భారతదేశం నుంచి అమెరికాకు ఎగుమతి అయిన మామిడి పండ్లు పత్రాల్లో లోపాల కారణంగా తిరస్కరణకు గురయ్యాయి. సుమారు 15 కంటైనర్ల మామిడి పండ్లను అమెరికా అధికారులు వెనక్కి పంపారు. తప్పనిసరిగా చేయించాల్సిన ఇర్రేడియేషన్ ప్రక్రియకు సంబంధించిన డాక్యుమెంటేషన్లో పొరపాట్లు ఉన్నాయని వారు పేర్కొన్నారు. ఈ పరిణామంతో భారత ఎగుమతిదారులు సుమారు 5 లక్షల డాలర్లు (దాదాపు రూ.4.15 కోట్లు) నష్టపోయారని అంచనా. పండ్లను వెనక్కి రప్పించేందుకు అయ్యే ఖర్చు అధికంగా ఉండటంతో, వ్యాపారులు వాటిని అమెరికాలోనే ధ్వంసం చేయాల్సి వచ్చింది.
లాస్ ఏంజిల్స్, శాన్ ఫ్రాన్సిస్కో, అట్లాంటా వంటి పలు అమెరికా విమానాశ్రయాల్లో ఈ మామిడి పండ్ల షిప్మెంట్లను నిలిపివేశారు. మే 8, 9 తేదీల్లో ముంబైలో ఈ మామిడి పండ్లకు ఇర్రేడియేషన్ ప్రక్రియ పూర్తిచేశారు. అయితే, ఈ ప్రక్రియకు సంబంధించిన పత్రాల్లో (ముఖ్యంగా పీపీక్యూ203 ఫారంలో) తప్పులు దొర్లాయని అమెరికా అధికారులు గుర్తించినట్లు ఒక ఆంగ్ల పత్రిక నివేదించింది. పండ్లలో పురుగులు ఉన్నందువల్ల కాకుండా, కేవలం నిర్వాహణ లోపాల వల్లే ఈ సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది. ఇర్రేడియేషన్ అనేది పండ్లలోని కీటకాలను నిర్మూలించి, వాటి నిల్వ కాలాన్ని పెంచడానికి ఉపయోగించే ప్రక్రియ.
“పీపీక్యూ203 ఫారం సరిగ్గా జారీ చేయనందున” సరకును తిరస్కరించినట్లు అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ తమకు తెలిపిందని ఓ ఎగుమతిదారు వాపోయారు. “సరకును వెనక్కి పంపాలి లేదా ధ్వంసం చేయాలి. దీనికి అయ్యే ఖర్చును అమెరికా ప్రభుత్వం భరించదు” అని యూఎస్డీఏ స్పష్టం చేసినట్లు ఆయన తెలిపారు.
నవీ ముంబైలోని ఇర్రేడియేషన్ కేంద్రంలో అమెరికా వ్యవసాయ విభాగం (యూఎస్డీఏ) ప్రతినిధి పర్యవేక్షణలోనే ఈ ప్రక్రియ జరుగుతుంది. అమెరికాకు మామిడి పండ్ల ఎగుమతికి అవసరమైన పీపీక్యూ203 ఫారంను కూడా ఆయనే ధ్రువీకరించాలి. “ఇర్రేడియేషన్ కేంద్రంలో జరిగిన పొరపాట్లకు మేం నష్టపోవాల్సి వస్తోంది” అని ఒక ఎగుమతిదారు ఆవేదన వ్యక్తం చేశారు.
మే 9-11 తేదీల మధ్య లాస్ ఏంజిల్స్ విమానాశ్రయంలో తన సరకును నిలిపివేసి, ఆ తర్వాత ధ్వంసం చేయాలని ఆదేశాలు అందుకున్న మరో ఎగుమతిదారు మాట్లాడుతూ, “తప్పనిసరి ఇర్రేడియేషన్ చికిత్సకు సంబంధించిన నిబంధనలు పాటించలేదని మాకు తెలిపారు. ఇది పూర్తిగా అవాస్తవం. ఇర్రేడియేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాతే మాకు పీపీక్యూ203 ఫారం ఇచ్చారు. యూఎస్డీఏ అధికారి జారీ చేసిన ఆ ఫారం లేకుండా ముంబై విమానాశ్రయంలో మామిడి పండ్లను విమానంలోకి ఎక్కించడానికి కూడా అనుమతించరు కదా?” అని ఆయన ప్రశ్నించారు.
భారతదేశ మామిడి పండ్లకు అమెరికా ప్రధాన ఎగుమతి మార్కెట్ కావడంతో, ఈ ఘటన వాణిజ్య సంబంధాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ సమస్యపై, ప్రభావితమైన మామిడి పండ్ల పరిమాణం, పత్రాల్లోని లోపాల గురించి అడిగినప్పుడు, వ్యవసాయ, ప్రాసెస్ చేసిన ఆహార ఉత్పత్తుల ఎగుమతి అభివృద్ధి అథారిటీ (అపెడా) ఛైర్మన్ కార్యాలయం స్పందిస్తూ, “ఈ వ్యవహారం ముంబై వాషిలోని యూఎస్డీఏ ఆమోదిత మహారాష్ట్ర రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ బోర్డు (ఎంఎస్ఏఎంబీ) కేంద్రానికి సంబంధించినది. కాబట్టి దీనిపై వారినే వివరణ కోరాలి,” అని బదులిచ్చింది. వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ కింద అపెడా పనిచేస్తుంది. అయితే, ఈమెయిల్ ద్వారా వివరణ కోరినప్పటికీ ఎంఎస్ఏఎంబీ నుంచి ఎటువంటి సమాధానం రాలేదు.