టాలీవుడ్ బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన కియరా అద్వాణీ బాలీవుడ్ కథానాయకుడు సిద్ధార్థ్ మల్హోత్రాని ప్రేమించి పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది మార్చిలో ఈ జంట తమ తొలి బిడ్డను ఆశిస్తున్నట్టు ప్రకటించింది. కియరా బేబి బంప్ ఫోటోలు ఇంటర్నెట్ లో లీకయ్యాయి. ఇదిలా ఉంటే, ఇప్పుడు కియరా ఒక అరుదైన కానుక అందుకుంది. అది కూడా మెగా పవర్స్టార్ రామ్ చరణ్- ఉపాసన జంట పంపిన రేర్ గిఫ్ట్. ఇంతకీ ఉపాసన చరణ్ తన ఫ్రెండు కియరాకు ఎలాంటి కానుక పంపారు? అంటే….
అది నోరూరించే ఊరగాయ పచ్చడి. పచ్చి మామిడితో చేసినది. లైవ్ లీగా తినేందుకు, పులుపును ఆస్వాధించేందుకు గర్భిణి కియరా కోసం పంపారు. ఈ అరుదైన గిఫ్ట్ అందుకోగానే కియరా ఉబ్బితబ్బిబ్బయింది. తనకు కానుక పంపిన చరణ్- ఉపాసన జంటకు ధన్యవాదాలు చెప్పింది. థాంక్యూ ప్రియతమలూ…! అని ఆనందం వ్యక్తం చేసింది. ఉపాసన తన అత్తగారు సురేఖ కొణిదెలతో కలిసి `అత్తమ్మాస్ కిచెన్` వంటశాలను విజయవంతంగా నడిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు కియరాకు పంపిన ఊరగాయ ఈ కిచెన్లో తయారు చేసినదే. కియరాకు పంపిన ప్యాకేజీతో పాటు ఉపాసన దానిలో తన ప్రేమను కురిపిస్తూ ఒక లేఖను కూడా రాసారు. “ప్రియమైన కియారా, నా అత్తమ్మ (అత్తగారు) నుండి ప్రేమతో… మా మామిడికాయ ఊరగాయ ప్రత్యేక రుచిని ఆస్వాధించండి“ అని రాసింది. ఎంతో ప్రేమతో తయారు చేసి పంపిన ఈ మామిడి ఊరగాయను తనివి తీరా ఆస్వాధించండి! అని కియరాను ఉపాసన కోరారు. కియరా అద్వాణీ- రామ్ చరణ్ జంట రెండు సినిమాల్లో కలిసి నటించారు. వినయ విధేయ రామా, గేమ్ ఛేంజర్ చిత్రాల్లో జంటగా నటించారు. చరణ్ ప్రస్తుతం పెద్ది చిత్రీకరణలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.