జలవనరుల శాఖపై శాసనసభలో స్వల్పకాలిక చర్చ జరిగింది. జలవనులర శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు (Minister Nimmala Ramanaidu) మాట్లాడుతూ… కూటమి అధికారంలోకి వచ్చాక 10 లక్షల కోట్ల రూపాయాలు అప్పులు వారసత్వంగా వచ్చాయన్నారు. ఒక్క సంవత్సరం వర్షాలు బాగాపడితే రెండు మూడేళ్లు కరవు బారిన పడకుండా ప్రజలను కాపాడుకోవచ్చు అని సీఎం అంటారని తెలిపారు. పోలవరాన్ని గత ప్రభుత్వం ప్రశ్నార్ధకం చేసిందని విమర్శించారు. టీడీపీ 72 శాతం పూర్తి చేయగా వీరు అయిదేళ్లలో 2 శాతం పూర్తి చేశారన్నారు. 2027 డిసెంబర్ నాటికి ఆ ప్రాజెక్టు పూర్తి చేయాలని సీఎం ఆదేశాలు ఇచ్చారని తెలిపారు.
హంద్రీనీవ ద్వారా కృష్ణమ్మ జలాలను 700కు పైగా కిలో మీటర్లు తీసుకువెళ్లామన్నారు. 2026 జూలైకి వెలుగొండ పూర్తి చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. ప్రాధాన్యతా క్రమంలో ప్రాజెక్టుల నిర్మాణం చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. రెండు సంవత్సరాల్లో ఉత్తరాంధ్రలోని ప్రాజెక్టులు క్లియర్ చేయాలని నిర్ణయించామన్నారు. ప్రాజెక్టులు, రిజర్వాయర్లు మెయింటెనెన్స్ లేకపోతే ఇబ్బంది ఉంటుందన్నారు.
గత ప్రభుత్వం గ్రీజు కూడా పెట్టలేదని… దీని వల్ల ప్రాజెక్టులు, గేట్లు కొట్టుకుపోయాయని అన్నారు. మెయింటెనెన్స్ నిమిత్తం 3 విడుతల్లో రూ.800 కోట్లు సిఎం ఇచ్చారని సభలో తెలిపారు. ఐడీసీ లిఫ్ట్ ఇరిగేషన్లలో 1040 ఉంటే వాటిలో 140 మాత్రామే ఇప్పుడు పనిచేస్తున్నాయన్నారు. దీనికి కారణం కూడా గత ప్రభుత్వ నిర్లక్ష్యమే… వాటిని సరిచేస్తున్నామని చెప్పారు. ఏపీని కరవు రహిత రాష్ట్రంగా మార్చాలని ఇరిగేషన్ శాఖను ప్రక్షాళన చేసి ముందుకు తీసుకువెళుతున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.















