‘మహారాజా’ మూవీతో సంచలనం సృష్టించిన తమిళ హీరో మక్కల్ సెల్వన్ విజయ్సేతుపతితో టాలీవుడ్ వెర్సటైల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఓ క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ని ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. లైగర్, డబుల్ ఇస్మార్ట్ సినిమాలు వరుసగా ఫ్లాప్ కావడంతో ఆలోచనలో పడిన క్రేజీ రైటర్ కమ్ డైరెక్టర్ పూరి సరికొత్త కథతో ఓ భారీ సినిమాకు శ్రీకారం చుట్టాడు. ఇందులో హీరో ఎవరు అనే చర్చ జరుగుతుండగానే తమిళ విలక్షణ నటుడు విజయ్సేతుపతి హీరో అంటూ ప్రకటించి షాక్ ఇచ్చాడు.
ఓ బిచ్చగాడి కథ నేపథ్యంలో ఈ సినిమాని పూరి జగన్నాథ్ అత్యంత భారీ స్థాయిలో పాన్ ఇండియా మూవీగా తెరపైకి తీసుకురాబోతున్నారు. పూరి చెప్పిన స్టోరీలైన్ నచ్చడంతో హీరో విజయ్ సేతుపతి ఈ ప్రాజెక్ట్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. విలక్షణమైన కథతో రూపొందనున్న ఈ మూవీలో టబు కీలక పాత్రలో కనిపించబోతోంది. మరో ప్రధాన పాత్రలో కన్నడ నటుడు దునియా విజయ్ కనిపించనున్నారు. ఇప్పటికే వీరిద్దరికి సంబంధించి అధికారికంగా టీమ్ ప్రకటించడం తెలిసిందే.
అయితే ఈ మూవీలో మరో సర్ప్రైజ్ ఉందని తాజాగా వార్తలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా మంచి గుర్తింపు పొందిన యూట్యూబర్, డిజిటల్ కంటెంట్ క్రియేటర్ నిహారిక కూడా ఓ కీలక క్యారెక్టర్లో నటించనుందని తెలిసింది. ఇప్పటికే తను పూరీ – విజయ్ సేతుపతిల ప్రాజెక్ట్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని, త్వరలోనే ఈ విషయాన్ని పూరి టీమ్ అధికారికంగా ప్రకటించనుందని ఇన్ సైడ్ టాక్. క్రేజీ కాంబినేషన్లో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జూన్ నుంచి ప్రారంభం కాబోతోంది