బిజెపి రాష్ట్ర చీప్ గా బాధ్యతలు చేపట్టిన పివిఎన్ మాధవ్ స్థానికంగా పట్టు పెంచుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. వినూత్న కార్యక్రమం చేపట్టి ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం కనిపిస్తోంది. ఈ క్రమంలోనే మాధవ్ `చాయ్ పే చర్చ` కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం గ్రామీణ స్థాయిలో ముఖ్యంగా గిరిజనులు ఎస్సీ సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో మాధవ్ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం విశేషం. అయితే దీనివల్ల పార్టీ ఓటు బ్యాంకు ఎంతవరకు పెరుగుతుంది.. అనేది చూడాలి.
అదేసమయంలో పార్టీకి సానుకూలత ఏ మేరకు వస్తుంది అన్నది కూడా చర్చకు వచ్చింది. అయితే.. ప్రధానంగా తనను తాను పరిచయం చేసుకునే దిశగా మాధవ అడుగులు వేస్తున్నారు. వచ్చే స్థానిక ఎన్నికలకి.. పార్టీని బలోపేతం చేయటం లేదా వచ్చే ఎన్నికల నాటికి పార్టీని సొంత కాళ్లపై నిలబడే లాగా చేయాలన్నది మాధవ్ వ్యూహంగా ఉంది. ఈ క్రమంలోని `చాయ్ పై చర్చ` వంటి కీలక కార్యక్రమాన్ని ఆయన భుజాన వేసుకున్నారు. ప్రస్తుతం జిల్లాలు పర్యటన ముగిసిన నేపథ్యంలో ఇప్పుడు గ్రామీణ స్థాయిలో పర్యటనలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు.
ప్రస్తుతం గుంటూరు జిల్లాలోని గ్రామాల్లో మాధవ్ పర్యటన కొనసాగుతోంది. గతంలో పార్టీ చీఫ్గా చేసిన వారిలో ఎవరు ఈ తరహాలో చేపట్టని కార్యక్రమం కావడంతో కొంత వినూత్నంగా ఉందన్న టాక్ అయితే వినిపిస్తోంది. బిజెపి వ్యవహారాలను ఆయన స్థానికులతో కలిసి పంచుకుంటున్నారు. దీంతో బిజెపి గ్రాఫ్ పెరిగే అవకాశం అలాగే సభ్యత్వాలు కూడా పెరిగే అవకాశం ఉందన్న అంచనా ఏర్పడుతోంది మరీ ముఖ్యంగా మాధవ్ అందరికీ పరిచయం అయ్యే దిశగా అడుగులు వేస్తుండడం గమనార్హం.
వినూత్న కార్యక్రమాలతో అయితే మాధవ్ ముందుకు సాగుతున్నారు. అయితే.. కూటమి ప్రభుత్వం చేస్తున్న పథకాలను కూడా ఆయన ప్రచారం చేస్తే బెటర్ అన్న వాదన వినిపిస్తోంది. కేవలం కేంద్ర ప్రాయోజిత పథకాలను మాత్రమే ఆయన ప్రస్తావిస్తున్నారు తప్ప.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న పనులను అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను మాత్రం ప్రస్తావించడం లేదు. ఈ విషయంలో కూడా మాధవ్ ఒకింత చొరవ చూపిస్తే.. బెటర్ అనే చర్చ సాగుతోంది. అలా కాకుండా.. కేవలం ఒక్క కేంద్రం గురించే చెబితే.. అది ఏ మేరకు పార్టీకి మేలు చేస్తుంది అనేది చూడాలి.