. ఇటీవలి రెయిడ్స్ అమెరికా చరిత్రలో అతిపెద్ద డిపోర్టేషన్ క్యాంపెయిన్ చేపట్టాలన్న ట్రంప్ లక్ష్యంలో భాగంగా జరిగినవే.శుక్రవారం ఒక వర్క్ప్లేస్లో నిర్వహించిన తనిఖీల్లో 44 మంది అక్రమ వలసదారులను అరెస్టు చేశామని సీబీఎస్కు ఐసీఈ వెల్లడించింది. అదే రోజు, గ్రేటర్ లాస్ ఏంజలెస్లో కూడా 77 మందిని నిర్బంధించారు.ఈ దాడుల నేపథ్యంలో, అరెస్టుల సమాచారం వ్యాపించడంతో లాస్ ఏంజలెస్లోని ఫెడరల్ భవనం ఆందోళనలకు కేంద్ర స్థానమైంది. ఆ గోడలపై నినాదాలు రాశారని, పోలీసులపైకి కొన్ని వస్తువులు విసిరారని సీబీఎస్ వెల్లడించింది.
ఈ నేపథ్యంలో అక్కడ నిరసన ప్రదర్శనలు చట్టవ్యతిరేకమని అధికారులు ప్రకటించారు.డోనల్డ్ ట్రంప్ లాస్ ఏంజలెస్లో 2,100 నేషనల్ గార్డ్ బలగాలను మోహరించారు. దీంతో, ఆ రాష్ట్ర నాయకులతో ఆయనకు వివాదం మొదలైంది.”హింసాత్మకమైన ఆందోళనలతో ఫెడరల్ మ్మిగ్రేషన్ డిటెన్షన్ సెంటర్లకు, ఇతర ప్రభుత్వ ఆస్తులకు ప్రమాదం పొంచి ఉంది. ఫలితంగా వాటికి నష్టం కలుగుతుంది” అని వైట్హౌస్ పేర్కొంది.”చట్టబద్ధమైన కార్యకలాపాలను ప్రత్యక్షంగా అడ్డుకోవడం అమెరికా ప్రభుత్వ అధికారంపై తిరుగుబాటు రూపమే” అని హెచ్చరించింది.ఇలాంటి పరిస్థితిలో, దీన్ని చక్కదిద్దడానికి నేషనల్ గార్డ్ దళాలు అవసరమని వైట్హౌస్ తెలిపింది.నేషనల్ గార్డ్ అమెరికాకు సంబంధించిన ఒక భద్రతా విభాగం. ఇటు రాష్ట్రానికి, అటు కేంద్రానికి సమానంగా పనిచేస్తుంది. సాధారణంగా సంబంధిత రాష్ట్ర గవర్నర్ విన్నపం మేరకు ఈ బలగాలను కేంద్రం పంపిస్తుంది.
సాధారణ పరిస్థితుల్లో నేషనల్ గార్డ్ ఆ రాష్ట్ర గవర్నరు పరిధిలో పనిచేస్తారు. కానీ, అత్యవసర పరిస్థతిల్లో అధ్యక్షుడి ఆదేశాలకు బద్ధులై ఉంటారు.లాస్ ఏంజలెస్లో మాత్రం గవర్నర్ కోరకపోయినా, ఫెడరల్ చట్టాన్ని ఉపయోగించుకొని నేషనల్ గార్డ్ బలగాలను మోహరించారు ట్రంప్.రాష్ట్ర గవర్నర్ అడగకుండానే నేషనల్ గార్డ్ బలగాలను పంపడం 1965 తర్వాత ఇదే మొదటిసారని కొన్ని రిపోర్టులు చెబుతున్నాయి.భారతదేశంలో కూడా, ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం విన్నపం మేరకే సైన్యం లేదా పారామిలటరీ బలగాలను కేంద్రం పంపిస్తుంది. కానీ, జాతీయ అత్యవసర పరిస్థితి (ఆర్టికల్ 352), రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం వైఫల్యం (ఆర్టికల్ 356), అంతర్గత కల్లోలం, తిరుగుబాటు (ఆర్టికల్ 355) వంటి పరిస్థితుల్లో రాష్ట్రాల విన్నపం లేకపోయినా కేంద్రం జోక్యం చేసుకోవచ్చు.
ట్రంప్ ప్రభుత్వంపై కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ నుస్సామ్ న్యాయ పోరాటానికి దిగారు. 10వ సవరణ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అధికార పరిధిలోకి అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ చొరబడ్డారని ఆయన తన వ్యాజ్యంలో ఆరోపించారు.ఆందోళనకారులను ఉద్దేశించి, లాస్ ఏంజలెస్ మేయర్ కరేన్ బాస్ ‘ఎక్స్’లో పోస్టు చేశారు.శాంతియుతంగా ప్రదర్శన చేసుకోవాలని, ట్రంప్ ప్రభుత్వ ట్రాప్లో పడొద్దని సూచించారు. దోపిడి, విధ్వంసం సహేతుకం కాదని మేయర్ చెప్పారు.వ్యాజ్యంపై అధ్యక్షుడు ట్రంప్ స్పందిస్తూ, ”నేను చూసిన క్లిప్ మీరు కూడా చూడండి. కార్లు కాలిపోయాయి, అల్లర్లు జరుగుతున్నాయి. మనం వాటిని ఆపాలి. ఇప్పుడు చర్యలు తీసుకోకపోతే, అక్కడి ఇళ్ల మాదిరిగానే ఆ ప్రదేశం తగులబడిపోతుంది” అని చెప్పారు.