తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన గద్దర్ అవార్డుల వేడుక గత రాత్రి హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగిన విషయం తెలిసిందే. ఆ సందర్భంగా బ్లాక్ బస్టర్ హిట్ పుష్ప-2 మూవీకి గాను ఉత్తమ నటుడి అవార్డ్ అందుకున్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అవార్డును స్వీకరించారు. ప్రశంసా పత్రంతోపాటు నగదు పురస్కారం అందుకున్నారు.
ఈ నేపథ్యంలో గద్దర్ అవార్డుల వేడుక నిర్వహించిన తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు అల్లు అర్జున్. “గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, నిర్మాత దిల్ రాజుకు ధన్యవాదాలు. ఈ అవార్డు నాకు దక్కిందంటే కారణం మా డైరెక్టర్ సుకుమార్. ఆయన వల్లే ఇది సాధ్యమైంది” అంటూ బన్నీ మాట్లాడారు.
పుష్ప-2 నిర్మాతలు, ఆర్టిస్ట్ లు, టెక్నీషియన్లకు కూడా ధన్యవాదాలు తెలిపారు. పుష్ప 1ను అప్పుడు హిందీలో విడుదల చేయమని రాజమౌళి చెప్పకపోయి ఉంటే ఇంత క్రేజ్ ఉండేది కాదని అల్లు అర్జున్ చెప్పారు. అందుకే జక్కన్నకు ప్రత్యేక థ్యాంక్స్ చెప్పారు. మీకు థ్యాంక్స్ చెప్పడానికి ఇది మంచి అవకాశంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. పుష్ప 2 సినిమాకు తాను అందుకున్న తొలి అవార్డు ఇదేనని, తనకు ఎంతో ప్రత్యేకమని చెప్పారు. గద్దర్ అవార్డును అభిమానులకు అంకితం ఇస్తున్నట్లు వెల్లడించారు. మీ సపోర్ట్ ఎప్పుడూ ఇలాగే ఉండాలని, మిమ్మల్ని ఎప్పుడూ గర్వపడేలా చేస్తానని తెలిపారు. అవార్డుల వేడుక ప్రతి ఏడాదీ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు.
ఆ తర్వాత రేవంత్ రెడ్డి అనుమతి తీసుకుని పుష్ప-2లోని డైలాగ్ ను చెప్పారు. “ఆ బిడ్డ మీద ఒక్క గీటు పడ్డ గంగమ్మ జాతరలో యాట తల నరికినట్టు రఫ్ఫా రఫ్ఫా నరుకుతా ఒక్కొక్కడిని. పుష్ప, పుష్పరాజ్ అస్సలు తగ్గేదేలే” అంటూ మాస్ డైలాగ్ చెప్పి ఓ రేంజ్ లో సందడి చేశారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట ఇప్పుడు వైరల్ గా మారింది. కాగా, పుష్ప-2 మూవీతో అల్లు అర్జున్ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేశారో అందరికీ తెలిసిందే. సుకుమార్ దర్శకత్వం వహించిన ఆ సినిమా.. పాన్ ఇండియా లెవెల్ లో భారీ విజయం సాధించింది. కొత్త రికార్డులు క్రియేట్ చేసింది. మరిన్ని రికార్డులు బ్రేక్ చేసింది. ఇప్పుడు అల్లు అర్జున్.. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో వర్క్ చేస్తున్నారు. ఆ మూవీ కూడా అభిమానులు గర్వపడేలా ఉంటుందని ఇప్పటికే టాక్ వినిపిస్తోది.