సాంప్రదాయ పరంగా గురువు అంటే జ్ఞానాన్ని అందించే వ్యక్తి, మార్గదర్శకుడు. నేటి ఆధునిక కాలంలో ముఖ్యంగా సాంకేతిక విప్లవం తరువాత ఈ గురువు అనే భావన కొత్త రూపం తీసుకుంది. టెక్నాలజీ గురువులు లేదా డిజిటల్ గురువులు అంటే.. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని ప్రజలకు జ్ఞానాన్ని, నైపుణ్యాలను, మార్గదర్శకత్వాన్ని అందించే వ్యక్తులు అని అర్థం. వీరు ఆన్లైన్ (Online) వేదికల ద్వారా, సోషల్ మీడియా లేదా వీడియో కంటెంట్ లేదా పాడ్కాస్ట్లు లేదా బ్లాగులు వంటి వివిధ డిజిటల్ ఉపకరణాల ద్వారా తమ సందేశాలను, బోధనలను విస్తృత జనసమూహానికి చేరవేస్తున్నారు..
గురువారమే ‘గురు పూర్ణిమ’- ఇంతకంటే మంచిరోజు ఇంకొకటి ఉంటుందా- ఈ దానాలు చేస్తే అఖండ ఐశ్వర్యం ప్రాప్తి!
Guru Purnima 2025:హిందూ సంప్రదాయం ప్రకారం సాధారణంగా గురువును పూజించడానికి గురువారం విశేషమైనది. ఇక గురుపూర్ణిమ గురువారం కలిసివస్తే ఇక అంతకంటే విశేషమైన రోజు మరొకటి ఉండదు. ఎప్పుడో అరుదుగా వచ్చే ఈ విశేష కలయిక ఈనెల 10వ తేదీ రానుంది. ఈ సందర్భంగా అసలు గురువు అంటే ఎవరు? గురు పూర్ణిమను ఎలా జరుపుకోవాలి అనే ఆసక్తికరమైన విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
గురువంటే ఎవరు?
‘గురువు’ ఈ ఒక్క పదం మానవాళి మనుగడకు మూలాధారం. అజ్ఞానమనే చీకట్లను పారద్రోలి జ్ఞానమనే వెలుగు వైపుకి నడిపించేవాడే నిజమైన గురువు. పురాణాల నుంచి ప్రస్తుత కలం వరకు చుస్తే గురువు లేనిదే మనిషి జీవనం ఉండదు. అవతార పురుషులైనా రాముడు, కృష్ణుడు కూడా గురువు వద్ద విద్యను అభ్యసించినవారే. అందుకు గురువు స్థానం ఎప్పుడు గొప్పది.
వ్యాస పూర్ణిమ ప్రత్యేకం
అష్టాదశ పురాణాలూ రచించి మానవాళికి అందించిన వేదం వ్యాసుని జన్మదినం ఆషాఢ శుద్ధ పౌర్ణమి. ఆది గురువైన వేదవ్యాసుని జన్మ దినాన్ని మనం గురు పూర్ణిమగా జరుపుకుంటాం. గురు పూర్ణిమనే వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు. నాలుగు వేదాలలో, మహాభారతంలో కూడా ఈ వ్యాస పౌర్ణమి ప్రస్తావన ఉంది.
గురుపౌర్ణమి ఎప్పుడు
ఈ ఏడాది ఆషాఢ శుద్ధ పౌర్ణమి జులై 10 వ తేదీ గురువారం వచ్చిన సందర్భంగా ఇదే రోజున గురుపూర్ణిమ జరుపుకోవాలని పంచాంగకర్తలు సూచిస్తున్నారు. సాధారణంగా హిందూ సంప్రదాయం ప్రకారం గురుపూర్ణిమ రోజు విశేషంగా గంగానది స్నానాలు చేస్తుంటారు. ఉత్తర భారతంలో గురు పూర్ణిమ నుంచి శ్రావణమాసం ప్రారంభమవుతుంది. ఉత్తర భారత సంప్రదాయం ప్రకారం శ్రావణమాసం శివారాధనకు శ్రేష్టమైనది. ఈ నెల రోజులపాటు జరిగే కన్వర్ యాత్రతో గంగానదీతీరాలలో సందడి నెలకొంటుంది.
తస్మై శ్రీ గురవే నమః
‘గురు బ్రహ్మ, గురు విష్ణుః గురు దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః’
బాల్యంలో పలకా బలపం పుట్టినప్పటి నుంచి మనం ఈ శ్లోకాన్ని నేర్చుకుంటూ పెరిగాం. మన భారతీయ సంస్కృతి తల్లిదండ్రుల తర్వాత గురువుకే పెద్ద పీట వేసింది. మాతృదేవోభవ! పితృదేవో భవ! ఆచార్య దేవోభవ! అని అనడం వెనుక ఉన్న ఆంతర్యం ఇదే! గురువుకు అంత ప్రాధాన్యత ఉంది కాబట్టే అవతార పురుషులైన శ్రీరాముడు వశిష్టుని వద్ద, శ్రీకృష్ణుడు సాందీపుని వద్ద, పాండవులు ద్రోణాచార్యుని వద్ద విద్యనభ్యసించారు. ఆది గురువైన వ్యాసుని జన్మ దినాన్ని మనం గురు పూర్ణిమగా జరుపుకుంటాం.
