ఆంధ్రప్రదేశ్లో వరుస కస్టోడియల్ డెత్ ఆరోపణలతో పోలీసు వ్యవస్థపై ప్రశ్నలు పెరుగుతున్నాయి.
నేరం నిరూపితమయ్యే వరకు ప్రతి వ్యక్తి నిర్దోషే. నిందితులు మాత్రమే నేరస్థులు కాదు . ఇది భారత రాజ్యాంగం చెప్పిన మౌలిక సూత్రం. అయితే, ఇటీవల ఆంధ్రప్రదేశ్లో వెలుగులోకి వస్తున్న కస్టోడియల్ డెత్ ఆరోపణలు ప్రజాస్వామ్య వ్యవస్థనే ప్రశ్నించే స్థాయికి చేరుకున్నాయి. పోలీసు కస్టడీలో ఉన్న వ్యక్తుల భద్రతపై ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది. చట్టాన్ని కాపాడాల్సిన వారే చట్టాన్ని ఉల్లంఘిస్తే న్యాయం కోసం ప్రజలు ఎవరిని ఆశ్రయించాలి? అనే ప్రశ్న సమాజం ముందుకొస్తోంది.
కస్టడీలో మరణం అనేది ఒక వ్యక్తి ప్రాణం కోల్పోవడం మాత్రమే కాదు. అది చట్టపాలన, మానవ హక్కులు, రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్య విలువలపై పడే తీవ్రమైన నీడ. ఒకవేళ కస్టడీలో చిత్రహింసలు, అక్రమ నిర్బంధం, ఆధారాల ధ్వంసం వంటి ఆరోపణలు నిజమైతే, అవి కేవలం శాఖాపరమైన తప్పిదాలు కాదు ప్రజాస్వామ్యంపై మచ్చలుగా మిగిలిపోతాయి.
విజయవాడకు చెందిన సాయికృష్ణ కేసు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కోర్టులో సమర్పించిన రిమాండ్ రిపోర్టులో, సాయికృష్ణ పోలీసు కస్టడీలో మరణించినట్లు ప్రాథమికంగా నిర్ధారించామని పేర్కొంది.
రిపోర్టు ప్రకారం సాయికృష్ణను అక్రమంగా నిర్బంధించారని, కస్టడీలో హింసకు గురిచేశారని, మరణం అనంతరం ఆధారాలు చెరిపివేసే ప్రయత్నం జరిగిందని, పోలీస్ స్టేషన్ సీసీటీవీ ఫుటేజ్లో కీలక డేటా లేకపోవడం గుర్తించామని వెల్లడించింది. ఈ కేసులో సంబంధిత సర్కిల్ ఇన్స్పెక్టర్ను సస్పెండ్ చేసి అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు.
అత్యంత ఆవేదన కలిగించిన ఆరోపణ ఏమిటంటే మరణించిన వ్యక్తి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండా అనాథ శవంగా చూపించి దహన సంస్కారాలు నిర్వహించారని ఆరోపణలు రావడం. ఈ ఆరోపణలు నిజమని తేలితే అది కేవలం చట్ట ఉల్లంఘనే కాదు, మానవత్వానికే మాయని మచ్చగా నిలుస్తుంది.
ఈ కేసును జాతీయ మానవ హక్కుల కమిషన్ అత్యంత తీవ్రంగా పరిగణించింది. ప్రాథమిక సమాచారం నిజమైతే ఇది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కింద ఉన్న జీవించే హక్కు ఉల్లంఘనగా, తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనగా అభిప్రాయపడింది.
రాష్ట్ర డీజీపీ, విజయవాడ పోలీస్ కమిషనర్కు నోటీసులు జారీ చేసి, వారం రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. SIT దర్యాప్తు పురోగతి, సంబంధిత అధికారులపై నమోదైన కేసులు, తీసుకున్న చర్యల వివరాలు సమర్పించాలని స్పష్టం చేసింది.
బడినేహాల్ గంగమ్మ కేసు… మరో ఆందోళన
విజయవాడ ఘటన చర్చలో ఉండగానే కర్నూలు జిల్లా కౌతాళం మండలం బడినేహాల్ గ్రామానికి చెందిన మాల గంగమ్మ మరణం మరోసారి పోలీసు వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తింది.
గంగమ్మ కుమారుడు వీరేంద్ర అదృశ్యమైన కేసులో పోలీసుల దర్యాప్తుపై అసంతృప్తితో ఆమె హైకోర్టును ఆశ్రయించారు. అనంతరం హైకోర్టు ఆదేశాలతో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పడింది.
సిట్ విచారణ సమయంలో గంగమ్మపై తీవ్ర శారీరక హింస జరిగిందని కుటుంబ సభ్యులు, పిటిషనర్లు ఆరోపించారు. అనంతరం ఆమె అస్వస్థతకు గురై ఆసుపత్రిలో మరణించారు.
హైకోర్టులో దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంలో, ఇది సహజ మరణం కాదని, కస్టడీలో జరిగిన చిత్రహింసల ఫలితమేనని ఆరోపించారు. అలాగే పోస్ట్మార్టం నిర్వహించకుండానే అంత్యక్రియలు చేశారని కూడా ఆరోపణలు వచ్చాయి.
