ఓ వ్యాపారవేత్త ఇంట్లో పని మనిషి తన చేతివాటాన్ని గట్టిగానే ప్రదర్శించింది. ఏకంగా కోటి రూపాయల విలువైన బంగారు అభరణాలు, నగదును దొంగిలించింది. అపహరించిన వాటిలో రూ.67లక్షల నగదు కాగా, రూ.33 లక్షల బంగారు ఆభరణాలు ఉన్నాయి. పోలీసుల విచారణలో నిజం తేలగా చివరకు కటకటాల పాలైంది. ఈ ఘటన కర్ణాటకలోని చామరాజ్పేట జిల్లాలో జరిగింది.
చామరాజ్నగర్ జిల్లాలోని ఇలియాస్ నగర్లో ఉమ నివస్తోంది. చామరాజ్నగర్ జిల్లా కేంద్రంలోని రోడ్ నంబర్ 3లో నివసించే రాధ అనారోగ్యంతో బాధపడుతున్న తన సోదరి సుజాతను చూసుకోవడానికి 3 నెలల కిందట ఉమను నియమించుకుంది. రాధ నగర్తపేటలో సెక్యూరిటీ ఏజెన్సీ నడుపుతోంది.
ఉమకు నెలకు రూ.23,000 జీతం ఇస్తామని మాట్లాడుకున్నారు. రాధ 2 నెలల క్రితం ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని తన ప్లాట్ను విక్రయించి, వచ్చిన డబ్బును ఇంట్లోని అల్మారాలో ఉంచింది. ఫ్లాట్ కొనాలని ప్లాన్ చేస్తున్న రాధ జూన్ 9న అల్మారాలో పెట్టిన నగదను తీసుకోవడానికి వెళ్లగా, అందులో పెట్టిన డబ్బు, నగలు కనిపించలేదు. దీంతో హడలిపోయిన రాధ, సీసీటీవీ కెమెరాను తనిఖీ చేసింది.
జూన్ 4 ఉదయం పనిమనిషి చేతిలో బ్యాగుతో వెళ్లిపోయినట్లు కనిపించింది. ఉమను ప్రశ్నించగా, తనకు ఏమీ తెలియదని సమాధానం ఇచ్చింది. రాధ వెంటనే చామరాజ్పేట పోలీస్ స్టేషన్లో ఉమపై ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి ఉమను అదుపులోకి తీసుకుని విచారించగా, తాను రూ.కోటి విలువైన నగదు, అభరాణలు అపహరించినట్లు ఒప్పుకుంది. ఉమ కుమార్తె ఇంట్లో ఉంచిన రూ.50.57 లక్షల నగదు, రూ.12.66 లక్షల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు, మిగిలిన సొమ్ము నగల కోసం దర్యాప్తు చేస్తున్నారు.