కర్ణాటక హవేరి జిల్లాలో జనవరి 2024లో చోటుచేసుకున్న సామూహిక అత్యాచారం కేసులో నిందితులుగా ఉన్న ఏడుగురు వ్యక్తులు ఇటీవల బెయిల్పై విడుదలయ్యారు. అయితే, వీరికి జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే ర్యాలీతో స్వాగతం పలకడం వివాదాస్పదమైంది. హవేరి సబ్ జైలు నుంచి అక్కి ఆళూరు పట్టణం వరకు జరిగిన ఈ ఊరేగింపులో ఐదు కార్లు, దాదాపు 20 మంది మద్దతుదారులు పాల్గొన్నారు.
నిందితులు..అఫ్తాబ్ చందనకట్టి, మదర్ సాబ్ మండక్కి, సమీవుల్లా లాలనవార్, మొహమ్మద్ సాదిక్ అగాసిమని, షోయబ్ ముల్లా, తౌసిఫ్ చోటి, రియాజ్ సావికేరి.. బెయిల్ పొందిన అనంతరం ఈ ఊరేగింపులో పాల్గొన్నారు. ఈ ఊరేగింపు వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా పంచుకోవడంతో నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. అధికారికంగా ఇంకా ఫిర్యాదు నమోదుకాలేదు కానీ, పోలీసులు వీడియోల నిజనిజాలు తెలుసుకుంటున్నారు.
ఈ కేసు ఘటనపై బాధితురాలు ఇచ్చిన మేజిస్ట్రేట్ స్టేట్మెంట్ ప్రకారం, జనవరి 7న హవేరిలోని ఓ హోటల్లో యువతిపై అత్యాచారం దాడి చేసి, ఆమెను బలవంతంగా బయటకు తీసుకెళ్లి, లాడ్జి సమీపంలో వదిలేసినట్టు తెలిపింది. పోలీసులు జనవరి 10న కేసు నమోదు చేశారు. నిందితులపై సామూహిక అత్యాచారం, కిడ్నాప్, దాడి, బెదిరింపు వంటి పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.
తాజాగా బాధితురాలు కోర్టులో నిందితులను గుర్తించలేకపోవడంతో హవేరి సెషన్స్ కోర్టు వారికి బెయిల్ మంజూరు చేసింది. అయితే, దీనిక్రితం పోలీసులు సమర్పించిన ఆధారాలు ఇంకా విచారణలో ఉన్నాయని తెలుస్తోంది. ఇదిలా ఉండగా, నిందితుల్లో కొందరు గతంలోనూ పలు దాడులు చేసినట్లు పోలీసు దర్యాప్తులో తేలినట్లు సమాచారం.