తెలుగు న్యూస్ యాంకర్ స్వేచ్ఛ వోటార్కర్ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. స్వేచ్ఛ ఆత్మహత్యకు పూర్ణ చంద్రరావు అనే వ్యక్తి కారణమంటూ ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కుమార్తె మృతిపై అనుమానాలు వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.
స్వేచ్ఛ వోటార్కర్ పలు టీవీ ఛానల్స్ లో న్యూస్ ప్రజెంటర్ గా పనిచేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రజా సమస్యలపై పలు పత్రికల్లో కాలమ్స్ కూడా రాసేవారు. అలా డిజిటల్ కంటెంట్ రైటర్ గానూ ఆమె పనిచేశారు. అయితే బయట ప్రపంచానికి కనపడినంత బలంగా తన మనసులో మాత్రం ఉండలేకపోయారు. తన వ్యక్తిగత కారణాలతో మానసికంగా కుంగిపోయారని తెలుస్తోంది.
ఐదేళ్ల క్రితం భర్తతో విడాకులు తీసుకున్న స్వేచ్చ పూర్ణ చంద్రరావు అనే వ్యక్తితో కలిసి ఉంటోంది. ఈ క్రమంలోనే తనను పెళ్లి చేసుకోవాలని కోరగా పూర్ణచంద్రరావు పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. పూర్ణచందర్ తో కలిసి ఉండలేకపోతున్నా నంటూ తమకు చెప్పి ఆవేదన పడిందని ఆమె తల్లిదండ్రులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం రాత్రి 10.30 గంటల సమయంలో ఆమె తన ఇంట్లో ఫ్యాన్ కు లుంగీతో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నట్లు అనుమానిస్తున్నారు.
స్వేచ్ఛ తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న చిక్కపడల్లి పోలీసులు పరారీలో ఉన్న పూర్ణచందర్ కోసం గాలిస్తున్నారు. ఇటీవల జరిగిన జర్నలిస్టు హౌసింగ్ సొసైటీ ఎన్నికల్లో స్వేచ్ఛ ఈసీ మెంబర్ గా కూడా ఎన్నికయ్యారు. కాగా ఆమె మృతి పట్ల జర్నలిస్టులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు ఆమె మృతిపై తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత సంతాపం తెలియజేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.