అహ్మదాబాద్లో ఇటీవల చోటుచేసుకున్న ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం దేశాన్ని కుదిపేసింది. బోయింగ్ 787-8 డ్రీంలైనర్ విమానం జూన్ 12న మధ్యాహ్నం 1:39 గంటల సమయంలో సర్దార్ వల్లభభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే ఓ మెడికల్ కాలేజ్ భవనంపై కుప్పకూలింది.. ఈ ప్రమాదంలో 270 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో విమానంలోని 241 మంది ప్రయాణికులతో పాటు.. హాస్టల్ లో ఉన్న 29 మంది చనిపోయారు.
ప్రమాద తీవ్రత ఎంతగా ఉందంటే… మృతదేహాలు పూర్తిగా కాలిపోయి గుర్తు పట్టలేని స్థితిలో మారిపోయాయి. దాంతో అధికారులు DNA పరీక్షల ద్వారానే గుర్తింపు ప్రక్రియ చేపట్టారు. ఇప్పటివరకు 184 మృతదేహాల DNA నమూనాలు మ్యాచ్ అయ్యాయని, అందులో 163 మృతదేహాలను బాధిత కుటుంబాలకు అప్పగించినట్లు అహ్మదాబాద్ సివిల్ హాస్పటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాకేష్ జోషి తెలిపారు. మిగతా మృతదేహాల గుర్తింపు ప్రక్రియ కూడా తక్కువ సమయంలో పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు.
మరోవైపు ఈ ప్రమాదానికి గల కారణాలను గుర్తించేందుకు విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే సంఘటన స్థలంలో నుంచి కాక్పిట్ వాయిస్ రికార్డర్ (CVR)ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇది ప్రమాద సమయంలో పైలట్ల మధ్య జరిగిన సంభాషణలను నమోదు చేసి ఉండటం వల్ల, ప్రమాదానికి దారి తీసిన సాంకేతిక లోపం, మానవ తప్పిదం వంటి అంశాలను స్పష్టంగా వెల్లడించే అవకాశం ఉంది.
ఇదిలా ఉండగా, DNA పరీక్షల ప్రక్రియ బుధవారం ఉదయం నాటికి పూర్తయ్యే అవకాశం ఉందని వైద్యాధికారులు అభిప్రాయపడ్డారు. బాధితుల కుటుంబాలకు తక్షణ న్యాయం చేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని అధికారులు హామీ ఇచ్చారు. ఈ విషాద ఘటన బాధిత కుటుంబాల్లో మానని గాయంలా మిగిలింది.. అయితే వారి శవాలను గుర్తించేందుకు వైద్యులు శ్రమిస్తున్నారు.