బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై జరుగుతున్న ఏసీబీ విచారణపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రంగా స్పందించారు. ఈ కేసును కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన రాజకీయ ప్రతీకార చర్యగా ఆమె అభివర్ణించారు. ప్రజల దృష్టిని ప్రధాన సమస్యల నుండి మరల్చడానికే ఇలాంటి విచారణలు ప్రారంభించారని ఆమె ఆరోపించారు.
కవిత మాట్లాడుతూ.. “ప్రతి పార్టీకి లోపాలు ఉంటాయి. వాటిని అధినేతకు తెలియజెప్పడం సహజం. కానీ దాన్నే పెద్ద దోషంగా చిత్రీకరించడం తగదు. మా పార్టీలో లోపాలుంటే వాటిని సరిదిద్దుకునే శక్తి మాలో ఉంది. కానీ మాపై ఎవరు దాడి చేస్తే చూస్తూ ఊరుకోం. రాజకీయంగా ఎదురుదెబ్బ తీయడానికి కాంగ్రెస్ సర్కారు విచారణల పేరుతో వేధింపులు చేస్తోంది” అని వ్యాఖ్యానించారు.
కేసీఆర్ కు ఇటీవల అసంతృప్తి లేఖ రాసి బీఆర్ఎస్ లో కలకలం రేపింది కవిత. ఇందులో కేటీఆర్ తోపాటు కొంతమందిపై విమర్శలు చేసింది. బీఆర్ఎస్ లో దెయ్యాలు ఉన్నాయని ఆరోపించింది. ఇప్పుడు పాత పగలన్నీ మాని కేటీఆర్ కు మద్దతుగా మాట్లాడడంతో ఇక కవిత అసమ్మతి, అసంతృప్తి ముగిసినట్టేనని తెలుస్తోంది
ఇక కాంగ్రెస్ హామీలపై ఆమె తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎన్నికల ముందు రైతులకు, మహిళలకు, వృద్ధులకు పలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు ఒక్కటీ నెరవేర్చలేదని ధ్వజమెత్తారు. “రైతు భరోసా పేరుతో ఇప్పటివరకు 60 శాతం రైతులకే మద్దతిచ్చారు. మిగిలిన 40 శాతం రైతులు ఎప్పుడు నిధులు పొందబోతున్నారో చెప్పాలి. మహిళలకు వాగ్దానం చేసిన రూ.2500 ఇవ్వలేదు. వృద్ధులకు పింఛన్లు పెంచలేదు. ఇలా అన్ని హామీలను విస్మరించి, మోసం చేసి ప్రజలను కంగారు పెడుతున్నారు” అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
కవిత తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. “మా పార్టీ అధినేత కేసీఆర్ను కాళేశ్వరం కమిషన్ పేరుతో విచారించారు. ఇప్పుడు కేటీఆర్ను ఏసీబీ విచారిస్తోంది. ఇది స్పష్టమైన రాజకీయ పగ. మా నాయకులను, కార్యకర్తలను ఇళ్ల నుంచి రాకుండా అడ్డుకోవడం దారుణం. తెలంగాణ భవన్ తాళం వేయడం అత్యంత దుర్మార్గమైన చర్య. మేము ఈ దాడులను ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నాం. ఎవరు ఎంత వేధింపులకు పాల్పడ్డా భయపడేది లేదు. మేము లోపాలను సరిదిద్దుకుంటాం. కానీ దాడులకు మాత్రం సమాధానం చెబుతాం” అని ఆమె స్పష్టం చేశారు. ఈ పరిణామాలతో తెలంగాణ రాజకీయాల్లో ఉద్రిక్తత మళ్లీ పెరిగింది. బీఆర్ఎస్ – కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం మరింత తీవ్రమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. రానున్న రోజుల్లో ఈ విచారణలు, రాజకీయ విమర్శలు ఎలాంటి మలుపులు తీసుకుంటాయో వేచి చూడాలి.