ఓవైపు విభజన గాయాలు.. మరోవైపు ప్రభుత్వాలు ఒక టర్మ్ తర్వాత ఒక్కో పార్టీ అధికారంలోకి రావటం.. విధానాల పరంగా తీసుకుంటున్న నిర్ణయాలు.. పాలనాపరమైన ప్రాధాన్యతల్లో వచ్చే మార్పులు ఏపీ ఆర్థిక పరిస్థితిని మారేందుకు సాయం చేయటం లేదు. గత ఏడాది ఎన్నికల్లో అద్భుత విజయాన్ని సాధించి.. పాలనా పగ్గాల్ని చేపట్టిన కూటమి ప్రభుత్వం తన సంవత్సర పాలనలో చేసిన అప్పు ఎంత? దేని కోసం ఎంత అప్పు చేసింది? అన్నదిప్పుడు చర్చగా మారింది.
కూటమి ప్రభుత్వం కొలువు తీరి నిన్న (మంగళవారం)టి ఏడాది పూర్తైంది. ఆసక్తికరమైన అంశం ఏమంటే.. ప్రభుత్వం కొలువు తీరిన తేదీన.. రూ.7వేల కోట్ల తాజా అప్పు తీసుకోవటం చూసినప్పుడు ఏపీ ఆర్థిక పరిస్థితి ఎప్పుడు మెరుగవుతుంది? అన్నది పెద్ద ప్రశ్న. తాజాగా చేసిన అప్పుతో బడ్జెట్ అప్పులే ఏకంగా రూ.1,01,194 కోట్లకు చేరాయి. ఆర్ బీఐ.. రాష్ట్ర ప్రభుత్వ సెక్యురిటీల వేలం ద్వారా 6.61 శాతం నుంచి 6.84 శాతం వడ్డీకి ఈ మొత్తం అప్పును సమీకరించింది.బడ్జెట్ లోపలే కాకుండా బడ్జెట్ బయటా అప్పులు చేయటం కనిపిస్తుంది.
వివిధ కార్పొరేషన్ల పేరుతో ప్రభుత్వ గ్యారెంటీతో రూ.19,410 కోట్ల అప్పు ఏడాదిలో చేశారు. ఇంకోవైపు రాజధాని అమరావతి పేరుతో ప్రపంచ బ్యాంక్.. జర్మీనిక చెందిన సంస్థ నుంచి రూ.31 వేల కోట్లు చేయనుంది. ఇవన్నీ కలిపితే ఏడాదిలో రూ.1.51 లక్షల కోట్లు అప్పు చేసినట్లు అవుతుంది. ఇక్కడ గుర్తించాల్సిన అంశం ఏమంటే.. రాజధాని నిర్మాణం కోసం చేస్తున్న రూ.31 వేల కోట్లను లెక్కలోకి తీసుకోకూడదు. ఎందుకంటే.. ఈ అప్పు పైసలు చేతికి రాలేదన్న విషయాన్ని మర్చిపోకూడదు. మొత్తంగా చూస్తే.. చంద్రబాబు సర్కారు ఏడాది పాలనలో బడ్జెట్ అప్పు రూ.1,01,194 కోట్లు కాగా.. బడ్జెటేతర అప్పు రూ.19,410 కోట్లను మాత్రమే రుణాలుగా తీసుకోవాలి. ఏమైనా తన ప్రభుత్వ హయాంలో అయినా.. అప్పులు తీసుకునే అలవాటును కూటమి సర్కారు తగ్గిస్తే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.