తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎదురుచూస్తున్న క్యాబినెట్ విస్తరణకు రంగం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త మంత్రుల జాబితాను ఖరారు చేసేందుకు ఢిల్లీ వెళ్లారు. అక్కడ ఆయన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్ గాంధీతో కీలక చర్చలు జరపనున్నారు. ఈ విస్తరణ ద్వారా పాలనా వ్యవహారాల్లో మరింత సమర్థతను తీసుకురావాలని, అలాగే పార్టీలో సమతూకాన్ని సాధించాలని అధిష్ఠానం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
కొత్త మంత్రుల ఎంపికలో అనేక అంశాలను పరిగణనలోకి తీసుకోనున్నారు. సామాజిక సమీకరణాలు, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, ఉమ్మడి జిల్లాల వారీగా ప్రాతినిధ్యం వంటి అంశాలు ప్రాధాన్యతను సంతరించుకోనున్నాయి. అన్ని వర్గాలకు న్యాయం జరిగేలా, అలాగే ప్రాంతీయ సమతుల్యతను పాటించేలా జాబితాను రూపొందించే అవకాశం ఉంది.
పార్టీ పెద్దలతో సీఎం రేవంత్ సమావేశం అనంతరం.. ఏ క్షణమైనా కొత్త మంత్రులను ఖరారు చేసే అవకాశం ఉంది. ఈసారి తెలంగాణ క్యాబినెట్లో రెడ్డి సామాజిక వర్గం నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అలాగే ఎస్సీ మాల సామాజిక వర్గం నుంచి వివేక్ పేర్లు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. వీరిద్దరిని ఎన్నికల సమయంలోనే పార్టీ అధికారంలోకి వస్తే మంత్రి పదవి గ్యారంటీ అనే హామీతో కాంగ్రెస్లో చేర్చుకున్నారు. ఈ నేపథ్యంలో, వారికి పదవులు దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డితో కలిపి మొత్తం 12 మంది మంత్రులు ఉన్నారు. క్యాబినెట్లో గరిష్టంగా 18 మందికి అవకాశం ఉంది. దీంతో మరో 6 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. ఈ విస్తరణలో ఆరు ఖాళీలను పూర్తిగా భర్తీ చేస్తారా, లేదా మరికొన్నింటిని భవిష్యత్తు కోసం ఉంచుతారా అనేది వేచి చూడాలి.