అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా ప్యాసింజర్ విమానం కూలిన ప్రాంతం నుంచి ఇప్పటివరకు 204 మృతదేహాలు వెలికితీసినట్లు అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్ జీఎస్ మాలిక్ బీబీసీ గుజరాతీతో చెప్పారు.”అక్కడ బతికి ఉన్నవారు ఉండవచ్చు. ఇప్పటివరకైతే 204 మృతదేహాలను వెలికితీశారు. రక్షణ, సహాయ చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. గాయపడిన 41 మందికి చికిత్స అందిస్తున్నారు” అని ఆయన అన్నారు
అహ్మదాబాద్ నుంచి లండన్ గాత్విక్ విమానాశ్రయానికి వెళుతున్న ఎయిర్ ఇండియా విమానం ఏఐ 171, టేకాఫ్ అయిన కొద్దిసేపటికే మధ్యాహ్నం 1:38 గంటలకు నివాస సముదాయాలు ఉన్న మేఘని నగర్ ప్రాంతంలో కూలిపోయింది.విమానంలో మొత్తం 242 మంది ఉన్నారు. వీరిలో విమాన సహాయ సిబ్బంది 10మంది కాగా, పైలట్లు ఇద్దరు.ప్రమాద ప్రాంతం నుంచి వచ్చిన వీడియోలలో భారీ ఎత్తున మంటలు, పొగ కనిపించాయి.ఎయిర్ ట్రాఫిక్ను పర్యవేక్షించే ఫ్లైట్ రాడార్ 24 కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో ఈ ప్రమాదం గురించి పేర్కొంది.
“అహ్మదాబాద్ నుండి లండన్కు వెళ్లే ఎయిర్ ఇండియా విమానం ఏఐ 171 విమానం కూలిపోయినట్లు సమాచారం అందింది. టేకాఫ్ అయిన కొన్ని సెకన్ల తర్వాత మాకు చివరి సిగ్నల్ అందింది” అని ఆ సంస్థ రాసింది.ప్రమాద ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పందించారు.అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదం గురించి తెలుసుకుని తీవ్రంగా కలత చెందినట్లు ఎక్స్లో రాష్ట్రపతి పోస్టు చేశారు. ఈ బాధాకర సమయంలో దేశమంతా బాధితుల వెంట ఉందని అన్నారు.అహ్మదాబాద్లో చోటుచేసుకున్న ఈ విషాదం దిగ్భ్రాంతికి గురిచేసిందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.
”ఇది మాటల్లో చెప్పలేని హృదయ విదారక ఘటన. ఈ విషాద సమయంలో ఈ ఘటనతో ప్రభావితమైన ప్రతి ఒక్కరికీ నా సానుభూతి. సహాయక చర్యలపై మంత్రులు, అధికారులతో నిరంతరం సంప్రదిస్తున్నా” అని ప్రధాని ఎక్స్లో పోస్టుచేశారు.గుజరాత్ ముఖ్యమంత్రి, హోంమంత్రి, పోలీసు కమిషనర్లతో మాట్లాడానని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పినట్లు ఏఎన్ఐ వార్తాసంస్థ వెల్లడించింది.ఏఎన్ఐ ప్రకారం.. ఈ ప్రమాద ఘటన సహాయ కార్యక్రమాల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు.విమాన ప్రమాద ఘటనపై పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు ఎక్స్లో స్పందించారు. అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదం గురించి తెలిసి షాక్ అయ్యానని ఆయన చెప్పారు.
”మేం అత్యంత అప్రమత్తంగా ఉన్నాం. నేను స్వయంగా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాను. విమానయానానికి సంబంధించిన అన్ని ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్లను వేగంతో, సమన్వయంతో చర్యలు ప్రారంభించాలని ఆదేశించాను” అని మంత్రి ఆ పోస్టులో తెలిపారు.అహ్మదాబాద్ విమాన ప్రమాదాన్ని ఎయిర్ ఇండియా ధ్రువీకరించింది. ఈ మేరకు ఎక్స్లో ఒక పోస్టు చేసింది.”అహ్మదాబాద్-లండన్ గాత్విక్కు నడుపుతున్న ఏఐ171 విమానం 2025 జూన్ 12న ఒక ఘటనలో చిక్కుకుంది. మేం దీనిని నిర్ధరిస్తున్నాం” అని ఎయిర్ ఇండియా ఆ ప్రకటనలో తెలిపింది.