ఎవరీ వ్యాసుడు
ద్వాపర యుగంలో పరాశరుడు సత్యవతికి జన్మించిన వాడే వ్యాసుడు. ‘వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే! నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః’ అని విష్ణు సహస్రనామాల్లో చదువుకుంటాం కదా! అంటే వ్యాసుడే విష్ణువు, విష్ణువే వ్యాసుడని అర్థం. అందుకే ఆయన జన్మదినం మనం ఒక పండుగలా వేడుకగా చేసుకుంటాం.
గురు పూర్ణిమ రోజున, ఉదయాన్నే స్నానం చేసి శుచియై పూజామందిరాన్ని శుభ్రం చేసుకోవాలి.పసుపు కుంకుమలతో అలంకరించిన పీటపై లక్ష్మీనారాయణులు విగ్రహాలను కానీ చిత్ర పటాలను కానీ ఉంచుకోవాలి.అనంతరం ఎవరినైతే మనం కుల గురువుగా భావించి పూజిస్తూ ఉంటామో ఆ విగ్రహాన్ని కూడా పీటపై ఉంచుకోవాలి.భక్తిశ్రద్దలతో లక్ష్మీనారాయణుల అష్టోత్తర శతనామాలు చదువుకోవాలి. తరువాత గురు పరంపరను, గురు శ్లోకాలను భక్తితో పఠించాలి.పసుపు రంగు గురువుకు సంకేతం కాబట్టి పూజలో వీలైనంత వరకు పసుపు రంగు పూలు, పండ్లు, ప్రసాదాలు సమర్పించాలి.ఈ రోజు శ్రీమన్నారాయణుని స్వరూపమైన శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని విశేషంగా ఆచరిస్తారు.సాయంత్రం సమీపంలోని గురువు ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకోవాలి.
గురుపౌర్ణమి రోజు అన్నదానం చేస్తే అఖండ ఐశ్వర్యం ప్రాప్తిస్తుందని శాస్త్ర వచనం. ఈ రోజు ‘వైష్ణవ పురాణం’ పుస్తకాన్ని దానం చేస్తే శాశ్వత విష్ణులోకం పొందుతారని సాక్షాత్తూ ఆ శ్రీ మహా విష్ణువే వరం ఇచ్చాడంట.
వ్యాసుడు సకలకళా వల్లభుడు
వేదవ్యాసుడు మహానుభావుడు. సకల కళానిధి, సకల శాస్త్రవేత్త, శస్త్ర చికిత్సవేది, మేధానిధి, వైద్యవరుడు, ఆత్మవిద్యానిధి, వైద్య విద్యానిధి అంతే కాదు అష్టాదశ పురాణాలను రచించి మానవాళికి అందించిన వ్యాసుని ఈ రోజు తప్పకుండా స్మరించుకోవాలి.
దేవాలయాల్లో పూజలు
ఈ రోజు గురుపౌర్ణమి సందర్భంగా దక్షిణామూర్తి, దత్తాత్రేయ స్వామి, శ్రీ సాయిబాబా వారి ఆలయాలలో ప్రత్యేక పూజలు జరుగుతాయి. మనం కూడా గురుపౌర్ణమి సందర్భంగా మన ప్రత్యక్ష గురువులకు , పరోక్ష గురువులకు నమస్కరించుకోవాలి.
చివరి మాట
గురువులకు స్వార్థం ఉండదు. శిష్యుల భవిష్యత్కు బంగారు బాటలు వేయడంలోనే గురువుకు సంతోషం ఉంటుంది. కానీ నేటి రోజుల్లో సామాజిక మాధ్యమాలలో, సినిమాలలో గురువులను కించపరిచే విధంగా చూపించడం సబబు కాదు. గురువు లేని జన్మ గుడ్డి జన్మ వంటిదని శాస్త్రం చెబుతోంది. అలాగే గురువులు కూడా సమాజం పట్ల బాధ్యతాయుతంగా ఉండాలి. శిష్యుల శ్రేయస్సే ముఖ్యంగా పని చేయాలి.
నిత్య గురు వందనం
జ్ఞానప్రదాత అయిన గురువును ఏదో సంవత్సరానికి ఒక్కసారి గురుపూర్ణిమ రోజున మొక్కుబడిగా పూజించి చేతులు దులిపేసుకోవడం కాదు! గురువులు చెప్పిన మార్గంలో నడవడం, ధర్మ బద్దమైన జీవితాన్ని గడుపుతూ మనకు మార్గదర్శిగా నిలిచిన గురువుకు మంచి పేరు వచ్చేలా నడుచుకోవడమే నిజమైన గురుపూజ అదే నిజమైన గురువందనం!
అందరికీ గురుపౌర్ణమి శుభాకాంక్షలు.