తమిళ స్టార్ హీరో జయం రవి వ్యక్తిగత జీవితం ప్రస్తుతం కోర్టు విచారణలో ఉంది. ఆయన భార్య ఆర్తి విడాకుల కోసం దాఖలు చేసిన పిటిషన్ ఇప్పుడు కోలీవుడ్ లో హాట్ టాపిక్గా మారింది. చెన్నై ఫ్యామిలీ కోర్టులో ఈ కేసు విచారణకు రాగా, ఇద్దరూ వ్యక్తిగతంగా హాజరయ్యారు. భార్యగా తనకు నెలకు రూ.40 లక్షల భరణం అందాలని ఆర్తి కోర్టును కోరగా, జయం రవి మాత్రం తమ వైవాహిక బంధం ఇక కొనసాగదని స్పష్టం చేశారు.
ఈ వివాదానికి కారణంగా గాయని కెనీషా పేరు తెరపైకి వచ్చింది. జయం రవి – కెనీషా మధ్య ఉన్న సన్నిహితత వల్లే ఇలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయని వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఒక వేళ ఇది నిజమైతే, జయం రవి గతంలో వ్యక్తిగత జీవితం చాలా డిసిప్లిన్గా ఉందని భావించిన అభిమానులకు ఇది షాక్గానే చెప్పాలి. పైగా ఇటీవల ఓ కార్యక్రమంలో జయం రవి – కెనీషా కలిసే కనిపించడం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది.
ఇక సోషల్ మీడియాలో కూడా ఈ అంశం పెద్ద చర్చనీయాంశంగా మారింది. తన పిల్లల భవిష్యత్తు కోసమే పోరాడుతున్నానని ఆర్తి భావోద్వేగంతో పోస్ట్ చేయగా, జయం రవి మాత్రం తనపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. మూడో వ్యక్తి కారణమని ఆర్తి చేసిన వ్యాఖ్యలు ఈ వ్యవహారాన్ని మరింత సీరియస్ దశకు తీసుకెళ్లాయి. ప్రస్తుతం కేసు తదుపరి విచారణ జూన్ 12కి వాయిదా పడింది.