ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖ రాజకీయంగా ప్రకంపనాలకు కారణమైంది. తన తండ్రి కేసీఆర్ కు కవిత రాసిన లేఖ బయటకు రావటం సంచలనంగా మారుతోంది. ఈ లేఖ తరువాత బీఆర్ఎస్ ను కాంగ్రెస్ టార్గెట్ చేసింది. ఇటు బీఆర్ఎస్ ముఖ్య నేతలు లేఖ పైన స్పందించ లేదు. కవిత ఇక షర్మిల బాటలోనే సొంత పార్టీ.. కాంగ్రెస్ వైపు వెళ్తారని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. ఇప్పుడు తాజాగా కవిత లేఖ వ్యవహారం పైన కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు.
ఫ్యామిలీ డ్రామా
కవిత లేఖ వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారుతోంది. ఈ లేఖ అంశం పైన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తన ట్విట్టర్ వేదికగా స్పందించారు. కాంగ్రెస్ వదిలిన బాణం అనే శీర్షికతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. డాడీకి రాసిన లేఖ ఒక ఓటీటీ ఫ్యామిలీ డ్రామాగా మారవచ్చని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు.. తెలం గాణను విఫలం చేశాయని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో వారంత కలిసి బీజేపీని నిందిస్తున్నారని చెప్పారు. కుటుంబ పాలనను తమ పార్టీ నిత్యం వ్యతిరేకిస్తునే ఉందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అది గాంధీ ఫ్యామిలీ అయినా.. కల్వకుంట్ల ఫ్యామిలీ అయినా అని కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు.
భావోద్వేగంగా
కుటుంబ పార్టీలు వారి వ్యక్తిగత సంక్షోభాలను ప్రజా భావోద్వేగంగా మార్చడానికి ప్రయత్నిస్తాయ ని వ్యాఖ్యానించారు. ప్రజలను బీజేపీ జైలుకు పంపదన్నారు. చట్టం మాత్రమే పంపుతుందని చెప్పారు. ఎవరైనా దోషి అయితే.. వారిని ఏదీ రక్షించ లేదన్నారు. కానీ ఈ అంశాన్ని తెలంగాణ చూస్తుందని.. ఆ క్రమంలో ఈ డ్రామాను తీవ్రంగా పరిగణించడం లేదని చెప్పుకొచ్చారు. అయితే ప్రతీ సర్వేలో భారతీయ జనతా పార్టీ గ్రాఫ్ పెరుగుతుందన్నారు. శబ్దం లేకుండా, అధికారం లేకుండా, కేవలం ప్రజల నమ్మకంతోనే తమ పార్టీ ప్రజల్లో అంతర్లీన ప్రవాహంగా వెళ్తుందని ఆయన పేర్కొన్నారు. ప్రజలు నిజమైన మార్పుతోపాటు అభివృద్ధిని సైతం కోరుకుంటున్నారని తెలిపారు. రాజకీయం.. కుటుంబ డ్రామా కాదన్నారు. ఆ మార్పు బీజేపీతోనే అవుతుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు.