ఉత్తరప్రదేశ్లోని గాజీపూర్ జిల్లా నుంచి మేఘాలయలోని తూర్పు ఖాసీ హిల్స్ దాదాపు వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఉంది.ఇందౌర్కు చెందిన రాజా రఘువంశీ మృతదేహాన్ని జూన్ 2న తూర్పు ఖాసీ హిల్స్లో కనుగొన్నారు. ఆయన భార్య సోనమ్ ఆచూకీని గాజీపూర్లో కనుగొన్నారు. అయితే, ఈ కేసులో మేఘాలయ, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ పోలీసులు చేసిన ప్రకటనలు విరుద్ధంగా ఉన్నాయి.ఇందౌర్ నవ దంపతులు రాజా, సోనమ్ హనీమూన్ కోసం మేఘాలయకు వెళ్లారు. ఆ తర్వాత వారి అదృశ్యం వార్త బయటకు వచ్చింది. తొలుత సోనమ్ను యూపీ పోలీసుల కస్టడీలోకి తీసుకున్నారు.ఆమె రఘువంశీ ‘హత్యలో పాలుపంచుకుందని’ మేఘాలయ పోలీసులు ఆరోపిస్తున్నారు.
కానీ, సోనమ్ కుటుంబం ఆమె ‘నిర్దోషి’ అంటోంది.అయితే, ఈ కేసులో కొన్ని ప్రశ్నలకు ఇంకా సమాధానాలు దొరకాల్సి ఉంది.ఉదాహరణకు, సోనమ్ మేఘాలయ నుంచి వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న గాజీపూర్కు ఎలా వెళ్లారు? ఆమెను పోలీసులు ఎలా చేరుకున్నారు?మేఘాలయ పోలీసులు సోనమ్ను గాజీపూర్ జిల్లా కోర్టులో అర్థరాత్రి హాజరుపరిచి, ఆమెను ట్రాన్సిట్ రిమాండ్పై షిల్లాంగ్కు తీసుకెళ్లారు.రాజా రఘువంశీ, సోనమ్ మే 11న వివాహం చేసుకున్నారు. మే 20న హనీమూన్ కోసం మేఘాలయకు వెళ్లారు. మే 23 నుంచి ఇద్దరూ కనిపించలేదు. రాజాను జూన్ 2న అక్కడి తూర్పు ఖాసీ హిల్స్లోని వీసాడోంగ్ జలపాతం సమీపంలో 150 అడుగుల లోతైన లోయలో కనుగొన్నారు.
అయితే, ఈ హత్యలో సోనమ్ పాత్ర ఉందా?
ఈ ప్రశ్నకు తూర్పు ఖాసీ హిల్స్ ఎస్పీ వివేక్ సైమ్ సమాధానమిస్తూ “అవును, అలానే అనిపిస్తోంది. మేఘాలయ పోలీసు బృందాలు మధ్యప్రదేశ్లో ఉన్నాయి. సోనమ్ను అరెస్టు చేయడానికి ఒక బృందం ఉత్తరప్రదేశ్కు వెళ్లింది” అన్నారు.ఈ కేసులో మరో ముగ్గురిని అరెస్టు చేయడంతో సోనమ్ ‘లొంగిపోయారని’, ఇక్కడే అంతా అర్థమవుతోందని మేఘాలయ పోలీసులు చెబుతున్నారు.మేఘాలయ పోలీసులు రాజా మృతదేహం దగ్గర ఎరుపు, నలుపు రంగు రెయిన్కోట్ను కనుగొన్నారు. ఈ రెయిన్కోట్, హోటల్ వెలుపల సీసీటీవీ ఫుటేజ్ తప్ప సోనమ్ గురించి మరే సమాచారం అందుబాటులో లేదు.సోనమ్ తండ్రి దేవి సింగ్ మాట్లాడుతూ “జూన్ 8వ తేదీ రాత్రి, సోనమ్ సోదరుడు గోవింద్ సింగ్కు ఉత్తరప్రదేశ్ నుంచి కాల్ వచ్చింది. గాజీపూర్లోని ఒక దాబా నుంచి సోనమ్ కాల్ చేసింది. అనంతరం, మేం పోలీసులకు సమాచారం అందించాం. పోలీసులు దాబా వద్దకు వెళ్లారు. అప్పుడు సమయం రెండు గంటలవుతోంది, నా కూతురు గోవింద్తో మాత్రమే మాట్లాడింది” అన్నారు.
కాశీ దాబా గాజీపూర్లోని నందగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జాతీయ రహదారిపై ఉంది. గాజీపూర్ పోలీసుల ప్రకారం, వారు సోనమ్ను అదుపులోకి తీసుకున్నారు.గాజీపూర్ పోలీసు సూపరింటెండెంట్ డాక్టర్ ఇరాజ్ రాజా మీడియాతో మాట్లాడుతూ “సోనమ్ ఫోన్ చేసిన తర్వాత ఆమె కుటుంబం మధ్యప్రదేశ్ పోలీసులకు సమాచారం ఇచ్చింది. దీంతో, మధ్యప్రదేశ్ పోలీసులు గాజీపూర్ పోలీసులను సంప్రదించారు. అనంతరం సోనమ్ను దాబా నుంచి అదుపులోకి తీసుకుని వన్ స్టాప్ సెంటర్కు తరలించారు” అని అన్నారు.కాశీ దాబా నిర్వాహకుడు సాహిల్ యాదవ్ ఆ రోజు జరిగిన ఘటనను గుర్తుచేసుకుంటూ “సోనమ్ తన కుటుంబంతో మాట్లాడాలని నా ఫోన్ అడిగారు. ఆమె కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడుతూ, ఏడవడం ప్రారంభించారు. కొంత సమయం తర్వాత, ఆమె సోదరుడు నాకు ఫోన్ చేసి స్థానిక పోలీసులకు తెలియజేయమని కోరారు. పోలీసులు వచ్చి రాత్రి 2:30 గంటల ప్రాంతంలో ఆమెను తీసుకెళ్లారు” అని అన్నారు.
దాబా వద్దకు ఎలా చేరుకున్నారని సోనమ్ను అడిగితే ఆమె ఏమీ చెప్పలేదని సాహిల్ చెప్పారు.
“గాజీపూర్ పోలీసులు సోనమ్ను అదుపులోకి తీసుకున్నట్లు షిల్లాంగ్ పోలీసుల ద్వారా నిన్న రాత్రి సమాచారం అందింది. షిల్లాంగ్ పోలీసులు ఇందౌర్ పోలీసులతో మాట్లాడారు, ముగ్గురు అనుమానితులున్నట్లు చెప్పారు. అనంతరం, ఇందౌర్, షిల్లాంగ్ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి ఆ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు” అని ఇందౌర్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (క్రైమ్) రాజేష్ దండోటియా బీబీసీకి తెలిపారు.ఆ ముగ్గురిని షిల్లాంగ్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.మేఘాలయ డీజీపీ ఐ నోంగ్రాంగ్ వార్తాసంస్థ పీటీఐతో మాట్లాడుతూ “ఇందౌర్ వ్యక్తి హత్యకు సంబంధించి ఆయన భార్యతో సహా నలుగురిని అరెస్టు చేశారు. హనీమూన్ సమయంలో భర్త హత్యకు ఆమె కుట్ర పన్నిందని, దానిని అమలు చేయడానికి ఇతరుల సహాయం తీసుకుందనే ఆరోపణలున్నాయి” అన్నారు.
సోనమ్ నిర్దోషి అని, ఆమె అలాంటి పని చేయదని ఆమె తండ్రి దేవి సింగ్ అంటున్నారు.
“రెండు కుటుంబాలు, ఇద్దరు పిల్లల సమ్మతితో వివాహం జరిగింది. అక్కడి ప్రభుత్వం (మేఘాలయ) మొదటి నుంచి అబద్ధాలు చెబుతోంది. నా కూతురు గాజీపూర్ వెళ్లి స్వయంగా దాబా నుంచి ఫోన్ చేసింది. పోలీసులు దాబాకు వెళ్లి, ఆమెను అక్కడి నుంచి తీసుకొచ్చారు. నేను సోనమ్తో మాట్లాడలేదు” అని దేవి సింగ్ మీడియాతో అన్నారు.మేఘాలయ పోలీసులు కథలు అల్లుతున్నారని, ఘటనపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.రాజా మృతదేహాన్ని కనుగొన్న తర్వాత, అతని కుటుంబం సోనమ్ రాక కోసం ఎదురుచూసింది. ఇంటి బయట ఒక పెద్ద బోర్డును వేలాడదీసి దానిపై “సోనమ్ రఘువంశీ ఇదంతా అబద్ధం అని చెప్పండి…ఇంటికి ఎప్పుడు తిరిగొస్తారు’’ అని రాశారు.ఇప్పుడు సోనమ్ కనిపించిన తర్వాత, రాజా కుటుంబంలో కోపం స్పష్టంగా కనిపిస్తోంది. మేఘాలయ పోలీసులు సోనమ్పై ఆరోపణలు చేయడంతో, రాజా కుటుంబం సోనమ్ ఫోటోలను తగలబెట్టారు.
“రెండు కుటుంబాల మధ్య పరస్పర అంగీకారంతోనే అంతా జరిగింది. ఇద్దరూ సంతోషంగా ఉన్నారు. సోనమ్ మాతో ఉన్నపుడు ఆమె చాలాకాలంగా మా కుటుంబంలో భాగమైనట్లు అనిపించింది. సోనమ్ ఇలా చేసిందంటే నమ్మలేకపోతున్నాం” అని రాజా తల్లి ఉమా రఘువంశీ అన్నారు.”మా సోదరుడిని కోల్పోయాం. దీనికి బాధ్యులెవరైనా కఠిన శిక్ష పడాలి” అని రాజా సోదరుడు విపిన్ రఘువంశీ అన్నారు.రాజా రఘువంశీ హత్య తర్వాత, మేఘాలయకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో విద్వేషపూరిత పోస్టులు చేశారని ఆ రాష్ట్ర పోలీసులు తెలిపారు.సోషల్ మీడియా పోస్టులను ఖండిస్తూ మేఘాలయ హోం మంత్రి ప్రెస్టోన్ టిన్సాంగ్, సీనియర్ పోలీసు అధికారులు సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు.”రాష్ట్ర ప్రజలను లక్ష్యంగా చేసుకున్న ద్వేషపూరిత సోషల్ మీడియా పోస్ట్లపై సుమోటోగా విచారణ జరుగుతోంది. బాధ్యులపై ఎఫ్ఐఆర్ నమోదవుతుంది” అని ఒక పోలీసు అధికారి అన్నారు.
మేఘాలయ సురక్షితమని, రాష్ట్రానికి వ్యతిరేకంగా కథనాలు సృష్టించవద్దని హోం మంత్రి టిన్సాంగ్ విజ్ఞప్తి చేశారు.
రాజా రఘువంశీ-సోనమ్ వివాహానికి సంబంధించిన విషయాలు తాజాగా వెలుగులోకి వస్తున్నాయి. రాజా రఘువంశీతో పెళ్లి కుదిర్చిన సమయంలో సోనమ్ తన తల్లితో గొడవకు దిగినట్లు తెలుస్తోంది. రాజాను పెళ్లి చేసుకోనని.. అన్నయ్య కంపెనీలో పని చేస్తున్న రాజ్ కుష్వాహాను ప్రేమించానని.. అతడినే పెళ్లి చేసుకుంటానని తేల్చి చెప్పింది. అందుకు తల్లి తీవ్ర అభ్యంతరం చెప్పింది. దీంతో రాజా రఘువంశీని పెళ్లి చేసుకుంటాను.. కానీ తర్వాత తీవ్ర పరిణామాలు ఉంటాయని సోనమ్ తన తల్లిని బెదిరించింది. అన్నట్టుగానే సోనమ్ అన్నంత పని చేసింది.సోనమ్.. తల్లిదండ్రుల మాట కాదనలేకే రాజాను పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. పెళ్లి చేసుకున్నాక ఏం చేస్తానో మీరే చూడండి.. అందరూ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవల్సి వస్తుందని సోనమ్ ముందే హెచ్చరించినట్లుగా సోదరుడు తెలిపాడు. కానీ రాజాను చంపేస్తుందని మాత్రం ఎవరూ ఊహించలేదని వర్గాలు పేర్కొన్నాయి. సోనమ్, రాజ్ కుష్వాహాకు తెలిసిన ముగ్గురు సహచరులతోనే హత్యకు ప్లాన్ చేయడం విశేషం. డబ్బు కోసం కక్కుర్తి పడి ముగ్గురు కూడా హత్యకు ఒప్పుకున్నారు. ఇదంతా కావాలనే తన సోదరి చేసిందని పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో సోనమ్ సోదరుడు విపిన్ పేర్కొన్నాడు.
రాజా రఘువంశీ హత్య కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భర్త హత్యకు కర్త, కర్మ, క్రియ మొత్తం భార్య సోనమ్ రఘువంశీనే అని మేఘాలయ పోలీసులు తేల్చారు. మే 11న రాజా రఘువంశీ-సోనమ్ వివాహం జరిగింది. పెళ్లైన వెంటనే రాజా హత్యకు సోనమ్ స్కెచ్ గీసింది. 3 రోజులు అత్తగారింట్లో ఉంది. ఆ 3 రోజులు ఆయా కారణాలు చెప్పి భర్తకు దూరంగా ఉంది. ఆ సమయంలోనే ప్రియుడు రాజ్ కుష్వాహాకు సోనమ్ మెసేజ్ పెట్టింది. భర్తతో సన్నిహితంగా ఉండలేకపోతున్నానని చెప్పింది. 3 రోజుల తర్వాత ఉత్తరప్రదేశ్లోని పుట్టింటికి వచ్చేసింది. పుట్టింటికి రాగానే ప్రియుడు రాజ్ కుష్వాహాతో కలిసి భర్తను చంపేందుకు ప్లాన్ వేసింది. దీంతో రూ.4 లక్షలకు కిరాయి హంతకులను పురమాయించింది. నిందితులు గౌహతికి వెళ్లాలని సూచించారు. కానీ సోనమ్, ఆమె ప్రియుడు మాత్రం మేఘాలయ టూర్ ప్లాన్ చేశారు.ఇక మే 20న భర్త రాజాతో కలిసి సోనమ్ మేఘాలయకు వచ్చింది. ఈ జంటను హంతక ముఠా వెంటాడుతోంది. స్థానికంగా ఒక స్కూటీని తీసుకుని జంట విహరిస్తూ ఉండేది. ఎక్కడికెళ్లినా సోనమ్.. ప్రియుడికి లొకేషన్ పంపిస్తూ ఉండేది. అలా జంటను కిరాయి ముఠా వెంటాడుతూ ఉండేది.
