ఇండియా విమానం కూలిన విషయం తెలిసిందే. గత గురువారం అహ్మదాబాద్ నుంచి లండన్ బయల్దేరిన బోయింగ్ డ్రీమ్లైనర్ రకానికి చెందిన విమానం టేకాఫ్ అయిన నిమిషాల్లోనే బీజే మెడికల్ కాలేజ్ బిల్డింగ్ను ఢీ కొట్టి కూలిపోయింది. ఆ సమయంలో అక్కడ 1000 డిగ్రీల ఉష్ణోగ్రతతో మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున పొగ కమ్ముకుంది. అయితే, విమాన ప్రమాద ప్రాంతంలో ప్రయాణికుల లగేజ్, విమాన శిథిలాలు చెల్లా చెదురుగా పడ్డాయి. ఇక ప్రమాదం అనంతరం ఘటనాస్థలి వద్ద పెద్ద మొత్తంలో బంగారు ఆభరణాలు, నగదును అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. 56 ఏళ్ల రాజూ పటేల్ అనే వ్యాపారి తన బృందంతో అక్కడికి చేరుకొని సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ముందు 20 నిమిషాల పాటూ మంటల కారణంగా అక్కడికి చేరుకోలేకపోయారు. ఆ తర్వాత కొద్దిసేపటికే చీరలు, బెడ్ షీట్లతో గాయపడిన వారిని తరలించినట్లు రాజూ పటేల్ తెలిపారు. ఈ క్రమంలో అక్కడ 70 తులాల బంగారు ఆభరణాలు (దాదాపు 800 గ్రాములు), రూ.80 వేల నగదు, భగవద్గీత, పాస్పోర్ట్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. వాటిని అధికారులకు అప్పగించినట్లు పేర్కొన్నారు. ఘటనాస్థలి వద్ద స్వాధీనం చేసుకున్న వస్తువులను బంధువులకు తిరిగి అప్పగిస్తామని హోం శాఖ సహాయ మంత్రి హర్ష్ సంఘవి తెలిపారు.