ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతిపై ఫుల్ ఫోకస్ పెట్టింది.. తాజాగా అమరావతిలో స్పోర్ట్స్ సిటీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్టీఆర్ జిల్లాలోని కృష్ణా నదికి దగ్గరగా ఉన్న నాలుగు గ్రామాలను రాజధాని పరిధిలోకి తీసుకురానున్నారు. త్రిలోచనాపురం, మూలపాడు, కోటికలపూడి, జమీమాచవరం గ్రామాలను ఎంపిక చేశారు. ఈ గ్రామాల్లో భూములను సేకరించేందుకు గ్రామసభలు నిర్వహించారు.. రైతులు భూములు ఇవ్వడానికి అంగీకరించారు. స్పోర్ట్స్ సిటీ కోసం ఈ నాలుగు గ్రామాలను ఎంచుకున్నారు. ఇటీవల కృష్ణా నదిలో ఉన్న చినలంక, పెదలంక దీవులను పరిశీలించారు.. కానీ అవి వరదలకు మునిగిపోయే అవకాశం ఉంది.. అందుకే వాటిని వద్దనుకున్నారు. వాటికి దగ్గరలో ఉన్న ఈ నాలుగు గ్రామాలను ఎంపిక చేశారు.
మూలపాడులో ఇప్పటికే రెండు క్రికెట్ స్టేడియాలు ఉన్నాయి.. ఈ ప్రాంతం స్పోర్ట్స్ సిటీకి అనువుగా ఉంటుందని భావిస్తున్నారు. మూలపాడు నుంచే అమరావతికి గ్రాండ్ ఎంట్రెన్స్ వే ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తున్నారు. కృష్ణా నది మీదుగా ఐకానిక్ బ్రిడ్జి నిర్మించాలని కూడా ప్రతిపాదనలు ఉన్నాయి. అందుకే ఈ నాలుగు గ్రామాలను ఎంచుకున్నట్లు సమాచారం. మూలపాడులోనే అంతర్జాతీయ క్రీడా యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని ఆలోచన ఉంది. గురువారం జరిగిన గ్రామసభల్లో రైతులు భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. త్వరలోనే స్పోర్ట్స్ సిటీ నిర్మాణం దిశగా అడుగులు పడనున్నాయి. ఈ స్పోర్ట్స్ సిటీతో పాటుగా అక్కడే దేశంలోనే అతిపెద్ద ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంను నిర్మించాలని కూడా ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అక్కడ 2వేల ఎకరాల వరకు సేకరించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం నిర్మాణంపై అధ్యయనం కోసం ఇటీవల మంత్రి నారాయణ ఆధ్వర్యంలో ఓ టీమ్ గుజరాత్లోని అహ్మదబాద్ క్రికెట్ స్టేడియాన్ని కూడా పరిశీలించారు.
మరోవైపు పల్నాడు జిల్లాలో రాజధాని అమరావతి అవసరాల కోసం ప్రభుత్వం రెండో విడత భూసేకరణ చేపట్టింది. పెదకూరపాడు నియోజకవర్గంలోని అమరావతి మండలంలో రైతులు భూములు ఇవ్వడానికి అంగీకరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై నమ్మకం ఉందని రైతులు గ్రామసభలో చెప్పారు. మొత్తం 9,617.58 ఎకరాల భూమిని సేకరించడానికి ప్రభుత్వం రైతుల అభిప్రాయాలను తెలుసుకుంటోంది. ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ఆధ్వర్యంలో గ్రామసభలు జరిగాయి. .రైతులు రాజధాని అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు.
ఏపీ ప్రభుత్వం అమరావతి మండలంలోని వైకుంఠపురం, పెదమద్దూరు, యండ్రాయి గ్రామాల్లో సభలు నిర్వహించింది. కర్లపూడి, లేమల్లె గ్రామాల్లో బుధవారం గ్రామసభలు జరిగాయి. ఈ సభల్లో రైతులు తమ అభిప్రాయాలను తెలియజేశారు. ముఖ్యమంత్రి రైతులకు మేలు చేసే నిర్ణయాలు తీసుకోవాలని సూచించారని ఎమ్మెల్యే ప్రవీణ్ అన్నారు. రైతుల కోసం ప్రభుత్వం అనేక పథకాలు తీసుకువస్తుందని ఆయన చెప్పారు. రాజధానిలో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాల గురించి రైతులు అడిగారు. ఇప్పుడు సేకరించే 10 వేల ఎకరాల్లో ఎలాంటి అభివృద్ధి చేస్తారో చెప్పాలని కోరారు. ఐటీ కంపెనీలు విశాఖకు, పరిశ్రమలు శ్రీసిటీకి కేటాయిస్తున్నారని ముఖ్యమంత్రి చెబుతున్నారని రైతులు అన్నారు. అమరావతిలో ఏ కంపెనీలు తీసుకొచ్చి స్థానిక యువతకు ఉపాధి కల్పిస్తారో ప్రకటించాలన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది అవుతున్నా అమరావతి రాజధాని అని గెజిట్ నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వలేదని రైతులు ప్రశ్నించారు.
భూములు తీసుకుంటే, తమకు ఇచ్చే ప్లాట్లు రైల్వే స్టేషన్, ఇన్నర్ రింగ్ రోడ్డుకు తూర్పు వైపున ఇవ్వాలని రైతులు కోరారు. ప్రస్తుతం ఎకరాకు రూ.60 వేల చొప్పున కౌలు ఇవ్వాలని, ఏటా పది శాతం పెంచాలని కోరారు. తమ గ్రామాల్లో భూములు తీసుకోవాల్సి వస్తే, మాకు ఇచ్చే ప్లాట్లు రైల్వేస్టేషన్, ఇన్నర్ రింగ్ రోడ్డుకు తూర్పు వైపున ఇవ్వాలి అన్నారు రైతులు. ఖరీఫ్ సీజన్ కోసం భూములు సిద్ధం చేసే జూన్ నాటికే రైతులకు కౌలు ఇవ్వాలని రైతులు కోరారు. రైతులకు ఇచ్చే ప్లాట్లు తనఖా పెట్టుకుని పిల్లల చదువు కోసం బ్యాంకులో రుణం తీసుకునే అవకాశం కల్పించాలని కోరారు. ప్రభుత్వ, ఆలయ భూముల్లో కాకుండా రిజిస్ట్రేషన్ చేసిన భూముల్లోనే ప్లాట్లు ఇవ్వాలని కోరారు. రైల్వే ప్రాజెక్టుకు ఎక్కువ భూమి తమ నుంచే తీసుకుంటున్నందున, తమ పిల్లలకు రైల్వేలో ఉద్యోగాలు ఇవ్వాలని రైతులు కోరారు. రైతుల విజ్ఞప్తులపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.