నూతన జంట తొలుత బెంగళూరుకు వచ్చారు. అక్కడ సోనమ్ నియమించుకున్న హంతక ముఠా కలిశారు. కిరాయి హంతకులు కూడా సోనమ్ నివాసం ఉంటున్న ప్రాంతానికి చెందిన వారే. దీంతో ముఠా సభ్యులు.. కొత్త జంటతో ముచ్చటించారు. తెలిసిన వారు మాట్లాడుతున్నారని రాజా రఘువంశీ అనుమానించలేకపోయాడు. అక్కడ నుంచి నేరుగా ఈశాన్యానికి కనెక్టింగ్ విమానంలో జంట ప్రయాణించింది.భర్తతో ఉండలేకే సోనమ్ హంతకులను నియమించుకుందని.. ప్రేమికుడితో కలిసి జీవించాలని డిసైడ్ అయిందని పోలీసులు తెలిపారు. పక్కా ప్లాన్తో వన్ వే టికెట్ ప్లాన్ చేసుకున్నట్లు పోలీసులు తేల్చారు. ఇక ప్రియుడు మేఘాలయకు రాకపోయినా సోనమ్ నిత్యం టచ్లోనే ఉందని పోలీస్ వర్గాలు పేర్కొన్నాయి. ఇక నిందితులు మే 21న గౌహతిలో జంటను వెంబడించారని.. జంట ఉన్న హోటల్లోనే బస చేశారని సీసీకెమెరాల్లో రికార్డైన దృశ్యాలను బట్టి గుర్తించారు.
ఇక మే 23న మేఘాలయలోని సోనమ్-రాజా రఘువంశీ జలపాతాన్ని చూసేందుకు నిటారుగా ఉన్న శిఖరానికి ట్రెక్కింగ్ చేశారు. హంతక ముఠా కూడా వారిని అనుసరించింది. ఒకానొక సమయంలో సోనమ్ అలసిపోయినట్లు నటించింది. దీంతో భర్త ముందుకు నడుచుకుంటూ వెళ్లాడు. హంతకులు కూడా చాలా దూరంగా ఉన్నారు. ఇంతలో భర్త ఒక నిర్జన ప్రదేశానికి చేరుకున్నాడు. ఇదే అనుకూల సమయమని వెంటనే చంపాలని కిరాయి ముఠాను సోనమ్ ప్రేరేపించింది. కానీ అలసిపోయామని.. ఇప్పుడు సాధ్యం కాదని ముఠా తేల్చి చెప్పింది. వెంటనే సోనమ్.. హంతకులకు రూ.20లక్షలు ఆఫర్ చేసింది. తక్షణమే తన భర్తను చంపితే రూ.20లక్షలు ఇస్తానని చెప్పుడంతో కిరాయి ముఠా.. రాజా రఘువంశీని కొట్టి చంపేశారు. భర్త చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత ముఠాతో కలిసి మృతదేహాన్ని స్వయంగా సోనమ్ లోయలోకి తీసేసింది. రాజా పోస్ట్ మార్టం రిపోర్టులో తల వెనుక మరియు ముందు భాగంలో రెండుసార్లు దెబ్బలు తగిలినట్లుగా తేలింది.
మే 23న జంట అదృశ్యమైంది. పోలీసులు రంగంలోకి దిగి జల్లెడ పట్టగా జూన్ 2న లోయలో రాజా రఘువంశీ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇక సోనమ్ ఆచూకీ కోసం గాలిస్తుండగా జూన్ 9న యూపీలోని ఘాజీపూర్లో లొంగిపోయింది. అనంతరం హత్యలో పాల్గొన్న సోనమ్ ప్రియుడు రాజ్ కుష్వాహా, విశాల్ చౌహాన్, ఆకాష్ రాజ్పుత్, ఆనంద్ కుర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు.ఇక భర్తను చంపేసిన తర్వాత సోనమ్.. మేఘాలయ నుంచి ఇండోర్కు వచ్చేసింది. అక్కడ ప్రేమికుడు రాజ్ కుష్వాహాను కలిసింది. అక్కడ ఒక అద్దె గది తీసుకుని బస చేశారు. అనంతరం కారు అద్దెకు తీసుకుని యూపీకి వెళ్లిపోయారు.