ఈ కేసులో కీలక సాక్షిగా భావిస్తున్న బేగారి దర్గప్ప వాంగ్మూలాన్ని వెంటనే జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఎదుట నమోదు చేయాలని హైకోర్టు ఆదేశించింది. అవసరమైతే ఆసుపత్రికే వెళ్లి వాంగ్మూలం నమోదు చేయాలని కూడా సూచించింది.
అయితే ఈ కేసులో విచారణ ఇంకా కొనసాగుతోంది. గంగమ్మ మరణానికి కస్టడీలో హింసే కారణమా అనే అంశం న్యాయపరంగా ఇంకా తేలాల్సి ఉంది. కోర్టు ఇప్పటివరకు ఆరోపణలను నిజమని నిర్ధారించలేదు. ప్రభుత్వ అధికారిక దర్యాప్తు కూడా పూర్తికాలేదు.
రాజ్యాంగం చెప్పేది ఏమిటి?
భారత రాజ్యాంగం నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికీ పూర్తి రక్షణ కల్పిస్తుంది.
ఆర్టికల్ 21 ప్రతి వ్యక్తికి జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛను హామీ ఇస్తుంది.
ఆర్టికల్ 22 అరెస్టు సమయంలో ప్రతి వ్యక్తికి చట్టపరమైన రక్షణలను కల్పిస్తుంది.
అదే విధంగా సుప్రీంకోర్టు D.K. Basu వర్సెస్ State of West Bengal కేసులో పోలీసులు తప్పనిసరిగా పాటించాల్సిన మార్గదర్శకాలను నిర్దేశించింది. అరెస్టు మెమో తయారు చేయడం, కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడం, వైద్య పరీక్షలు నిర్వహించడం, అరెస్టు వివరాలను నమోదు చేయడం వంటి నిబంధనలు అందులో ఉన్నాయి.
ఈ నిబంధనలు ఉల్లంఘించబడితే అది రాజ్యాంగ హక్కుల ఉల్లంఘనగా పరిగణించబడే అవకాశం ఉంది. ఇటీవలి కాలంలో ఈ నిబంధనలు సక్రమంగా అమలు కావడం లేదన్న ఆరోపణలు వినిపించడం ఆందోళన కలిగిస్తోంది.
ప్రజాస్వామ్యంలో పోలీసు వ్యవస్థ పాత్ర
పోలీసు శాఖ ప్రజల భద్రత కోసం ఏర్పడింది. నేరస్థులను చట్టం ముందు నిలబెట్టడం పోలీసుల బాధ్యత. కానీ శిక్ష విధించే అధికారం పోలీసులకు లేదు. ఆ అధికారం కోర్టులకే చెందుతుంది.
పోలీసు కస్టడీలో ఉన్న వ్యక్తి ప్రాణాలకు పూర్తి బాధ్యత రాష్ట్రంపైనే ఉంటుంది. ఒకవేళ కస్టడీలో హింస, మరణం, ఆధారాల ధ్వంసం వంటి ఆరోపణలు నిజమని తేలితే అది వ్యక్తిగత అధికారుల తప్పిదం మాత్రమే కాదు, చట్టపాలనపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసే ఘటన అవుతుంది.
సమాజం అడుగుతున్న ప్రశ్నలు
ఈ రెండు ఘటనలు రాష్ట్రంలో కస్టడీలో ఉన్న వ్యక్తుల భద్రత, పోలీసు విచారణ పద్ధతులు, రాజ్యాంగ హక్కుల పరిరక్షణపై విస్తృత చర్చకు దారితీశాయి.
అయితే ఒక విషయం స్పష్టంగా గుర్తుంచుకోవాలి. ఏ కేసులోనైనా ఆరోపణలు తీవ్రమైనవైనా, వాటిని నిజమని తేల్చేది దర్యాప్తు సంస్థలు, న్యాయస్థానాలే. విచారణ పూర్తికాకముందే ఎవరికైనా నేరాన్ని ఆపాదించడం చట్టబద్ధంగా సరైంది కాదు.
అదే సమయంలో, ప్రజాస్వామ్యంలో చట్టం కంటే ఎవరూ గొప్పవారు కాదు. రాజ్యాంగం ప్రతి పౌరుడికీ జీవించే హక్కును హామీ ఇస్తుంది. ఆ హక్కును కాపాడటం రాష్ట్ర ప్రభుత్వానికీ, పోలీసు వ్యవస్థకీ రాజ్యాంగబద్ధమైన బాధ్యత.
కస్టడీలో ఒక ప్రాణం కోల్పోతే అది ఒక కుటుంబం విషాదం మాత్రమే కాదు… ప్రజాస్వామ్య మనస్సాక్షికి వేసిన ప్రశ్న. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సింది వ్యక్తులు కాదు చట్టపాలన.
చందమూరి నరసింహరెడ్డి
ఫ్రీలాన్స్ జర్నలిస్టు
కదిరి.


















