కర్ణాటకలో ఇటీవల తీవ్ర కలకలం రేపిన ఐదు పులుల మృతి కేసు మిస్టరీ వీడింది. తన పెంపుడు ఆవును పులి చంపిందన్న ప్రతీకారంతోనే ఓ వ్యక్తి ఈ దారుణానికి పాల్పడినట్లు అటవీశాఖ అధికారుల దర్యాప్తులో తేలింది. ఈ ఘటనకు సంబంధించి ప్రధాన నిందితుడితో పాటు అతడికి సహకరించిన మరో ఇద్దరిని అధికారులు అరెస్ట్ చేశారు.
పూర్తి వివరాల్లోకి వెళితే.. తమిళనాడు, కేరళ సరిహద్దుల్లోని కర్ణాటక చామరాజనగర జిల్లా, మలెమహదేశ్వర వన్యప్రాణి సంరక్షణ కేంద్రం పరిధిలో కొద్ది రోజుల క్రితం ఒక తల్లి పులి, నాలుగు కూనలు మరణించాయి. ఈ ఘటనపై విచారణ చేపట్టిన అధికారులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. స్థానికంగా నివసించే మాదురాజు అనే వ్యక్తి, తాను ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న ‘కించి’ అనే ఆవును ఇటీవల ఓ పులి వేటాడి చంపడంతో తీవ్ర ఆవేదనకు గురయ్యాడు.
దీంతో పులిపై పగ పెంచుకున్న మాదురాజు, ఎలాగైనా దాన్ని చంపాలని నిర్ణయించుకున్నాడు. తన స్నేహితులైన కోనప్ప, నాగరాజుల సహాయంతో ఒక పథకం వేశాడు. పులి దాడిలో చనిపోయిన తన ఆవు కళేబరానికి విషం పట్టించి, దాన్ని అటవీ ప్రాంతానికి సమీపంలో వదిలేశాడు. ఆ విషపూరితమైన మాంసాన్ని తిన్న తల్లి పులి, దాని నాలుగు పిల్లలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాయి.
ఈ కేసును సవాలుగా తీసుకున్న అటవీశాఖ అధికారులు, తమ దర్యాప్తులో మాదురాజే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని గుర్తించారు. అతడితో పాటు సహకరించిన స్నేహితులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం వారిని మీణ్యం ప్రాంతంలోని ‘అరణ్య భవన్’కు తరలించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ దారుణ ఘటనపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య స్పందించారు. జరిగిన విషయంపై పూర్తి నివేదిక సమర్పించాలని, నిందితులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని అటవీశాఖ మంత్రి ఈశ్వర ఖండ్రేను ఆయన ఆదేశించారు.